
హిందూ ధర్మ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత
రేపల్లె: హిందూ ధర్మ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని సమరత సేవా ఫౌండేషన్ బాపట్ల జిల్లా ధర్మ ప్రచారక్ జంజనం హేమశంకరరావు అన్నారు. నిజాంపట్నంలోని శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయ ప్రాంగణంలో శనివారం జరిగిన సమరత సేవా ఫౌండేషన్ మండల కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. హిందూ ధర్మ పరిరక్షణ లక్ష్యంగా సమరత సేవా ఫౌండేషన్, టీటీడీ శ్రీవాణి ట్రస్టుల ఆధ్వర్యంలో గ్రామీణ ప్రాంతాలలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల్లో భక్తి భావం పెంపొందిస్తున్నామన్నారు. హనుమాన్ జయంతి ఉత్సవాలను ఘనంగా జరిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈనెల 18వ తేదీన గరువుపాలెం నుంచి నగరం వరకు జరిగే హనుమాన్ శోభాయాత్రలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. సమావేశంలో మహిళా కన్వీనర్ కొత్తగుండు సుగునార్దిని, సభ్యులు అక్కల సుబ్బారెడ్డి, పాండురంగారావు, మహేంద్రకుమార్, వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.
హెడ్ కానిస్టేబుల్ మృతి
యద్దనపూడి: రోడ్డు ప్రమాదంలో సీఆర్పీఎఫ్ హెడ్ కానిస్టేబుల్ మృతి చెందాడు. ఈ ఘటన యద్దనపూడి మండలంలోని గన్నవరం– మార్టూరు దండు దారి మధ్య శనివారం మధ్యాహ్నం జరిగింది. ఎస్సై రత్నకుమారి, మృతుని కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. యద్దనపూడి మండలం పూనూరు గ్రామానికి చెందిన భట్టు రవికృష్ణ (38) అసోంలోని 30వ బెటాలియన్లో సీఆర్పీఎఫ్ హెడ్ కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్నాడు. 15 రోజుల క్రితం సెలవులపై స్వగ్రామం పూనూరు వచ్చాడు. శనివారం మధ్నాహ్నం 12 గంటల ప్రాంతంలో తన ద్విచక్ర వాహనంపై మార్టూరు వెళ్తుండగా వాహనం అదుపుతప్పి రోడ్డుపై పడటంతో తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించటంతో ఘటనా స్థలికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్టూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఇది ఇలా ఉండగా ద్విచక్ర వాహనం రోడ్డు కుడి వైపున పడి ఉండటం గమనార్హం. ఏదైనా భారీ వాహనం వేగంగా రావటంతో దానిని తప్పించబోయే క్రమంలో ఈ ప్రమాదం జరిగి ఉంటుందేమోనని పోలీసులు భావిస్తున్నారు. మృతునికి భార్య, ఇద్దరు కుమారులున్నారు.

హిందూ ధర్మ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత