
‘వెన్నుపోటు దినం’ విజయవంతం చేయాలి
చీరాల అర్బన్: కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు పరచకుండా అన్యాయం చేస్తోందని వైఎస్సార్సీపీ చీరాల నియోజకవర్గ ఇన్చార్జి కరణం వెంకటేష్ అన్నారు. శుక్రవారం రామకృష్ణాపురంలోని పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలతో మాట్లాడారు. సమావేశానికి పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి మేరుగ నాగార్జున హాజరయ్యారు. కరణం వెంకటేష్ మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది అవుతోందని, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా వైఎస్సార్సీపీ నాయకులను టార్గెట్గా పెట్టుకుని అక్రమ కేసులు, అరెస్ట్లతో కాలం వెళ్లదీస్తోందన్నారు. నాయకులను, కార్యకర్తలను భయభ్రాంతులకు గురిచేస్తూ సాగిస్తున్న అరాచక పాలనపై వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు జూన్ 4న రాష్ట్ర వ్యాప్తంగా వెన్నుపోటు దినం నిరసన కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలన్నారు. కార్యకర్తలకు ఎప్పుడూ తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.
అన్ని వర్గాలకు అన్యాయమే
పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి మేరుగ నాగార్జున మాట్లాడుతూ రాష్ట్రంలో జరుగుతున్న అరాచక పాలనను ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారన్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చమని అడిగితే దాటవేత ధోరణితో కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తోందని తెలిపారు. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు అన్యాయమే జరుగుతోందన్నారు. నిరుద్యోగులు, ఉద్యోగులు, రైతులకు న్యాయం జరగడం లేదని తెలిపారు. కౌలు రైతులు, పొగాకు రైతులు పడుతున్న ఇబ్బందులు ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఏడాది కాలంలో రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి శూన్యమని, ఓట్లు వేసి గెలిపించిన ప్రజలను సుపరిపాలన అందించాలన్నారు. ఆరాచక పాలనపై వైఎస్సార్సీపీ పోరాటం చేస్తుందన్నారు. వెన్నుపోటు దినం నిరసన ర్యాలీని అందరూ విజయవంతం చేయాలన్నారు. పార్టీ బీసీ సెల్ రాష్ట్ర కార్యదర్శి కర్నేటి వెంకటప్రసాద్, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు వాసిమళ్ళ వాసు, మున్సిపల్ వింగ్ అధ్యక్షుడు బత్తుల అనిల్, మైనార్టీ సెల్ రాష్ట్ర కార్యదర్శి షేక్ కబీర్, బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు గవిని శ్రీనివాసరావు, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ బొనిగల జైసన్బాబు, పట్టణ అధ్యక్షుడు యాతం మేరిబాబు, మున్సిపల్ కౌన్సిలర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
వైఎస్సార్సీపీ చీరాల నియోజకవర్గ
ఇన్చార్జి కరణం వెంకటేష్