
ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలి
ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక కన్వీనర్ సోషలిజం
రేపల్లె: ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించటంపై ప్రభుత్వం దృష్టి సారించాలని ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక కన్వీనర్ పీడీ సోషలిజం డిమాండ్ చేశారు. ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో శనివారం తాలూకా సెంటరులో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఉపాధ్యాయ సంఘాలకు ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలన్నారు. ఉపాధ్యాయ సంఘాల సమస్యల పరిష్కారానికి ఇటీవల ప్రభుత్వం నిర్వహించిన చర్చలలో ఎస్జీటీ టీచర్లకు మాన్యువల్గా కౌన్సెలింగ్ నిర్వహిస్తామని హామీ ఇచ్చిందన్నారు. ప్రస్తుతం జరుగుతున్న బదిలీ విభాగంలో సెకండరీ గ్రేడ్ టీచర్ల కౌన్సెలింగ్ విధానాన్ని ఎంఆర్సీల ద్వారా స్క్రోల్ చేస్తూ వెబ్ కౌన్సెలింగ్ నిర్వహిస్తామని ప్రకటించిందన్నారు. ఇది మోసపూరిత చర్య అని ఆందోళన వ్యక్తం చేశారు. వెబ్ కౌన్సెల్ విధానంలో ఉపాధ్యాయులకు అన్యాయం జరిగే అవకాశం ఉందని, మాన్యవల్ కౌన్సెలింగ్ విధానాన్ని అమలు చేయటంతో సమస్య ఉండదని చెప్పారు. ప్రభుత్వం నిర్ణయాన్ని మార్చుకోకపోతే ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయ సంఘాల నాయకులు గలాబా శ్రీనివాసరావు, తేలప్రోలు శ్రీనివాసరావు, గద్దె రవీంద్ర, దోవా రవి, కె.వెంకటరత్నం, చెన్ను నరేంద్ర, బి.పావనకుమారి తదితరులు పాల్గొన్నారు.
ఉపాధ్యాయ బదిలీలు
మాన్యువల్గా నిర్వహించాలి
–ఉపాధ్యాయ సంఘాల ఆందోళన
బాపట్లటౌన్: ఉపాధ్యాయ బదిలీలను మాన్యువల్ పద్ధతిలోనే నిర్వహించాలని ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు బడుగు శ్రీనివాస్ అన్నారు. ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ శనివారం ఎంఈవో ఎస్.నిరంజన్కు వినతిపత్రం అందజేశారు. టీచర్లు బదిలీ విషయంలో ఎస్జీటీ ఉపాధ్యాయులకు మ్యాన్యువల్ కౌన్సెలింగ్ పెడతామని హామీ ఇచ్చినటువంటి ప్రభుత్వం ది.07.06.25 నుంచి 10.06.25 వరకు మ్యానువల్ కౌన్సెలింగ్ జరుగుతుందని హామీ ఇచ్చిందన్నారు. ప్రభుత్వం తన హామీని నిలబెట్టుకోలేక ద్వంద వైఖరిని అవలంభిస్తుందన్నారు. సెకండరి గ్రేడ్ ఉపాధ్యాయులు మాన్యువల్ కౌన్సెలింగ్ కోసం ఎదురుచూస్తున్న తరుణంలో మ్యాన్యువల్ కౌన్సెలింగ్ జరపలేం, వెబ్ కౌన్సెలింగ్ జరుపుతామని ప్రకటించడం శోచనీయమన్నారు. ప్రభుత్వ వైఖరిని నిరిసిస్తూ మండల విద్యాశాఖ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. సోమవారం అన్ని జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయాల ముందు ధర్నా కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య ప్రకటన విడుదల చేసిందని తెలిపారు. కార్యక్రమంలో ఎన్బి సుభాని, ఉపాధ్యాయవాణి కన్వీనర్ పి.వి. నాగరాజు, ఎ.వి.నారాయణ, పి.శివాంజనేయులు, జి.ఉదయ్ శంకర్, సీహెచ్. శ్రీనివాస్, యూటీఎఫ్ నాయకులు ఎం.సురేష్, డి.నన్నూరయ్య, ఏపీటీఎఫ్ నాయకులు రమణ, శ్రీనివాస్ పాల్గొన్నారు.