● మే 1 నుంచి 31వరకు జిల్లా
వ్యాప్తంగా శిక్షణ తరగతులు
● జిల్లా క్రీడాభివృద్ధి అధికారి
చంద్రశేఖర్
మదనపల్లె సిటీ: జిల్లాలో వేసవి క్రీడా శిబిరాల ఏర్పాటుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా క్రీడాభివృద్ధి అధికారి చంద్రశేఖర్ తెలిపారు. విద్యార్థుల్లో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికితీసేందుకు, వేసవి సెలవులను సద్వినియోగం చేసుకునేలా వార్షిక కోచింగ్ శిబిరాలను నిర్వహించనున్నట్లు తెలిపారు. మే 1 నుంచి 31వతేదీ వరకు శిబిరాలు కొనసాగుతాయని వెల్లడించారు. చిన్న వయస్సులోనే (8 నుంచి 14 ఏళ్లు) పిల్లలను క్రీడల వైపు ప్రోత్సహించడం, వారిలో ఆరోగ్యకరమైన జీవనశైలిని పెంపొందించడం శిబిరాల ప్రధాన ఉద్దేశమన్నారు. ప్రతి శిబిరంలోనూ 25 మంది బాలురు, 25 మంది బాలికలకు అవకాశం కల్పిస్తామన్నారు. బాస్కెట్బాల్, పుట్బాల్, చెస్, అథ్లెటిక్స్, ఖో–ఖో, బ్యాడ్మింటన్, జూడో,కబడ్డీ, హ్యాండ్బాల్, షూటింగ్బాల్, ఫెన్సింగ్, కరాటే, తైక్వాండో, రెజ్లింగ్,హాకీ, వాలీబాల్, బాక్సింగ్లతో పాటు ఇతర క్రీడల్లో ప్రతి రోజూ ఉదయం 6 నుంచి 9 గంటల వరకు, మళ్లీ సాయంత్రం 4 గంటల నుంచి 7 వరకు శిక్షణ తరగతులు ఉంటాయన్నారు. ఈ శిబిరాలను నిర్వహించేందుకు ఆసక్తిగల ఫిజికల్ డైరెక్టర్లు, పీఈటీలు, సీనియర్ కోచ్లు, క్రీడా అసోసియేషన్ల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. శిక్షకులుగా వ్యవహరించదలచిన వారు తమ దరఖాస్తులను జిల్లా క్రీడాప్రాధికార సంస్థ కార్యాలయంలో అందజేయాలన్నారు. వివరాలకు మదనపల్లెలోని జిల్లా క్రీడాప్రాధికార సంస్థ కార్యాలయంలో సంప్రదించాలని కోరారు.


