
కౌలు రైతు కుటుంబాన్ని ఆదుకోవాలి
లక్ష్మీపురం: పొగాకు పండించి కొనేవారు లేక అప్పులపాలై ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు శివశంకర్ వరప్రసాద్ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.10లక్షలు నష్టపరిహారం ఇవ్వాలని, వారి కుటుంబానికి నివాస స్థలం ఇచ్చి ప్రభుత్వమే ఇల్లు నిర్మించి ఇవ్వాలని, ఏ ఆధారం లేని ఆ కుటుంబానికి స్వయం ఉపాధి కల్పించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వై.నేతాజీ డిమాండ్ చేశారు. ఆదివారం గుంటూరు జీజీహెచ్ మార్చురీ వద్ద మృతుడు శివశంకర్ వరప్రసాద్ కుటుంబాన్ని నేతాజీ, జిల్లా కమిటీ సభ్యులు వై.కృష్ణకాంత్లు కలిసి పరామర్శించి ఆత్మహత్యకుగల కారణాలు అడిగి తెలుసుకుని నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నో ఆశలతో పంట మీద వచ్చిన ఆదాయంతో స్థలం కొనుక్కుని ఇల్లు నిర్మాణం చేసుకోవాలని కౌలు రైతు శివశంకర్ అనుకున్నారన్నారు. ఈ నేపథ్యంలో ఎకరానికి రూ.20వేలు కౌలు చొప్పున 11 ఎకరాలు కౌలుకి తీసుకుని పొగాకు పంట వేశారన్నారు. బ్యాంకులు అప్పు ఇవ్వకపోవడంతో ప్రైవేటు ఫైనాన్స్ కంపెనీలో అప్పు తీసుకుని పంట వేశారన్నారు. పండించిన పొగాకు కొనేవారు లేక అప్పులు తీర్చే పరిస్థితి కనబడకపోవడంతో ఆత్మహత్య చేసుకున్నారన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కౌలు రైతు అత్మహత్యకు ప్రభుత్వమే బాధ్యత వహించి వారి కుటుంబానికి రూ.10 లక్షలు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆ కుటుంబంలో ఒకరికి స్వయం ఉపాధికి అవకాశం కల్పించాలని, నివాసం కోసం స్థలం కేటాయించి ప్రభుత్వమే ఇల్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు.
రూ.10లక్షలు నష్టపరిహారం ఇవ్వాలి :
కౌలు రైతు సంఘం డిమాండ్
అప్పుల బాధ తాళలేక, గిట్టుబాటు ధరలేక ప్రత్తిపాడు మండలం పెద్ద గొట్టిపాడు చెందిన పొగాకు కౌలు రైతు కావూరి శివశంకర వరప్రసాద్ పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నారని ప్రభుత్వం స్పందించి వారి కుటుంబానికి నష్టపరిహారం ఇవ్వాలని కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బి.రామకృష్ణ, కె.నాగమల్లేశ్వరరావు, జిల్లా సహాయ కార్యదర్శి పాశం రామారావులు ఆదివారం ఒక ప్రకటలో తెలిపారు. కూటమి ప్రభుత్వం ఇప్పటికై నా స్పందించి వెంటనే పొగాకు కొనుగోలు చేయాలని, ఆత్మహత్య చేసుకుని మృతి చెందిన కౌలు రైతు కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.10లక్షలు పరిహారం చెల్లించాలని, భవిష్యత్లో ఇలాంటి ఘటనలు జరగకుండా తగు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.
సీపీఎం జిల్లా కార్యదర్శి వై.నేతాజీ అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న పొగాకు కౌలు రైతు మృతదేహానికి నివాళి