
బాపట్ల క్రీడాకారులకు బహుమతులు
బాపట్ల: రాష్ట్రస్థాయి 12వ మాస్టర్స్ పవర్ లిఫ్టింగ్ పోటీల్లో బాపట్లకు చెందిన క్రీడాకారులకు బహుతులు దక్కాయి. మే 31 నుంచి జూన్ రెండో తేదీ వరకు జరిగిన పోటీల్లో 74 కేజీల విభాగంలో షేక్ నజీర్ 260కేజీల బరువును ఎత్తి ద్వితీయ స్థానంతో సిల్వర్ మెడల్ సాధించారు. 65కేజీల విభాగంలో బత్తుల సాంబశివరావు 265కేజీల బరువును ఎత్తి సిల్వర్ మెడల్ సొంతం చేసుకున్నారు. ఇద్దరూ కర్ణాటకలో జరిగే జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా బాపట్లలో పలువురు క్రీడాకారులను అభినందించారు.
విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి
పట్నంబజారు: విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి చెందిన ఘటనపై కేసు నమోదైంది. లాలాపేట పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చౌత్రా సెంటర్లో నివాసం ఉండే కొనగండ్ల మోహన వెంకటకృష్ణ (56) ఈనెల 7వ తేదీ సాయంత్రం ఇంటి ముందు ఉన్న పిచ్చి మొక్కలు తొలగిస్తున్నాడు. ఈ క్రమంలో విద్యుత్ తీగ తగలడంతో షాక్కు గురయ్యారు. గమనించిన కుటుంబ సభ్యులు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
అనుమానాస్పదస్థితిలోవ్యక్తి మృతి
నకరికల్లు: అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి చెందిన సంఘటన నకరికల్లులోని ఇనిమెట్ల రోడ్డులో ఆదివారం జరిగింది. సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి... మండలంలోని గుండ్లపల్లి గ్రామానికి చెందిన చందా మీరావలి(38) నకరికల్లులోని ఇనిమెట్ల రోడ్డులో గల మద్యం దుకాణం వద్ద అనుమానాస్పద స్థితిలో పడి ఉన్నాడు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న ఎస్ఐ చల్లా సురేష్, సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం నరసరావుపేటలోని ఏరియా వైద్యశాలకు తరలించారు. మృతుడు కొన్నిరోజులుగా మద్యం మత్తులో తిరుగుతున్నాడని, ఆదివారం కూడా తాగేందుకు నకరికల్లు వచ్చినట్లు సమాచారం. ఘటనపై కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ చల్లా సురేష్ తెలిపారు.

బాపట్ల క్రీడాకారులకు బహుమతులు