
ఎన్కౌంటర్లన్నీ ప్రభుత్వ హత్యలే
సజ్జా వెంకట నాగేశ్వరరావు సంస్మరణ సభలో ప్రజా సంఘాల ఆరోపణ
చీరాల రూరల్: అటవీ సంపదను విదేశీ కంపెనీలకు దోచిపెట్టడం కోసం దేశ పౌరులను కేంద్ర ప్రభుత్వం నిరంకుశంగా హత్యలు చేయిస్తోందని అమరుల బంధుమిత్రుల సంఘం, ప్రజా సంఘాల నాయకులు ఆరోపించారు. అందులో భాగంగానే సజ్జా వెంకట నాగేశ్వరరావు హత్యకు గురయ్యారని పేర్కొన్నారు. శుక్రవారం మండల పరిధిలోని జాండ్రపేట చౌడేశ్వరి దేవాంగ కల్యాణ మండపం ప్రాంగణంలో కుటుంబ సభ్యులు, అమరుల బంధుమిత్రుల సంఘం ఆధ్వర్యంలో సజ్జా వెంకట నాగేశ్వరరావు సంస్మరణ సభను అంజమ్మ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా నాగేశ్వరరావు సోదరుడు శ్రీనివాసరావు మాట్లాడుతూ.. నాగేశ్వరరావు విద్యాభ్యాసం చేసే రోజుల్లోనే రాడికల్ ఉద్యమానికి ఆకర్షితుడై ప్రజల కోసం ఉద్యమ బాట పట్టినట్లు చెప్పారు. తన ఊపిరి ఉన్నంత వరకు ప్రజలకు కోసం పోరాడి ప్రాణత్యాగం చేసినట్లు పేర్కొన్నారు. పౌర హక్కుల సంఘం నాయకుడు చిలకా చంద్రశేఖర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఒకపక్క ఇతర దేశాలతో శాంతి చర్చలు జరుపుతూ మరోపక్క మన దేశంలోని పౌరులను ఎటువంటి చర్చలు జరపకుండా ఆపరేషన్ కగార్ పేరుతో నరహత్య చేస్తోందని మండిపడ్డారు. కగార్ పేరుతో అనేకమందిని పొట్టనపెట్టుకున్న కేంద్రం 1,27,000 చెట్లను నరికివేసేందుకు పర్యావరణ అనుమతులు పొందడం అందులో భాగమేనని ఆయన ఆరోపించారు. హైకోర్టు న్యాయవాది యూడీ భీమ్రావ్ మాట్లాడుతూ ఎదురు కాల్పుల పేరుతో చంపిన దేశ పౌరుల మృత దేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించాలని అత్యున్నత న్యాయస్థానాలను ఆశ్రయించామన్నారు. కనీసం కుటుంబ మృతదేహాలను చూపకుండా కేంద్రం నిరంకుశత్వంగా వ్యవహరిస్తూ కోర్టు ధిక్కారానికి కూడా పాల్పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. చీరాల సాధన సమితి నాయకుడు శీలం రవికుమార్ మాట్లాడుతూ ప్రజా సమస్యలపై గొంతెత్తి ప్రశ్నించినవారు అర్బన్ నక్సలైట్, మావోయిస్టులయితే తాము కూడా అలాంటి వారిమేనా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రాష్ట్ర చేనేత జన సమాఖ్య నాయకుడు దేవన వీర నాగేశ్వరరావు, బీసీ ఫెడరేషన్ నాయకుడు ఊటుకూరి వెంకటేశ్వర్లు, సీపీఎం న్యూడెమోక్రసీ మేకల ప్రసాద్, దేశభక్తి ప్రజాతంత్ర ఉద్యమం నాయకుడు వై. వెంకటేశ్వర్లు, నిర్బంధ వ్యతిరేక పోరాట కమిటీ రవిచంద్ర, భారత్ బచావో నవజ్యోతి, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. కార్యక్రమానికి ముందుగా ర్యాలీ నిర్వహించారు.