
యోగాతో శారీరక దృఢత్వం, మానసిక ఉల్లాసం
నరసరావుపేట: యోగాతో శారీరక దృఢత్వంతోపాటు మానసిక ఉల్లాసం కలుగుతుందని కలెక్టర్ పి.అరుణ్బాబు పేర్కొన్నారు. యోగాంధ్రలో భాగంగా ఆదివారం నరసరావుపేటలోని పల్నాడు బస్టాండ్, పెద్ద చెరువు రోడ్డు వద్ద కార్యక్రమాలను పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ యోగా అనేది ప్రతి ఒక్కరి దైనందిన జీవితంలో భాగస్వామ్యం కావాలని తెలిపారు. ప్రతి ఒక్కరూ రోజూ 30 నిమిషాల నుంచి గంట వరకు యోగాభ్యాసం చేయాలని సూచించారు. యోగాతో శారీరక రుగ్మతలు దూరమవుతాయని పేర్కొన్నారు. యోగా అనేది చాలా ప్రాచీనమైనదని, వందల ఏళ్ల నుంచి గుర్తింపు పొందిందని అన్నారు. జూన్ 21 వరకు ఈ కార్యక్రమాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు.