
రైతులకు సక్రమంగా విద్యుత్ అందించాలి
చీరాల టౌన్: నియోజకవర్గంలోని గ్రామాల్లో ఇసుక నేలల్లో పంటలు పండించే రైతులకు సకాలంలో విద్యుత్ అందించడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని.. సకాలంలో విద్యుత్ అందక పైర్లు ఎండిపోవడంతో రైతులు నష్ట పోతున్నారని వైఎస్సార్సీపీ నియోజకవర్గ రైతు విభాగం అధ్యక్షుడు కె.రమణారెడ్డి అన్నారు. శనివారం మండలంలోని పలు గ్రామాల్లో రైతులు పండిస్తున్న వేరుశనగ, ఆకుకూరలు, కూరగాయలు, పండ్ల తోటలను రైతు విభాగం అధ్యక్షుడు ఆయా గ్రామాల రైతులతో కలిసి పరిశీలించారు. వేరుశనగ పంటలకు సకాలంలో నీరు అందక పంట ఎండిపోతోందని రైతులు తమ గోడును వెళ్లబోసుకున్నారు. ఈ సందర్భంగా రమణారెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అమలు సాధ్యం కాని హామీలిచ్చి గద్దెనెక్కిందని ఫలితంగా ప్రజలు, రైతులు అష్టకష్టాలు పడుతున్నారన్నారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో రైతులకు ఉదయం 6 గంటలకల్లా విద్యుత్ను అందించి పంటల సాగుకు ఇబ్బందులు లేకుండా చేస్తే ప్రస్తుత ప్రభుత్వం ఉదయం 9 గంటలకు కూడా సక్రమంగా రైతులకు విద్యుత్ను అందించలేకపోతుందన్నారు.
చీరాల నియోజకవర్గంలోని కావూరివారిపాలెం నుంచి పందిళ్లపల్లి వరకు ఇసుక భూముల్లో రైతులు పండిస్తున్న పంటలకు సాగునీరును విద్యుత్ పైపుల ద్వారా అందిస్తూ పంటలు పండిస్తున్నారన్నారు. పంటల సాగుకు కావాల్సిన నీరు సకాలంలో అందక పంటలు తెగుళ్ల బారిన పడుతున్నాయని రైతుల దీనగాథలను అర్థం చేసుకోవాలన్నారు. రైతుల పంటలకు కావాల్సిన నీటిని నిర్ణీత వేళల్లోనే అందించి అన్నదాతలను ఆదుకోవాలన్నారు. అన్నదాతలను ఇబ్బందులు పెడితే తగు రీతిలో బుద్ధి చెబుతారని, రైతులకు పంటల సాగుకు కావాల్సిన నీటి సరఫరాకు విద్యుత్ ప్రతి రోజూ ఉదయం 6 గంటలకే అందించి అండగా నిలవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పలు గ్రామాల్లోని రైతులు పాల్గొన్నారు.
వైఎస్సార్సీపీ నియోజకవర్గ రైతు విభాగం అధ్యక్షుడు కె.రమణారెడ్డి