
ప్రతి మహిళ లక్షాధికారి కావాలి
డీఆర్డీఏ పీడీ కె.శ్రీనివాసరావు
కర్లపాలెం: డ్వాక్రా స్వయం సహాయక సంఘాలలోని ప్రతి మహిళ లక్షాధికారి కావాలని డీఆర్డీఏ పీడీ కె.శ్రీనివాసరావు అన్నారు. మండల సమాఖ్య కార్యాలయంలో శుక్రవారం మండల సమాఖ్య సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన పీడీ శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రతి మహిళను లక్షాధికారిని చేసేందుకు ప్రభుత్వం బ్యాంకుల ద్వారా రుణాలు మంజూరు చేస్తుందని చెప్పారు. మహిళలను వ్యాపార, పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు వారికి కావాల్సిన రుణాలు మంజూరు చేసేందుకు సూక్ష్మరుణ ప్రణాళికలను తయారు చేసినట్లు చెప్పారు. మహిళలు వ్యాపారం, వ్యవసాయం, సేవా రంగాలతో పాటు కుటుంబ అవసరాలకు వారు కోరినంత రుణాలను బ్యాంకుల ద్వారా శ్రీ నిధి ఉన్నతి, సీఐఎఫ్ల ద్వారానే కాక ఇతర ప్రభుత్వ శాఖల నుంచి సబ్సిడీ రుణాలను మంజూరు చేస్తారని చెప్పారు. మహిళలు తీసుకున్న రుణాలు సకాలంలో చెల్లించి సిబిల్ స్కోర్ పెంచుకునే విధంగా కృషి చేయాలన్నారు. సిబిల్ స్కోర్ సక్రమంగా ఉంటే గ్రూపు రుణాలతోపాటు ఉమెన్ లెడ్ ఎంటర్ ప్రైజస్ కింద కోరినంత రుణాలివ్వటానికి బ్యాంకర్లు అనుకూలంగా ఉన్నారని పీడీ చెప్పారు. ఏపీఎం శ్రీనివాసులురెడ్డి మాట్లాడుతూ మహిళలకు ప్రధానమంత్రి సూర్య ఘర్ పథకంలో తమ ఇళ్లపై సోలార్ ప్యానల్ ఏర్పాటు చేసుకునేందుకు ప్రభుత్వం రూ.2.10లక్షల రుణం మంజూరు చేస్తుందని దీనిలో రూ.78వేలు సబ్సిడీ పోగా రూ.1.32లక్షలు ఐదు సంవత్సరాలపాటు వాయిదాల పద్ధతిలో చెల్లించవచ్చని తెలిపారు. సోలార్ ప్యానల్ ఏర్పాటు చేసుకోవటం వలన గృహ విద్యుత్ వినియోగంలో తక్కువ బిల్లు వస్తుందని మన దగ్గర ఉత్పత్తి అయ్యే విద్యుత్ను ప్రభుత్వానికి విక్రయించటం ద్వారా అదనపు ఆదాయం వస్తుందని తెలిపారు. సమావేశంలో మండల సమైఖ్య అధ్యక్షురాలు ధనలక్ష్మి, సమైఖ్య ప్రతినిధులు నసీమా, శివలీలా, ఎంపీడీవో అద్దూరి శ్రీనివాసరావు, ఇండియన్ బ్యాంక్ డీజీఎం గౌరీశంకర్, బ్యాంకు మేనేజర్లు, యూనియన్ బ్యాంక్ మానస, ఇండియన్ బ్యాంక్ మేనేజర్ రత్నజ్యోతి, సీసీలు శివప్రభ, రాఘవ, డ్వాక్రా సమైఖ్య సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.