
అందరూ కరోనా జాగ్రత్తలు తీసుకోవాలి
గుంటూరు మెడికల్: కోవిడ్ కేసులు మళ్లీ నమోదవుతున్న దృష్య్టా గుంటూరు జీజీహెచ్కు వస్తున్న రోగులు, వారి సహాయకులు తప్పని సరిగా కోవిడ్ నిబంధనలు పాటించాలని ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రమణ యశస్వి అన్నారు. శుక్రవారం ఆస్పత్రిలో మీ కోసం మేము కార్యక్రమంలో భాగంగా ఆయన రోగులు, వారి సహాయకులతో సమావేశమై వారి సమస్యలు ఆలకించారు. ఈ సందర్భంగా డాక్టర్ రమణ మాట్లాడుతూ ఆస్పత్రికి వచ్చే ప్రతి ఒక్కరి ప్రాణాలు రక్షించేందుకు వైద్యులు, వైద్య సిబ్బంది తమ ప్రాణాలు పణంగా పెట్టి వైద్య సేవలందించేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ఆస్పత్రిలో వాతావరణం పరిశుభ్రంగా ఉండేలా చూడాలని, ప్రతి ఒక్కరు తప్పనిసరిగా మాస్క్ ధరించాలన్నారు. ప్రతి ఒక్కరు తరచుగా చేతులు పరిశుభ్రం చేసుకోవాలని, దగ్గు, జలుబు, జ్వరం ఉంటే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఆస్పత్రిలో పరీక్షలు చేయించుకోవాలన్నారు. దగ్గు, జ్వరం ఉన్నవారు ఆస్పతిలో తిరగకుండా వార్డులో ఉంచి చికిత్స పొందాలని సూచించారు. మద్యం తాగి ఆస్పత్రికి రావద్దని ఆస్పత్రి ఆవరణంలో సిగరెట్టు తాగి వాతావరణం కలుషితం చేయవద్దని కోరారు. మీ కుటుంబ సభ్యులను మా కుటుంబ సభ్యులుగా భావించి చికిత్స అందిస్తామని, మీరు అభద్రతా భావాన్ని , అపోహలు వదిలి పెట్టలన్నారు. ఏ డాక్టర్, నర్సు తప్పు చేయరని ఆస్పత్రిలో వీడియో కెమెరాలు ఉన్నాయని తెలిపారు. కోట్లాది రూపాయలు వెచ్చించి ప్రభుత్వం ఉచిత వైద్యం అందిస్తోందన్నారు. గతంలో కోవిడ్ సయమంలో లక్షలు ఖర్చుపెట్టినా కాపాడలేని వారిని గుంటూరు జీజీహెచ్లో ప్రాణాలు పణంగా పెట్టి కాపాడారన్నారు. కోవిడ్ కి సంబంధించి టెస్టులన్నీ ఉచితంగా చేస్తున్నామని, ప్రజలు ఈ వైద్యసేవలను వినియోగించుకోవాలని కోరారు. జనరల్ మెడిసిన్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ అనిల్ కుమార్ కుమార్ మాట్లాడుతూ ప్రస్తుతం కోవిడ్ విస్తరిస్తున్న సమయంలో ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఆహారపు అలవాట్లు గురించి వివరించారు.
జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ రమణ యశస్వి