
అవగాహనతో మలేరియా కట్టడి చేయవచ్చు
గుంటూరు మెడికల్ : అవగాహనతో మలేరియాను కట్టడి చేయవచ్చని జిల్లా మలేరియా అధికారి సుబ్బరాయణం అన్నారు. జాతీయ మలేరియా నివారణ మాసోత్సవం సందర్భంగా శుక్రవారం స్థానిక గుండారావుపేట పట్టణ ఆరోగ్య కేంద్రంలో అవగాహన ర్యాలీ జరిగింది. ఈ ర్యాలీకి ముఖ్యఅతిథిగా విచ్చేసిన సుబ్బరాయణం మాట్లాడుతూ వర్షాకాలంలో దోమలు వృద్ధి చెంది మలేరియా, డెంగీ, టైఫాయిడ్ లాంటి వ్యాధులు కలుగజేస్తాయన్నారు. దోమలు పెరగకుండా ప్రతి ఒక్కరు తమ చుట్టు పక్కల పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని చెప్పారు. ప్రతి శుక్రవారం డ్రైడేగా పాటించి దోమలు పెరగకుండా పలు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ముఖ్యంగా దోమకాటు నుంచి రక్షణ కోసం ప్రతి ఒక్కరు దోమ తెరలు వాడాలని సూచించారు.
10న జిల్లా సీనియర్ అథ్లెటిక్ పోటీలు
గుంటూరు వెస్ట్ (క్రీడలు) : అథ్లెటిక్ అసోసియేషన్ ఆఫ్ గుంటూరు జిల్లా ఆధ్వర్యంలో ఈ నెల 10వ తేదీన ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం సింథటిక్ ట్రాక్పైన జిల్లా సీనియర్ అథ్లెటిక్ పోటీలు నిర్వహిస్తామని కార్యదర్శి జీవిఎస్ ప్రసాద్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. 18 సంవత్సరాలు దాటిన యువతీ యువకులు ఎవరైనా ఈ పోటీల్లో పాల్గొనవచ్చన్నారు. ఆసక్తిగల క్రీడాకారులు ఈ నెల 9వ తేదీన ఏఎన్యూలోని ఇండోర్ స్టేడియంలో వయస్సు ధృవీకరణ పత్రంతోపాటు వివరాలు నమోదు చేసుకోవాలన్నారు. ఎంపిక చేసిన జిల్లా జట్టును ఇదే ప్రాంతంలో ఈ నెల 14, 15 తేదీల్లో జరగనున్న రాష్ట్ర పోటీలకు పంపిస్తామన్నారు.
చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
క్రోసూరు: మండలంలోని బయ్యవరం గ్రామానికి చెందిన షేక్ శ్రీనివాసరావు(35)పై కొంతమంది వ్యక్తులు దాడి చేయగా తీవ్రగాయాలతో గుంటూరు ప్రవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతిచెందినట్లు ఎస్ఐ పి.రవిబాబు తెలిపారు. ఈనెల 3వ తేదీ అమరావతి మండలంలోని తురకవారిపాలెం ఇటుకబట్టీలలో పనిచేసుకుంటుండగా మునుగోడు గ్రామానికి చెందిన గోపి అనే వ్యక్తితో గొడవ జరిగింది. అనంతరం సాయంత్రం గోపి, మరి కొందరు కలిసి వచ్చి బయ్యవరంలోని శ్రీనివాసరావు ఇంటి పై దాడి చేసి తీవ్రంగా కొట్టారు. శ్రీనివాసరావుకు తీవ్రగాయాలు కాగా గుంటూరు ప్రవేటు ఆసుపత్రిలో చేర్పించగా అక్రడ చికిత్స పొందుతూ మృతి చెందాడు.