
● వారం రోజులుగా తాగునీరు వృథా ● పట్టించుకోని మున్సిపల
తాగునీటి పైపులైన్కు లీకులు
రేపల్లె: పైపులైన్కు వారం కిందట లీకు ఏర్పడి తాగునీరు వృథాగా పోతుంది. మున్సిపల్ అధికారులు మాత్రం పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్నారు. మున్సిపల్ కార్యాలయానికి కూతవేటు దూరంలో వారం రోజుల కిందట పైప్లైన్కు లీకు ఏర్పడింది. మరమ్మతులు చేసేందుకు భారీ గొయ్యి తీసి మట్టిని రహదారిపై పడవేసి వదిలేశారు. లీకును మాత్రం సరిచేయలేదు. ప్రధాన రహదారి కావడంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందులు తప్పడం లేదు. నిత్యం వందల సంఖ్యలో వాహనాలు రాకపోకలు సాగించే రహదారిలో లీకుని సరిచేసి తాగునీటి వృథాని అరికట్టడంతోపాటు ట్రాఫిక్ సమస్యను తీర్చాలని పట్టణ ప్రజలు, ప్రజాసంఘాల నాయకులు కోరుతున్నారు.
12 నుంచి ఐఏఎస్ ఫౌండేషన్ తరగతులు
గుంటూరు ఎడ్యుకేషన్ : స్టూడెంట్ యూనియన్ ఆఫ్ నేషన్, కేవీఆర్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో ఈనెల 12 నుంచి 21 వరకు ఐఏఎస్ ఫౌండేషన్ శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు తెలిపారు. శనివారం గుంటూరులోని యూటీఎఫ్ జిల్లా కార్యాలయంలో ఐఏఎస్ ఫౌండేషన్ తరగతుల పోస్టర్లు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కేఎస్ లక్ష్మణరావు మాట్లాడుతూ 8, 9, 10వ తరగతులతో పాటు ఇంటర్ విద్యార్థులకు సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల వరకు బ్రాడీపేట 2/6లోని యూటీఎఫ్ కార్యాలయ సమావేశ మందిరంలో జరుగుతాయని చెప్పారు. సివిల్ సర్వీసెస్, ఐఏఎస్ పరీక్షల పట్ల పాఠశాల స్థాయిలో అవగాహన కల్పించి సివిల్స్ పై లక్ష్యాన్ని కలిగించడమే ముఖ్య లక్ష్యంగా తరగతులు ఉంటాయని చెప్పారు. 10 రోజులపాటు నిపుణులు క్లాసులు బోధిస్తారని తెలిపారు. ఐఏఎస్, ఐపీఎస్ వంటి సర్వీస్లకు ఎంపిక కావడం ద్వారా ప్రజలకు సేవలు అందించవచ్చని విద్యార్థులకు వివరిస్తారని తెలిపారు.