
కళాశాలల్లో రెడ్ రిబ్బన్ క్లబ్లు ఏర్పాటు చేయాలి
జిల్లా ఎయిడ్స్ నియంత్రణాధికారి డాక్టర్ మురళీకృష్ణ
నరసరావుపేట ఈస్ట్: జిల్లా పరిధిలో అన్ని యాజమాన్యాలలోని జూనియర్ కళాశాలల్లో రెడ్ రిబ్బన్ క్లబ్లను ఏర్పాటు చేయాలని జిల్లా లెప్రసీ, ఎయిడ్స్, టీబీ నియంత్రణాధికారి డాక్టర్ కె.మురళీకృష్ణ తెలిపారు. రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలి ఆదేశాల మేరకు ఆరోగ్యశాఖలో భాగమైన ఇంటిగ్రేటేడ్ స్ట్రాటజీ ఫర్ హెచ్ఐవి, ఎయిడ్స్ (దిశ) ఆధ్వర్యంలో గురువారం హార్డ్ జూనియర్ కళాశాలలో జిల్లా స్థాయి రెడ్ రిబ్బన్ క్విజ్ నిర్వహించారు. డాక్టర్ మురళీకృష్ణ మాట్లాడుతూ కళాశాలల్లో రెడ్ రిబ్బన్ క్లబ్లు ఏర్పాటు చేయటం ద్వారా విద్యార్థులలో ఎయిడ్స్ అవగాహన పెరిగి నియంత్రణకు అవకాశం కలుగుతుందని తెలిపారు. జిల్లా ఇంటర్మీడియేట్ విద్యాశాఖాధికారి ఎం.నీలావతిదేవి మాట్లాడుతూ కళాశాలల్లో రెడ్ రిబ్బన్ క్లబ్లు ఏర్పాటుకు ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు అందాయని తెలిపారు. ఈమేరకు అన్ని ఇంటర్ కళాశాలల్లో క్లబ్ల ఏర్పాటు చేస్తున్నట్టు వివరించారు. కార్యక్రమంలో జిల్లా క్లస్టర్ ప్రోగ్రామ్ మేనేజర్ జానీబాషా, హ్యాండ్స్ ఆఫ్ కంపాషన్ ప్రాజెక్ట్ మేనేజర్ ఉదయరాజు, సిఎస్సీ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ మహమ్మద్గౌస్ తదితరులు పాల్గొన్నారు.
ఫ్లోర్ బాల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఓగిరాల
నరసరావుపేట ఈస్ట్: ఆంధ్రప్రదేశ్ ఫ్లోర్ బాల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఓగిరాల వెంకట రాహుల్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కే–రిడ్జి పాఠశాలలో గురువారం నిర్వహించిన రాష్ట్రస్థాయి ఫ్లోర్ బాల్ పోటీలలో భాగంగా అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించి తనను అధ్యక్షుడిగా ఎన్నుకున్నట్టు వెంకటరాహుల్ తెలిపారు. రాష్ట్రంలో ఇప్పుడిప్పుడే గుర్తింపు పొందుతున్న ఫ్లోర్ బాల్ క్రీడాభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. అసోసియేషన్ను మండల స్థాయి నుంచి ఏర్పాటుచేసి ఫ్లోర్ బాల్ పట్ల విద్యార్థులకు అవగాహన కల్పిస్తామన్నారు. అసోసియేషన్ అభివృద్ధికి నిధులు సమకూర్చేందుకు కృషి చేస్తానని తన వంతుగా రూ.1.10 లక్షలు అందిస్తానని తెలిపారు.
రణక్షేత్రంలో వీరాచారుల సందడి
కారెంపూడి: పల్నాటి వీరాచారులు పల్నాటి రణక్షేత్రం కారెంపూడిలో గురువారం తమ పూర్వీకులైన పల్నాటి వీరులకు పీఠాధిపతి పిడుగు తరుణ్ చెన్నకేశవ ఆధ్వర్యంలో ప్రత్యేక క్రతువులు నిర్వహించారు. గుంటూరులోని గుజ్జనగుండ్లకు చెందిన సింగంశెట్టి వెంకటే ష్ కుంటుంబీకులతో పాటు వివిధ ప్రాంతాల నుంచి ఆచారవంతులు బస్సుల్లో తరలివచ్చారు. పల్నాటి వీరుల గుడి ఆవరణ నుంచి బ్రహ్మనాయుడు ఆయుధం నృసింహకుంతంతో పాటు పల్నాటి వీరుల ఆయుధాలకు వైభవంగా గ్రామోత్సవం నిర్వహించారు. చెన్నకేశవస్వామి, అంకాలమ్మ తల్లిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఇదిలా ఉంటే ఏదో ఒక ప్రాంతం నుంచి పల్నాటి వీరాచారవంతులు రణక్షేత్రానికి వస్తున్నారు.