
పల్నాడు జిల్లాకు గుర్రం జాషువా పేరు పెట్టాలి
పిడుగురాళ్ల: పల్నాడు జిల్లాకు గుర్రం జాషువా పేరు పెట్టాలని అంబేడ్కర్ ప్రచార సేవా సమితి డేగల అబ్రహం డిమాండ్ చేశారు. ఆదివారం దళిత సేవాదళ్ రాష్ట్ర అధ్యక్షుడు తాళ్లూరి అమర్ నాథ్ అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. దళిత మహాసభ పల్నాడు జిల్లా అధ్యక్షులు పిల్లి చెన్నారావు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో కూడా మేము ప్రభుత్వానికి అర్జీలు ఇచ్చినట్లు పేర్కొన్నారు. జాషువా కళా సమితి అధ్యక్షుడు బత్తుల దాసు మాట్లాడుతూ గుర్రం జాషువా జిల్లా పెట్టాలని దళితుల కోరిక అన్నారు. గబ్బిలం అనే రచన ద్వారా జాషువా ప్రజలను చైతన్యం చేసినట్లు కొనియాడారు. 85 శాతం ప్రజల ఆకాంక్ష పల్నాడు జిల్లాకు జాషువా పేరు పెట్టాలని చెప్పారు. కార్యక్రమంలో పల్నాడు జిల్లా బలహీన వర్గాల ఐక్యవేదిక అధ్యక్షులు నల్లబోతుల రాజు, హ్యూమన్ రైట్స్ పల్నాడు జిల్లా వైస్ చైర్మన్ బి.జీవరత్నం, మాలమహానాడు పాశం శ్యామ్, బీసీ సంక్షేమ శాఖ జిల్లా అధ్యక్షులు జక్కుల కృష్ణయాదవ్, దళిత సేవా దళ్ తళ్లూరి సురేంద్ర పాల్గొన్నారు.
గుంటూరు రూరల్: అక్రమ సంబంధానికి భర్త అడ్డుగా వస్తున్నాడని ప్రియుడితో కలిసి హత్య చేసిన సంఘటనలో నిందితులను నల్లపాడు పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. నగరంలోని సౌత్ డీఎస్పీ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ జి. భానోదయ వివరాలు వెల్లడించారు. రూరల్ మండలం గోరంట్ల పరిధిలోని మేరీప్రియనగర్కు చెందిన మున్నంగి ప్రదీప్ (43) కనిపించటంలేదని అతని తల్లి రెజీనా గత వారం నల్లపాడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసుగా నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇందులో ప్రదీప్ భార్య మరియమ్మ పెదకాకాని మండలం వెనిగళ్ల గ్రామానికి చెందిన యాదాల సాంబశివరావుతో కలసి ఉంటోందని కనుగొన్నారు. దీనిపై ప్రదీప్ భార్యను పలు మార్లు మందలించాడని కూడా తెలిసింది. ఆ కోణంలో విచారించగా మరియమ్మ తన ప్రియుడు సాంబశివరావుతో భర్తను హత్య చేయాలని పథకం రచించిందని తేలింది. ఈనెల 23న మరియమ్మ ప్రియుడు యాదాల సాంబశివరావు స్నేహపూర్వకంగా మద్యం తాగుదామని ప్రదీప్ను ఆటోలో తీసుకెళ్లాడు. ముందుగా వేసుకున్న పథకం ప్రకారం ప్రదీప్తో ఎక్కువ మొత్తంలో మద్యం తాగించి, అతడిని బొల్లాపల్లి మండలం నెహ్రూనగర తండా మార్గంలో గల మట్టిరోడ్డు వద్దకు తీసుకెళ్లాడు. అక్కడ నిర్జన ప్రదేశంలో ప్రదీప్ను కర్చీఫ్తో ముక్కు, నోరు మూసి, లుంగీ ముక్కను మెడకు చుట్టి హత్య చేశాడు. ప్రదీప్ మరణించిన సమాచారాన్ని మరియమ్మకు తెలుపగా, ఆమె జాగ్రత్తగా ఆధారాలు లేకుండా చేసి రావాలని చెప్పినట్లు నిందితుడు విచారణలో తెలిపాడు. విచారణలో నిందితులు ఇద్దరు హత్యానేరాన్ని ఒప్పుకోవడంతో పోలీసులు అరెస్ట్ చేసి, కోర్టుకు అప్పగించగా న్యాయమూర్తి రిమాండ్ విధించారు. నిందితులిద్దరిని 14 గంటల్లోనే అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ తెలిపారు. కేసును చాకచక్యంగా పరిష్కరించిన నల్లపాడు పోలీస్ స్టేషన్ ఎస్ఐ రామకృష్ణ, సిబ్బంది యానాది, మస్తాన్, భిక్షాలు నాయక్లను జిల్లా ఎస్పీ అభినందించినట్లు ఆయన చెప్పారు.