
దుర్గమ్మ సన్నిధిలో భారీ రద్దీ
ఇంద్రకీలాద్రి(విజయవాడ పశ్చిమ): శ్రీదుర్గా మల్లేశ్వరస్వామి వార్ల సన్నిధికి భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఆదివారం తెల్లవారుజాము నుంచి సాయంత్రం వరకు పెద్దఎత్తున తరలివచ్చి ఆదిదంపతులను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆదివారం రికార్డు స్థాయిలో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారని ఆలయ అధికారులు పేర్కొంటున్నారు. తెల్లవారుజాము ఆరు గంటల నుంచి సాయంత్రం 9 గంటల వరకు ఆలయంలోని అన్ని క్యూలైన్లలో రద్దీ కనిపించింది. ఆదిదంపతులైన దుర్గా మల్లేశ్వరస్వామి వార్లకు నిర్వహించిన పలు ఆర్జిత సేవల్లో ఉభయదాతలు విశేషంగా పాల్గొన్నారు. ఉదయం 10–30 గంటల నుంచి అంతరాలయ దర్శనాలను నిలిపివేశారు. భక్తులు ఇబ్బంది పడకుండా రూ. 500 టికెట్ల విక్రయాలను నిలిపివేసి, రూ.300 టికెట్ల ద్వారా బంగారు వాకిలి దర్శనం కల్పించారు. మరో వైపున రూ.100, సర్వ దర్శనం క్యూలైన్లలోనూ భక్తుల రద్దీ కనిపించింది. సర్వదర్శనానికి రెండు గంటల సమయం పట్టింది. ఉదయం 11–30 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు వీఐపీ దర్శనాలు నిలిపివేశారు.
అమ్మవారి సన్నిధిలో సూర్యోపాసన సేవ
లోక కళ్యాణార్థం సర్వ మానవాళికి సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటూ భక్తులు సూర్యభగవానుడికి విశేష పూజలు చేశారు. అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని రాజగోపురం వద్ద సూర్య భగవానుడి చిత్రపటానికి ఆలయ అర్చకులు పూజా కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం సూర్య నమస్కారాలు, సూర్యోపాసన సేవ జరిగింది. సేవలో పలువురు ఉభయదాతలు పాల్గొన్నారు. ఆర్జిత సేవల్లో పాల్గొన్న ఉభయదాతలకు రూ. 300 క్యూలైన్ ద్వారా ప్రత్యేక దర్శనం కల్పించారు.
ఆలయ సిబ్బందిపై భక్తుడి దాడి
గాలిగోపురం వద్ద ఉన్న స్కానింగ్ పాయింట్ వద్ద ఓ భక్తుడు ఆలయ సిబ్బంది, సెక్యూరిటీ సిబ్బందిపై దాడికి పాల్పడ్డాడు. భక్తుల రద్దీ నేపథ్యంలో దేవస్థానం రూ. 500 టికెట్లు, వీఐపీ దర్శనాలు నిలిపివేసింది. అయితే, ఓ భక్తుడు ఘాట్రోడ్డు మీదుగా ఆలయానికి చేరుకునే సమయంలో రూ. 500 టికెట్లు కావాలని అడిగాడు. అయితే ఈవో ఆదేశాల మేరకు మధ్యాహ్నం 1–30 గంట వరకు వీఐపీ దర్శనాలు నిలిపి వేసినట్లు సిబ్బంది సమాధానమిచ్చారు. దీంతో గాలిగోపురం వద్దకు చేరుకున్న భక్తుడు అక్కడి సెక్యూరిటీ గార్డుతో గొడవకు దిగడమే కాకుండా ఆలయ అధికారులు, సిబ్బందిని నోటికి వచ్చినట్లు దూషించసాగాడు. ఇదేమిటని అడిగిన వన్టౌన్ కానిస్టేబుల్ను సైతం నెట్టి వేయడంతో వివాదం మరింత పెరిగింది. దీంతో కోపంతో ఊగిపోయిన సదరు భక్తుడు సెక్యూరిటీ గార్డు, ఆలయ సిబ్బందిపై దాడి చేయడంతో వారు వెంటనే అతన్ని అవుట్పోస్ట్కు తరలించారు. సెక్యూరిటీ గార్డు ఫిర్యాదు మేరకు సదరు భక్తుడిని వన్టౌన్ పోలీస్ స్టేషన్కు తరలించారు.
ఆదివారం రికార్డు స్థాయిలో దర్శనాలు

దుర్గమ్మ సన్నిధిలో భారీ రద్దీ