● ఎమ్మెల్యే, వ్యతిరేక వర్గాల పరస్పర ఫిర్యాదు
● గౌరవం లేదంటూ కార్యకర్తల ఆగ్రహం
మదనపల్లె: మదనపల్లె టీడీపీ వర్గపోరు జిల్లా ఇన్చార్జి మంత్రి బీసీ జనార్దన్రెడ్డి వద్దకు చేరింది. సోమవారం ఆయన మదనపల్లె పార్టీ జిల్లా కార్యాలయానికి వచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే షాజహాన్ బాషా వర్గంతో పాటు, వ్యతిరేక వర్గీయులు చేరుకున్నారు. మొదట మంత్రితో ఏకాంతంగా ఎమ్మెల్యే తీరుపైన, పార్టీలో గౌరవం లేకపోవడంపై, కనీస ప్రాధాన్యత దక్కకపోవడంపై నాయకులు తమ ఆగ్రహాన్ని మంత్రి ఎదుట వెళ్లగక్కారు. పార్టీ సీనియర్లమై ఉండి ఏం లాభమని ఆవేదన వ్యక్తం చేశారు. పరిస్థితి ఇలాగే ఉంటే టీడీపీకి కష్ట కాలమేనని మంత్రి ఎదుట కుండబద్దలు కొట్టినట్టు తెలిసింది. తర్వాత ఎమ్మెల్యే అనుకూల వర్గీయులు ఆయనకు మద్దతుగా నిలబడ్డారు. తర్వాత కొంతసేపటికి ఎమ్మెల్యే రావడంతో ఇరువర్గాలను ఆయన సమక్షంలో మంత్రి మాట్లాడారు. అందరూ సమన్వయంతో పనిచేయాలని, ఫిర్యాదులతో ఇబ్బందుల వద్దంటూ హితబోధ చేసినట్లు తెలిసింది. కార్యాలయం వెలుపల కొందరు కార్యకర్తలు తీవ్ర అగ్రహంతో కేకలు పెట్టారు. ఎవరికి వారు వర్గపోరుతో కార్యక్రమాలు నిర్వహిస్తుంటే తాము ఏ వర్గం వైపు వెళ్లాలని ప్రశ్నించారు. పార్టీ కార్యక్రమం కదా అని ఎవరో ఒకరి వెంట వెళితే మిగతా వర్గీయులు తమకు వ్యతిరేకమవుతున్నారని, ఈ పరిస్థితి లేక కొన్ని సాగితే పార్టీ పరువు పోతుందని ఆగ్రహ వేశాలు వ్యక్తం చేశారు. నాయకులు పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తుంటే తమకు సమాచారం కూడా ఇవ్వడం లేదని ఆవేశంతో ప్రశ్నించారు. ఇదే సమయంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు సుగవాసి ప్రసాద్ రావడంతో ఆయనతో వాగ్వాదం చేశారు. కాగా మంత్రి జనార్దన్ రెడ్డి మదనపల్లిలో పార్టీ పరిస్థితులపై అసహనం వ్యక్తం చేసి నట్లు తెలిసింది. తాను మదనపల్లెకు వచ్చిన ప్రతిసారి ఇదే సమస్య వస్తోందని అసంతప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఈమధ్య వర్గపోరు మరింత ముదిరిందని ఆయన అసహనం చెందినట్లు సమాచారం.


