
బాపట్ల ఎస్పీగా బి. ఉమామహేశ్వర్
ఎస్పీ తుషార్ డూడీ చిత్తూరుకు బదిలీ
బాపట్ల టౌన్: రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఎస్పీల బదిలీల్లో భాగంగా బాపట్ల జిల్లా ఎస్పీ తుషార్డూడీ చిత్తూరు జిల్లాకు ప్రభుత్వం బదిలీ చేసింది. ఆయన గతేడాది జులై 17న బాపట్ల జిల్లాకు ఎస్పీగా నియమితులయ్యారు. 14 నెలలపాటు ఎస్పీగా విధులు నిర్వర్తించారు. ఆయన స్థానంలో సీఐడీలో పని చేస్తున్న బి. ఉమామహేశ్వర్ను నియమిస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన డీఎస్పీగా పోలీస్ శాఖలో చేరారు. గతంలో గుంటూరు జిల్లాలోని గురజాల, కడప, తెలంగాణ రాష్ట్రంలోని అదిలాబాద్లో డీఎస్పీగా పని చేశారు. అడిషనల్ ఎస్పీగా అదిలాబాద్, వరంగల్ అర్బన్లో సేవలందించారు. ఎస్పీగా ఇంటిలిజన్స్, విజిలెన్స్ విభాగాల్లో పని చేశారు. ప్రస్తుతం సీఐడీలో పని చేస్తూ బదిలీపై బాపట్లకు ఎస్పీగా వస్తున్నారు.
కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్
బాపట్ల: ప్రభుత్వ పథకాలను పకడ్బందీగా అమలు చేస్తామని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభు త్వం ఆదేశాల మేరకు శనివారం బాపట్ల జిల్లా కలెక్టర్గా ఆయన బాధ్యతలు స్వీకరించారు. జిల్లా ఇన్చార్జి జాయింట్ కలెక్టర్ గంగాధర్ గౌడ్, కలెక్టరేట్ ఏఓ మల్లికార్జునరావు, వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం కలెక్టర్ మీడియాతో మాట్లాడారు. దీనికి ముందు అనంతపురం జిల్లాలో 18 నెలల పాటు కలెక్టర్గా బాధ్యతలు నిర్వహించినట్లు తెలిపారు. ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పనతో పాటు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు.అనంతరం కలెక్టరేట్లోని సమావేశాల హాల్స్, రెవెన్యూ శాఖ పరిధిలో పలు విభాగాలు, ల్యాండ్ రికార్డ్స్, ఆర్డీఓ కార్యాలయాలు, ఆవరణలోని పరిసరాలను పరిశీలించి అధికారులకు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. వివిధ శాఖల జిల్లా అధికారులు, బాపట్ల, చీరాల ఎమ్మెల్యేలు నరేంద్ర వర్మ, కొండయ్యలు కలెక్టర్ని మర్యాదపూర్వకంగా కలసి బొకేలు అందజేశారు.
జిల్లా జడ్జి కె.శ్యామ్బాబు
బాపట్ల: స్థానిక జిల్లా కోర్టుల సముదాయంలో మండల న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో శనివారం జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. జిల్లా ఆరవ అదనపు జిల్లా జడ్జి కె.శ్యామ్బాబు అధ్యక్షతన మూడు బెంచీలు ఏర్పాటు చేశారు. 239 కేసులకు గానూ రూ.1.32 కోట్ల లావాదేవీలను పరిష్కరించారు. ఇందులో 25 సివిల్, 212 క్రిమినల్, రెండు ప్రీలిటిగేషన్ కేసులు ఉన్నాయి. కార్యక్రమంలో ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి జి.వాణి, ఎం.పవన్కుమార్, అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గవిని శ్రీనివాసరావు, బాపట్ల బార్ అసోసియేషన్ అధ్యక్షులు కంచర్ల అవినాష్ ,లోక్ అదాలత్సభ్యులు బీమా లీలాకృష్ణ, కమల్కుమార్, కిరణ్కుమార్ పాల్గొన్నారు.
కప్తానుపాలెం(మోపిదేవి): మండలంలోని కప్తానుపాలెం వద్ద 216 జాతీయ రహదారిపై శనివారం రాత్రి 7.30 గంటల సమయంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో పాస్టర్ కొక్కిలిగడ్డ జక్రయ్య(54) అక్కడికక్కడే మృతి చెందారు. స్థానిక ఎస్ఐ సత్యనారాయణ తెలిపిన వివరాల మేరకు.. బాపట్ల జిల్లా జువ్వలపాలేనికి చెందిన జక్రయ్యబాబు తన అత్తగారి ఊరు అయిన చల్లపల్లి మండలం పాగోలుకు పనిమీద వచ్చి ద్విచక్ర వాహనంపై తిరిగి వెళుతున్నారు. మార్గంమధ్యలో కప్తానుపాలెం వద్ద ఎదురుగా వస్తున్న కారుని బలంగా ఢీకొన్నారు. ఈ ప్రమాదంలో జక్రయ్యబాబు అక్కడికక్కడే మృతి చెందారు. అవనిగడ్డ డీఎస్పీ విద్యశ్రీ , చల్లపల్లి సీఐ ఈశ్వరరావు ఘటనా స్థలంకు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. మృతదేహాన్ని అవనిగడ్డ ప్రభుత్వాసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.

బాపట్ల ఎస్పీగా బి. ఉమామహేశ్వర్

బాపట్ల ఎస్పీగా బి. ఉమామహేశ్వర్