
మంత్రి ఎదుటే తమ్ముళ్ల బాహాబాహి
జే.పంగులూరు: నియోజకవర్గంలో తెలుగు తమ్ముళ్ల పరిస్థితి రోజురోజుకూ దయనీయంగా మారుతోంది. మంత్రిగారి ఇలాఖాలో పార్టీని ముప్పుతిప్పలు పెడుతున్నారు. ఏకంగా విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ముందే బాహాబాహికి దిగారు. వివరాల్లోకి వెళ్తే.. సోమవారం పంగులూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థినులకు సైకిళ్ల పంపిణీ చేశారు. కార్యక్రమం జరుగుతుండగా నూజిళ్లపల్లి గ్రామానికి చెందిన రెండు తెలుగుదేశం పార్టీ గ్రూపులు మంత్రి ఎదుట బాహాబాహీకి దిగాయి. గ్రామంలో ఆధిపత్యం కోసం గొడవడ్డారు. ఈ క్రమంలో ఒకరినొకరు తోసుకుంటుండగా మంత్రి కలుగజేసుకొని, సర్ది చెప్పారు. అయినా కూడా నేతలు వినలేదు. కార్యక్రమం అనంతరం మంత్రి వెళ్లగానే మళ్లీ గొడవకు దిగారు. ఈ తతంగాన్ని చూసి అక్కడ ఉన్న ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామపెద్దలు నివ్వెరపోయారు. ఆఖరుకు పాఠశాలలో కూడా పార్టీ గోల ఏమిటని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో అక్కడ ఉన్న నాయకులు కల్పించుకొని సర్ది చెప్పారు.
పులిచింతలకు 3,41,297
క్యూసెక్కులు విడుదల
సత్రశాల(రెంటచింతల): మండలంలోని సత్రశాల వద్ద నున్న నాగార్జునసాగర్ టెయిల్పాండ్ విద్యుత్ ప్రాజెక్టు రిజర్వాయర్ నుంచి 19 క్రస్ట్గేట్లు ద్వారా 3,41,297 క్యూసెక్కులు పులిచింతలకు విడుదల చేసినట్లు ప్రాజెక్టు ఎస్ఈ వెంకటరమణ, ఈఈ సుబ్రమణ్యం సోమవారం తెలిపారు. టెయిల్పాండ్ రిజర్వాయర్ నిండుకుండలా ఉందన్నారు. టెయిల్పాండ్ ప్రాజెక్టు రిజర్వాయర్ 19 క్రస్ట్గేట్లు 3.50 మీటర్లు ఎత్తు ఎత్తి 3,41,297 క్యూసెక్కులు దిగువనున్న పులిచింతల ప్రాజెక్ట్కు విడుదల చేస్తున్నట్లు తెలిపారు. ప్రాజెక్టు నీటి మట్టం 75.50 మీటర్లకు గాను 74.47 మీటర్లకు నీరు చేరుకుందన్నారు. రిజర్వాయర్ గరిష్ట సామర్థ్యం 7.080 టీఎంసీలకుగాను ప్రస్తుతం 6.389 టీఎంసీలు ఉందన్నారు. టీఆర్సీ లెవల్ 62.08 మీటర్లకు చేరుకుందన్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులోని రెండు యూనిట్ల ద్వారా విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేసినట్లు వెల్లడించారు. నాగార్జునసాగర్ నుంచి వచ్చే వరదను బట్టి దిగువనున్న పులిచింతలకు నీటిని విడుదల చేస్తామని తెలిపారు.
సత్తెనపల్లి: అత్యంత పురాతన ప్రభుత్వ రంగ సంస్థ పోస్టల్. ఎప్పుడో బ్రిటిష్ కాలంలో ప్రారంభమైన తపాలా వ్యవస్థ ఇప్పటికీ పటిష్టంగా కొనసాగుతోంది. మారుతున్న కాలానికి అనుగుణంగా సరికొత్త పుంతలు తొక్కుతోంది. సంస్కరణల్లో భాగంగా ‘రిజిస్టర్ పోస్టు’ సర్వీసుకు స్వస్తి పలికింది. 171 ఏళ్లు సేవలందిస్తున్న రిజిస్టర్ పోస్టు సర్వీసును ఆగస్టు 30తో నిలిపివేశారు. దీనిని స్పీడ్ పోస్ట్లో విలీనం చేశారు. దేశవ్యాప్తంగా నడుస్తున్న పోస్టల్ కార్యాలయాల్లో ఈ విధానం అమల్లోకి వచింది. ఇప్పటికే పోస్టల్ వినియోగదారులకు నాణ్యమైన సులభతరమైన సేవలు అందించ టానికి నూతన సాఫ్ట్వేర్ను అమలు చేస్తున్నారు. అందులో భాగంగానే రిజిస్టర్ పోస్టు సేవలకు సెలవు ప్రకటించారు. ఈ సేవలను రద్దుచేసి స్పీడ్ పోస్ట్ ద్వారా స్థానికంగా అయితే అదే రోజు, ఇతర ప్రాంతాలకు మరుసటి రోజు చేరే విధంగా చర్యలు చేపడు తున్నారు. దీంతో పౌర సేవలు వేగవంతం సులభతరం అవుతాయని తపాలా శాఖ అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ ఒకటి నుంచి స్పీడ్ పోస్ట్ విధానం మాత్రమే అందుబాటులోకి రానుంది.