
పైసా వసూల్
నీరుగారుతున్న ఏపీఎండీసీ లక్ష్యం
ఓబులవారిపల్లె: ఏపీఎండీసీ లక్ష్యం నీరుగారుతోంది. ఉచిత విద్య కోసం స్థాపించిన పాఠశాలలో.. ఫీజులు వసూలు చేస్తుండటంతో ఆ సంస్థ ప్రతిష్ట మసకబారుతోంది. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మంగంపేట బైరెటీస్ గనుల విస్తరణలో భూములు, ఇళ్లు కోల్పోయిన నిర్వాసితులు, ఏపీఎండీసీలో పని చే స్తున్న ఉద్యోగుల పిల్లలకు ఉచిత విద్య అందించా లని సంకల్పించింది. ఇందుకోసం ఏపీఎండీసీ సీఎస్ఆర్ నిధులతో మంగంపేటలో ఉన్నత పాఠశాల ఏర్పాటు చేసింది. నిర్వహణకు గాను ఏటా 2.5 కోట్ల రూపాయలు చెల్లిస్తోంది. ఉపాధ్యాయులు, ఇతర ఆఫీసు ఖర్చులకు ప్రతి నెల 22 లక్షల రూపాయలు ఇస్తోంది. అయితే పాఠశాల నిర్వాహకులు విద్యార్థుల నుంచి ఫీజుల రూపంలో డబ్బులు వసూలు చేస్తున్నారు. దీంతో ఉచితం కాస్తా ఖరీదుగా మారింది. దీనిపై ఏపీఎండీసీ యాజమాన్యం కూడా స్పష్టమైన ప్రకటన చేయకపోవడంతో.. విద్యార్థుల తల్లిదండ్రులు అయోమయంలో పడ్డారు.
రూ.3 వేల ఫీజు పెంపు
ప్రతి విద్యార్థి నుంచి ఏటా ఫీజుల రూపంలో డబ్బులు వసూలు చేస్తున్నారు. ఈ ఏడాది రూ.3 వేలు పెంచి వసూలు చేస్తున్నారు. ఇవ్వలేని వారిపై ఉపాధ్యాయుల ద్వారా ఒత్తిడి తీసుకువస్తున్నారు. గతేడాది 6వ తరగతి విద్యార్థికి రూ.9,500 ఫీజు ఉండగా.. ఈ ఏడాది రూ.12500 చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. వ్యాన్ ఫీజు అని టీచర్లు చెబుతున్నారు. పాఠశాలలో 1150 మంది విద్యార్థులు ఉండగా.. వారి నుంచి మొత్తం రూ. 34 లక్షల 50 వేలు వసూలు చేస్తున్నారు. అన్నింటికి ఏపీఎండీసీ నిధులు ఇస్తుంటే.. నిర్వాహకులు డబ్బులు వసూలు చేయడం ఏమిటని విద్యార్థుల తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు.
విచారణ చేసి నిగ్గు తేల్చాలి
బస్సులు, డ్రైవర్లు, నాన్టీచింగ్ స్టాఫ్ జీతాలు, మధ్యాహ్న భోజనం తదితరాలకు ఏపీఎండీసీ ప్రతి నెల రూ.22 లక్షలు చొప్పున ఏడాదికి 2.5 కోట్ల రూపాయలు యాజమాన్యానికి చెల్లిస్తోంది. ‘ఈ మొత్తాన్ని వారు ఎక్కడ ఖర్చు చేస్తున్నారు. తప్పుడు లెక్కలతో స్వాహా చేస్తున్నారు’ అని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. మళ్లీ విద్యార్థుల నుంచి డబ్బు వసూలు చేసి, ఎక్కడికి పంపిస్తున్నారని వారు ప్రశ్నిస్తున్నారు. ఇంటర్, డిగ్రీ చేసిన వారిని ఉపాధ్యాయులుగా నియమించి, తక్కువ జీతాలు చెల్లిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయంటున్నారు. పూర్తి స్థాయిలో విచారణ చేసి.. నిజాలు వెలుగులోకి తీసుకురావాలని కోరుతున్నారు.
హెడ్ ఆఫీస్ ఆదేశాల మేరకే పెంపు
ఏపీఎండీసీ హెడ్ ఆఫీసు నుంచి సర్కులర్ రావడంతో ఫీజులు పెంచడం జరిగింది. ఈ విషయాన్ని పెరేంట్స్ మీటింగ్లో చెప్పాం. రూ.2 వేలు స్కూల్కు, వెయ్యి రూపాయలు బస్సుకు మొత్తం రూ.3 వేలు పెంచాం. పాఠశాల ప్రారంభమై ఎనిమిదేళ్లు అయిన సందర్భంగా యాజమాన్యం ఫీజులు పెంచింది.
– రేవతి, హెడ్ టీచర్, ఏపీఎండీసీ పాఠశాల
ఉచితంగా విద్య అందించాలి
గనుల విస్తరణలో ఇళ్లు, భూములు కోల్పోయిన నిర్వాసితుల పిల్లలకు ఏపీఎండీసీ పాఠశాలలో ఉచితంగా విద్య అందించాలి. ఫీజులు ఎందుకు వసూలు చేస్తున్నారు. ఈ ఏడాది మళ్లీ ఫీజులు పెంచారు. ప్రైవేటు పాఠశాలలు, దీనికి తేడా లేకుండా పోతోంది. ఇలా అయితే నిర్వాసితులు పిల్లలను చదివించడం కష్టం అవుతుంది. –హరిబాబు, ఏపీటీసీ మంగంపేట ఓబులవారిపల్లె
ఉచిత విద్య కోసం పాఠశాల స్థాపన
ఫీజు పెంపు పేరిట వసూళ్లు

పైసా వసూల్

పైసా వసూల్