
ధర్మోరక్షతి రక్షితః ట్రస్ట్ భవనం ప్రారంభం
తాడికొండ: హైందవ ధర్మ విశిష్టత ప్రపంచానికి చాటి చెప్పడంలో శివస్వామి కృషి ఎనలేనిదని మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. శనివారం తుళ్లూరు మండలం తాళ్లాయపాలెంలోని శైవ క్షేత్రంలో ధర్మోరక్షతి రక్షితః ట్రస్ట్ నూతన భవనం ప్రారంభోత్సవానికి ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ట్రస్ట్ నూతన భవనం ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. నిర్మాణ దాతలు సతీష్ ఉమరాణి దంపతులకు ధన్యవాదాలు తెలియజేశారు. శివస్వామి ఈ ట్రస్ట్లో 64 సేవా విభాగాలు ఏర్పాటు చేసి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారన్నారు. గో సంరక్షణ ద్వారా ఆరు వేల గోవులను రక్షించి వాటి పోషణ చూసుకోవడం అభినందనీయమన్నారు. మానసారా–మన సారె అనే కార్యక్రమం ద్వారా అనేక రాష్ట్రాల్లో అమ్మవారికి కార్యక్రమాలు నిర్వహిస్తూ సంస్కృతి పట్ల యువతకు అనేక ప్రయోజకర కార్యక్రమాలు అందిస్తున్నారన్నారు. భక్తునిగా శివస్వామికి తాను శిరస్సు వచ్చి పాదాభివందనలు చేస్తున్నారన్నారు. శివస్వామి మాట్లాడుతూ ధర్మోరక్షతి రక్షితహ భవనాన్ని ధార్మిక సేవా భావాలతో 2009 నుంచి నిర్వహిస్తున్నానని తెలిపారు. రాష్ట్రంలో ఎనిమిది వేల మంది ఈట్రస్ట్ కేంద్రంగా పనిచేస్తున్నారన్నారు. పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.
నేడు మార్కెట్ యార్డు చైర్మన్ ప్రమాణ స్వీకారం
వేమూరు: మార్కెట్ యార్డు చైర్మన్గా గొట్టిపాటి పూర్ణకుమారి ప్రమాణ స్వీకారం చేస్తారని యార్డు సెక్రటరీ అంజిబాబు శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఆదివారం సాయంత్రం 4 గంటలకు జరిగే ప్రమాణ స్వీకార మహోత్సవంలో స్థానిక ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు, విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, జిల్లా ఇన్చార్జి మంత్రి కొలుసు పార్థ సారధి, బాపట్ల పార్లమెంట్ సభ్యులు తెన్నేటి కృష్ణప్రసాద్, శాసనమండలి సభ్యులు ఆలపాటి రాజేంద్రప్రసాద్ పాల్గొంటారని తెలిపారు.
రైలు ఢీకొని వ్యక్తి మృతి
నరసరావుపేటటౌన్: ప్రమాదవశాత్తూ రైలు ఢీకొని వ్యక్తి మృతి చెందిన సంఘటన శనివారం పట్టణంలో చోటుచేసుకుంది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రకాష్నగర్కు చెందిన ఇల్లూరి వీరాంజనేయరెడ్డి(38) మొదటి రైల్వే గేటు వద్ద రైలు పట్టాలు దాటుతున్న సమయంలో రైలు ఢీకొంది. సంఘటనలో తీవ్రగాయాలైన వీరాంజనేయరెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న ఇన్చార్జి ఎస్ఐ దీపిక సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించింది. ఈ మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా వైద్యశాలకు తరలించారు.
విద్యుత్ షాక్తో వృద్ధుడు మృతి
చేబ్రోలు: చేబ్రోలు మండలం కొత్త రెడ్డిపాలెం, చెన్నారెడ్డి కాలనీ ఎస్సీ కాలనీకి చెందిన వృద్ధుడు శనివారం ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్కు గురై మృతి చెందాడు. కొత్త రెడ్డిపాలెంకు చెందిన కారుమూరి ధనంబాబు (60) ఇంట్లోని విద్యుత్ మోటారుకు సంబంధించిన వైర్లు ప్రమాదవశాత్తు తగలడంతో విద్యుత్ షాక్కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతునికి భార్య, ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కుటుంబ పెద్దదిక్కు ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్కు గురై మరణించడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. మృతుని కుమారుడు అనారోగ్యానికి గురవడంతో వారి కుటుంబ పోషణ, ఆలనా పాలన కూడా ధనంబాబే చూడాల్సిన పరిస్థితి ఉంది. నిరుపేద కుటుంబానికి చెందిన ధనం బాబు కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని వారి కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు. జరిగిన సంఘటనపై స్థానిక రెవెన్యూ, పోలీస్ అధికారులు పరిశీలించి నివేదికను తయా రుచేసి ఉన్నతాధికారులకు పంపుతున్నట్లు తెలిపారు.

ధర్మోరక్షతి రక్షితః ట్రస్ట్ భవనం ప్రారంభం

ధర్మోరక్షతి రక్షితః ట్రస్ట్ భవనం ప్రారంభం