
ఏడాదిగా తిరోగమనంలో ప్రభుత్వ విద్య
బాపట్ల టౌన్: చదువుకు పేదరికం అడ్డురాకూడదు...ప్రతి తల్లీ తన బిడ్డలను ఉన్నత చదువులు చదివించుకోవాలన్న లక్ష్యంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గతంలో ‘అమ్మఒడి’ పథకాన్ని ప్రతిష్టాత్మ కంగా అమలు చేసింది. పిల్లలను బడికి పంపే ప్రతి తల్లి ఖాతాకు నేరుగా రూ.15 వేలు చొప్పున విద్యా సంవత్సరం ఆరంభంలోనే జమ చేసింది. జిల్లాలో లక్షలాది మంది విద్యార్థులు, వేలాది మంది తల్లులు లబ్ధి పొందారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు చంద్రబాబు తమ ఎన్నికల మేనిఫెస్టోలో ’అమ్మ ఒడి’ పేరును ’తల్లికి వందనం’గా మార్పు చేసి ఒక కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ప్రతిఒక్కరికీ రూ.15 వేలు చొప్పున జమ చేస్తామంటూ కూటమి నేతలు ఊరూరా ఊదరగొట్టారు. తీరా కూటమి సర్కార్ కొలువుతీరి ఏడాది గడిచినా ఇప్పటికీ దీనిపై విధివిధానాలు లేవు.
నాడు పౌష్టికాహారం.. నేడు అధ్వానం
పిల్లలు చదువులో రాణించాలంటే సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలనే లక్ష్యంతో ‘జగనన్న గోరుముద్ద’ పేరుతో పౌష్టికా హారం అందించారు. అది కూడా రోజుకో మోనుతోపాటు కోడిగుడ్డు, రాగిజావ, చిక్కీ అందజేస్తున్నారు. దీంతో పిల్లలు ఆడుతూ పాడుతూ విద్యనభ్యసిస్తూ సంతోషంగా ఉన్నారు. వీటితోపాటు నాడు–నేడు కార్యక్రమంలో భాగంగా పాఠశాలల్లోని విద్యార్థులకు తాగునీరు, విద్యుత్ సౌకర్యం, ఫర్నిచర్, గ్రీన్ చాక్బోర్డులు, కిచెన్ షెడ్లు, ఇంగ్లిష్ ల్యాబ్, పెయింట్స్, బోర్ సౌకర్యం, మరుగుదొడ్లు తదితర పనులు చేయించారు. నేడు జిల్లాలోని అనేక పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం మెనూ సక్రమంగా అమలు కాని దుస్థితి. కొన్నిచోట్ల కోడిగుడ్డు కూడా ఇవ్వడం లేదని విద్యార్థులు వాపోతున్నారు. కొందరు విద్యార్థులు ఇంటినుంచి క్యారియర్లలో భోజనం తెచ్చుకుంటున్నారు.

ఏడాదిగా తిరోగమనంలో ప్రభుత్వ విద్య