
పర్యావరణ పరిరక్షణ మన బాధ్యత
ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్
బాపట్ల: పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని బాపట్ల పార్లమెంట్ సభ్యుడు తెన్నేటి కృష్ణ ప్రసాద్ తెలిపారు. గురువారం ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా బాపట్ల మండలం సూర్యలంక దగ్గర నగరవనంలో అటవీ శాఖ ఆధ్వర్యంలో వన మహోత్సవం నిర్వహించారు. ఈసందర్భంగా ఎంపీ కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ చెట్లు నరకడం వలన గ్లోబల్ వార్మింగ్ ఏర్పడిందన్నారు. అది పెను విపత్తుకు దారితీసే ప్రమాదం ఉందన్నారు. జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి మాట్లాడుతూ కాలుష్య నివారణ, పర్యావరణ సమతుల్యత లక్ష్యాలుగా పర్యావరణ దినోత్సవం జరుపుకొంటున్నామన్నారు. ఈ ఏడాది ‘ప్రపంచవ్యాప్తంగా ప్లాస్టిక్ కాలుష్యాన్ని అంతం చేయడం’ అనే అంశంతో పర్యావరణ దినోత్సవాన్ని జరుపుకుంటున్నామన్నారు. జిల్లాలోని 477 పంచాయతీలలో సోలార్ సిస్టం ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఆప్కో చైర్మన్ డా.సజ్జల హేమలత, డీఎఫ్ఓ కె.వినోద్ కుమార్, బాపట్ల ఆర్డీఓ పి. గ్లోరియా, కమిషనర్ రఘునాథరెడ్డి పాల్గొన్నారు.
పీ–4 మార్గదర్శిల నమోదులో
బాపట్ల ప్రథమం
బాపట్ల: పీ–4 మార్గదర్శిల నమోదులో బాపట్ల జిల్లా 60 శాతం పురోగతి సాధించి రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిచిందని జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి తెలిపారు. పీ–4, యోగాంధ్ర, పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలపై అనుబంధ శాఖల జిల్లా అధికారులు, ఎంపీడీఓలు, తహసిల్దార్లతో గురువారం స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి ఆయన వీడియో సమావేశం నిర్వహించారు. ఇప్పటివరకు మూడు వేలమంది మార్గదర్శిలు పీ–4లో నమోదైనట్లు చెప్పారు. బంగారు కుటుంబాలను మార్గదర్శిలు ఎంపిక చేసుకోవడం, దత్తత చూసుకోవడంపై అధికారులు అవగాహన కల్పించాలన్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కల్యాణ్ జూలైలో బాపట్ల జిల్లాకు రానున్నారని కలెక్టర్ చెప్పారు. ఐటీసీ కంపెనీ 80,000 మొక్కలను ఉచితంగా పంపిణీ చేస్తుండగా, ఆ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి పాల్గొంటారన్నారు. సీపీఓ శ్రీనివాసరావు, డ్వామా పీడీ విజయలక్ష్మి, సమగ్ర శిక్ష అభియాన్ ఏపీసీ నాగిరెడ్డి, డీఈఓ పురుషోత్తమరావు, తదితరులు పాల్గొన్నారు.
రూ. 5.72 కోట్ల రాయితీ సొమ్ము విడుదల
జిల్లాను పారిశ్రామికంగా తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ జె.వెంకటమురళి తెలిపారు. గురువారం స్థానిక కలెక్టర్ కార్యాలయంలో జిల్లా పరిశ్రమల ఎగుమతుల కమిటీ సమావేశం కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు జిల్లాలో పరిశ్రమల కోసం 202 దరఖాస్తులు చేసుకోగా కమిటీ పరిశీలించి దరఖాస్తులకు అనుమతులు మంజూరు చేసిందన్నారు. 186 పరిశ్రమలకు రూ.5.72 కోట్ల రాయితీ సొమ్ము మంజూరైనట్లు కలెక్టర్ వివరించారు.