ఎర్రగుంట్ల : మండల పరిధిలోని చిన్నదండ్లూరు గ్రామం పరిధిలో గోపులాపురం గ్రామ క్రాస్ రోడ్డు వద్ద బైక్ అదుపు తప్పి ఎన్.నరేంద్రకుమార్రెడ్డి(37) అనే వ్యక్తి కాలువలో పడి మృతి చెందిన సంఘటన ఆదివారం చోటు చేసుకుంది. కలమల్ల ఎస్ఐ సునీల్ కుమార్రెడ్డి తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. అనంతపురం జిల్లా తాడిపత్రి మండలంలోని గార్లదిన్నె గ్రామానికి చెందిన నరేంద్రకుమార్రెడ్డి తాడిపత్రిలో మెడికల్ స్టోర్ పెట్టుకుని జీవనం సాగిస్తున్నాడు. ఆయన వైఎస్ఆర్ కడప జిల్లాలోని చాపాడు మండల పరిధిలో ఉన్న తమ చిన్నమ్మ వద్దకు వచ్చి తిరిగి స్వగ్రామానికి పయనమయ్యాడు. చాపాడు నుంచి ప్రొద్దుటూరు ఆర్టీపీపీ మీదుగా తాడిపత్రికి పోవడానికి స్కూటర్లో బయలు దేరాడు. అయితే ఆర్టీపీపీ రోడ్డున గోపులాపురం గ్రామ క్రాస్ రోడ్డు వద్దకు రాగానే స్కూటర్ అదుపు తప్పి కాలువలో పడ్డాడు. ఎవరూ గమనించకపోవడంతో కాలువలోనే నీటిలోనే ఉండిపోయాడు. కొంత సేపటి తర్వాత అటుపోతున్న స్థానికులు గమనించి సమాచారం ఇవ్వడంతో ఎస్ఐ సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు. మృతదేహాన్ని ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడి బంధువులకు సమాచారం ఇచ్చామని వారు వచ్చిన తర్వాత వారి ఇచ్చే ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ధర్యాప్తు చేస్తామని ఎస్ఐ తెలిపారు.


