
బాబు నోరు తెరిస్తే అబద్ధాలే
అద్దంకి: చంద్రబాబు ఎప్పటిలాగానే గత ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడంతో ఆయన చెప్పేవన్నీ అబద్ధాలేనని ప్రజలంతా తెలుసుకున్నారని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి మేరుగ నాగార్జున అన్నారు. స్థానిక పార్టీ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన ‘వెన్నుపోటు దిన’ సమాయత్త సమావేశంలో ముఖ్య అతిథిగా మాట్లాడారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెరవేర్చలేని హామీలు ఎప్పుడూ ఇవ్వలేదని గుర్తు చేశారు. అందుకు విరుద్ధంగా చంద్రబాబు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదన్నారు. మరో వైపు కూటమి ప్రభుత్వ పాలనలో విద్య, వైద్యానికి భరోసా లేకుండా పోయిందని విమర్శించారు. నాడు వ్యవసాయం పండుగగా సాగితే నేడు పంటలను కొనేవారు లేక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నాడు పొగాకు, మిరప రైతులకు వెన్నుదన్నుగా వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఉందన్నారు. నేడు ఒక్క పొగాకు కాడ కూడా కొనుగోలు చేసే స్థితిలో ఈ ప్రభుత్వం లేదన్నారు. నల్లబర్లీ, తెల్లబర్లీ రైతులు పూర్తిగా పీకల్లోతు అప్పుల్లో మునిగిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ప్రతి రైతుకు గిట్టుబాటు ధర లభించిందని గుర్తు చేశారు. పార్టీలతో సంబంధం లేకుండా రైతన్నలకు వైఎస్సార్సీపీ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. చంద్రబాబు మోసపూరిత హామీలు, చేతగానితనాన్ని ఎండగట్టి ప్రజల్లోకి తీసుకెళ్లడం కోసమే ఈ నెల 4న వెన్నుపోటు దినం కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో భాగంగా ర్యాలీ నిర్వహించి స్థానిక తహసీల్దార్కు మోమోరాండం అందజేస్తామని చెప్పారు. మండల పార్టీ నాయకుడు నరసింహారెడ్డి, శ్రీనివాసరెడ్డి, పార్టీ పట్టణ అధ్యక్షుడు కాకాని రాధాకృష్ణమూర్తి, వివిధ మండలాల అధ్యక్షులు గుజ్జుల జగన్మోహన్రెడ్డి, కృష్ణ, నాగేశ్వరరావు, బీసీ సెల్ నాయకుడు గోలి రమణబాబు, కొల్లా భువనేశ్వరి, అవిశెన ప్రభాకర్రెడ్డి, వివిధ మండలాల నాయకులు, వివిధ హోదాల్లో ఉన్న నాయకులు పాల్గొన్నారు.
పావులూరు: సభలో ప్రసంగిస్తున్న మేరుగ నాగార్జున
మాయమాటలు చెప్పి ప్రజలను
మోసగిస్తున్న సీఎం
వెన్నుపోటు దిన ఏర్పాట్లపై సమావేశంలో
వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు
మేరుగ నాగార్జున ధ్వజం
ఇంకొల్లు(చినగంజాం): ఎన్నికల్లో నెరవేర్చలేని హామీలిచ్చి రాష్ట్ర ప్రజలకు సీఎం చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని మాజీ మంత్రి, బాపట్ల జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు మేరుగ నాగార్జున అన్నారు. జూన్ 4న వైఎస్సార్సీపీ తలపెట్టిన వెన్నుపోటు దినం కార్యక్రమం సన్నాహాల్లో భాగంగా ఆదివారం ఇంకొల్లు మండలం పావులూరు గ్రామంలో నిర్వహించిన సభలో మాట్లాడారు. సమాజంలో అసమానతలు పోయేలా నాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సుపరిపాలన అందించారన్నారు. రూ. 2 లక్షల 78 వేల కోట్లు లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసి తాను ఇచ్చిన హామీలకు మించి అమలు చేసిన ఘనత ఆయనదన్నారు. ఏడాది తిరగకుండానే చంద్రబాబు పాలన అవినీతిమయంగా మారిందని విమర్శించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి జూన్ 4 నాటికి ఏడాది అవుతుందని, ఈ కాలంలో తల్లికి వందనం, విద్యార్థులకు విద్య, రైతు భరోసా, ఆరోగ్య శ్రీ వంటి పలు పథకాలను తొలగించి రాష్ట్రంలో అన్ని వర్గాల వారిని దారుణంగా మోసం చేశారన్నారు. కొత్త ఉద్యోగాలు ఇవ్వకపోగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో ఇచ్చిన ఉద్యోగాలను తొలగించి లక్షల మందిని వీధులపాలు చేశారన్నారు. వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన రెడ్డి పిలుపు మేరకు రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో జూన్ 4వ తేదీన చేపట్టిన వెన్నుపోటు దినాన్ని పర్చూరులో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. నాయకులు, కార్యకర్తలు, రైతులు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. పర్చూరు నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇన్చార్జి గాదె మధుసూదన రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలోని రైతులందరికీ మేలు జరిగేలా ఐక్యంగా పోరాటం చేద్దామన్నారు. జిల్లా అధికార ప్రతినిధి బంజారు ప్రభాకరరావు పుట్టినరోజు కార్యక్రమాన్ని పురస్కరించుకొని కేక్ కట్ చేశారు. కార్యక్రమంలో పర్చూరు నియోజకవర్గ పరిధిలోని మండలాల కన్వీనర్లు జంపని వీరయ్య చౌదరి, మున్నం నాగేశ్వరరెడ్డి, కఠారి అప్పారావు, జువ్వా శివరాం ప్రసాద్, చిన్ని పూర్ణారావు, జిల్లా అధికార ప్రతినిధి బండారు ప్రభాకరరావు, ఎస్సీ సెల్ కన్వీనర్ కె. బాబురావు, నియోజకవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షుడు నూతలపాటి బలరాం, సోషల్ మీడియా అధ్యక్షుడు కుమ్మరి చందు, రాష్ట్ర ఎస్సీ సెల్ కార్యదర్శి బిల్లాలి డేవిడ్, అనుబంధ విభాగాల అధ్యక్షులు, ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

బాబు నోరు తెరిస్తే అబద్ధాలే