మేదరమెట్ల: ప్రముఖ సినీ నటుడు యర్రా గిరిబాబు 83వ జన్మదిన వేడుకలను ఆయన స్వగ్రామం రావినూతలలో కుమారుడు, ప్రముఖ సినీనటుడు రఘుబాబు ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. రఘుబాబు మాట్లాడుతూ సొంత గ్రామం అంటే తన తండ్రికి ఎంతో ఇష్టం అని చెప్పారు. గ్రామంలో చిన్న కార్యక్రమం చేస్తున్నా ఆయన తప్పక హాజరయ్యేవారని తెలిపారు. ప్రస్తుతం అనారోగ్య కారణాలవల్ల రాలేక పోయారని.. ఈనెలలో గ్రామానికి తప్పక వస్తారని రఘుబాబు తెలిపారు. పలువురు మాట్లాడుతూ మరెన్నో పుట్టిన రోజు వేడుకలను గిరిబాబు జరుపుకోవాలని ఆకాంక్షించారు. పుట్టిన రోజు కేక్ను రఘుబాబు కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. కార్యక్రమంలో డాక్టర్ హృదయనాథ్, సీఐ మల్లికార్జునరావు, కొరిశపాడు ఎస్ఐ సురేష్, గ్రామస్తులు పాల్గొన్నారు.