ఒకే నెలలో రెండు పౌర్ణములు రావడం అరుదు. అదే రెండో పౌర్ణమి “బ్లూ మూన్”గా ఏర్పడితే.. ఆకాశాన్ని చూసే ఖగోళ శాస్త్రవేత్తలకే కాదు, గ్రహగతులను గమనించే జ్యోతిష్కులకూ అది ప్రత్యేక సంఘటనే. ఇప్పుడు అలాంటి అరుదైన దృశ్యానికే మే 2026 వేదికవుతోంది. ఈ నెల 1వ తేదీన ఒక పౌర్ణమి సంభవించగా.. మళ్లీ మే 31న మరో పౌర్ణమి ఏర్పడబోతోంది. ఈ రెండో పౌర్ణమినే “బ్లూ మూన్”గా పిలుస్తారు.
సాధారణంగా “బ్లూ మూన్” అనేది చంద్రుడు నిజంగా నీలంగా కనిపిస్తాడని కాదు.. ఒకే క్యాలెండర్ నెలలో రెండోసారి పౌర్ణమి రావడాన్ని సూచించే ఖగోళ పదం. అయితే ఈసారి బ్లూ మూన్కు మరో ప్రత్యేకత కూడా ఉంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. ఈ పౌర్ణమి సమయంలో చంద్రుడు ధనుస్సు రాశిలో ఉండగా, సూర్యుడు మిథున రాశిలో ఉంటాడు. ఈ “ధనుస్సు–మిథున అక్షం” కారణంగా కొన్ని రాశులపై ప్రభావం మరింత గట్టిగా ఉంటుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.
ధనుస్సు రాశివారికి ఇది అత్యంత కీలకమైన సమయం. ఎందుకంటే చంద్రుడు నేరుగా వారి రాశిలోనే సంచరిస్తాడు. దీంతో వ్యక్తిగత జీవితం, గుర్తింపు, ఆత్మవిశ్వాసం, భవిష్యత్ లక్ష్యాలపై ఎక్కువ దృష్టి పడుతుంది. కొందరికి జీవితంలో కొత్త నిర్ణయాలు తీసుకునే పరిస్థితులు రావచ్చు. పాత ఆలోచనలను వదిలి కొత్త మార్గం ఎంచుకోవాలనే భావన కలగొచ్చు.
మిథున రాశివారికి ఈ బ్లూ మూన్ సంబంధాలు, భాగస్వామ్యాలపై ప్రభావం చూపనుంది. కుటుంబం, స్నేహాలు, ప్రేమ, వ్యాపార ఒప్పందాలు వంటి అంశాల్లో ఇప్పటివరకు దాచిన భావాలు లేదా నిజాలు బయటపడే అవకాశం ఉందని జ్యోతిష్కులు చెబుతున్నారు. కొంతమంది జీవితాల్లో కీలక వ్యక్తుల పాత్ర స్పష్టమయ్యే సమయం ఇదిగా భావిస్తున్నారు.
కన్య రాశివారికి కుటుంబం, ఇల్లు, వ్యక్తిగత భద్రత వంటి అంశాలు ప్రధానంగా మారొచ్చు. ఇంటి మార్పు, కుటుంబ బాధ్యతలు, ఆస్తి విషయాలు లేదా కుటుంబ సంబంధాల్లో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని చెబుతున్నారు. కొందరికి ఇది కుటుంబ బంధాలను మరింత బలపరిచే సమయమైతే.. మరికొందరికి భావోద్వేగ పరీక్షలా మారొచ్చు.
మీనం రాశివారిపై ఈ ప్రభావం కెరీర్, ఉద్యోగం, భవిష్యత్ ప్రణాళికల రూపంలో కనిపించొచ్చు. వృత్తిపరంగా కొత్త అవకాశాలు రావడం, ఉద్యోగ మార్పు ఆలోచనలు మొదలవడం, కొత్త బాధ్యతలు తీసుకోవడం వంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉందని అంటున్నారు. కొందరికి ఇది జీవితంలో కొత్త దిశను చూపే సమయంగా మారవచ్చు.
జ్యోతిష్యంలో “చతురస్ర సంబంధం” అనే ఒక భావన ఉంటుంది. రెండు రాశులు 90 డిగ్రీల కోణంలో ఉన్నప్పుడు దానిని “స్క్వేర్” అంటారు. ఇది సాధారణంగా ఒత్తిడి, అంతర్గత సంఘర్షణ, మార్పు అవసరం వంటి భావాలను సూచిస్తుందని జ్యోతిష్కులు వివరిస్తున్నారు. ఈ బ్లూ మూన్ సమయంలో ధనుస్సు–మిథున అక్షం ఏర్పడటంతో కన్య–మీనం రాశులు కూడా పరోక్షంగా ఆ ఒత్తిడిని అనుభవించే అవకాశం ఉందని చెబుతున్నారు.
అయితే జ్యోతిష్య ప్రభావాలు ప్రతి ఒక్కరిపై ఒకేలా ఉండవని నిపుణులు గుర్తుచేస్తున్నారు. వ్యక్తిగత జాతకంలోని గ్రహస్థితులు, దశలు, గోచారాలు కూడా ప్రభావాన్ని మార్చొచ్చు. అయినప్పటికీ పౌర్ణమి సమయాల్లో భావోద్వేగాలు ఎక్కువయ్యే అవకాశం ఉండటంతో.. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ప్రశాంతంగా ఆలోచించాలని సూచిస్తున్నారు. ధ్యానం, యోగా, ఆధ్యాత్మిక సాధన వంటి విషయాలు మానసిక సమతుల్యతకు సహాయపడతాయని చెబుతున్నారు.
మొత్తానికి.. మే 2026లో వచ్చే ఈ అరుదైన బ్లూ మూన్ కేవలం ఆకాశంలో కనిపించే అందమైన దృశ్యమే కాదు.. జ్యోతిష్య విశ్వాసాల ప్రకారం కొందరి జీవితాల్లో భావోద్వేగ, వ్యక్తిగత, వృత్తిపరమైన మార్పులకు సంకేతంగా కూడా భావించబడుతోంది.


