
టీచర్ల పోరుబాట
మదనపల్లె సిటీ: కూటమి ప్రభుత్వ అస్తవ్యస్త విధానాలతో విద్యావ్యవస్థ గాడితప్పుతోంది. ప్రభుత్వం ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కంచకపోగా వారిపై బోధనేతర పనుల భారాన్ని మోపుతూ బోధనకు దూరం చేస్తోంది. ఫలితంగా విద్యార్థులకు చదువు దూరమవుతోంది. కూటమి అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర కావస్తున్నా ఏ ఒక్క సమస్యను పరిష్కరించకపోగా తమపై పనిభారం మోపుతున్నారంటూ టీచర్లు తీవ్ర అగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సమస్యల పరిష్కారం కోసం అంచలంచలుగా పోరుబాట బట్టారు.
● కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు మండిపడుతున్నాయి. అడ్డగోలు నిర్ణయాలతో ఉపాధ్యాయుల మీద మరింత ఒత్తిడి పెంచింది. విద్యార్థులకు చదువులు చెప్పకుండా ఇతర పనులు అప్పగించడంతో సక్రమంగా విధులు నిర్వహించలేకపోతున్నారు. దీంతో ఉపాధ్యాయుల్లో తీవ్రమైన అసంతృప్తి నెలకొంది. చంద్రబాబు తన ప్రచార యావతో యోగాంధ్ర కార్యక్రమాన్ని చేపట్టి ఉపాధ్యాయులను స్కూళ్లను దూరం చేశారు. టీచర్స్ సమావేశాల పేరుతో దాదాపు రెండు వారాల పాటు ఉపాధ్యాయలు పాఠాలకు దూరమయ్యారు. దీనికితోడు రకరకాల శిక్షణ పేరుతో బడులకు వెళ్లలేకపోయారు. ఫలితంగా విద్యార్థులు సైతం చదువులకు దూరమయ్యారు. కూటమి ప్రభుత్వం ఆంక్షలతో కొంత కాలం మౌనం వహించిన ఉపాధ్యాయ సంఘాలు పోరుబాట పట్టాయి. ఫ్యాఫ్టో పేరుతో శుక్రవారం నుంచి భోధనేతర పనులు,విద్యాశక్తి కార్యక్రమాలను బహిష్కరించారు.
ఉపాధ్యాయులు డిమాండ్లు ఇవీ:
● ఏకీకృత సర్వీసు రూల్స్ పరిష్కరించి 72,73,74 జీవోలు అమలు చేయాలి.
● పంచాయతీరాజ్లో పెండింగ్లో ఉన్న కారణ్య నియామకాలు తక్షణమే చేపట్టి, కలెక్టర్ పూల్ ద్వారా వెంటనే పోస్టింగులు ఇవ్వాలి.
● సీపీఎస్ విధానాన్ని వెంటనే రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలి.
● ఉపాధ్యాయులకు బోధన తప్ప బోధనేతర కార్యక్రమాలు లేకుండా చేయాలి.
● విద్యాశక్తి కార్యక్రమం ఐచ్ఛికం అని చెబుతూ బలవంతంగా అమలు చేయడాన్ని విడనాడాలి.
● అసెస్మెంట్ పుస్తకాలను పునః సమీక్షించాలి.
● హైస్కూల్ ప్లస్లలో వెంటనే ఉపాధ్యాయ నియమాలు చేపట్టి, హైస్కూల్ ప్లస్ పాఠశాలలను యథాతథంగా కొనసాగించాలి
● 12వ వేతన సవరణ సంఘాన్ని ఏర్పాటు చేయాలి.
● 30 శాతం మధ్యంతర భృతిని (ఐఆర్) వెంటనే ప్రకటించాలి.
● రిటైర్ అయిన వారికి గ్రాట్యూటీ, కమ్యూటేషన్, లీవ్ ఎన్క్యాష్మెంట్ వంటి బకాయకిలను రిటైర్ అయిన మరుసటి రోజునే చెల్లించాలి.
● సూపర్ న్యూమరీ పోస్టునుల సృష్టించి గ్రేడ్–2 పండిట్లు, పీఈటీలకు పదోన్నతులు కల్పించాలి.
● మున్సిపల్ ఉపాధ్యాయులకు జీపీఎఫ్ సౌకర్యం కల్పించాలి.
● ఈహెచ్ఎస్/ మెడికల్ రీయింబర్స్ంట్ బిల్లుల విషయంలో నిత్యం ఉత్పన్నమవుతున్న సమస్యలను పరిష్కిరంచాలి.
● మండల విద్యాశాఖ అధికారులు బదిలీలు తక్షణమే చేపట్టాలి
● 2008,1998 ఎంటీఎస్ ఉపాధ్యాయులను రెగ్యులర్ చేసి పదవీ విరమణ వయస్సు 62 ఏళ్లకు పెంచాలి.
● బదిలీ అయి సబ్స్టిట్యూట్ లేక రిలీవ్ కాని ఉపాధ్యాయులను రిలీవ్ చేయడానికి చర్యలు తీసుకోవాలి.
కూటమి ప్రభుత్వం హామీలు నెరవేర్చకపోవడంతో ఆగ్రహం
అసెస్మెంట్ బుక్ను పునఃసమీక్షించాలంటూ డిమాండ్
సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన విధానం కొనసాగించాలని పట్టు
బోధనేతర పనుతో పాఠాలకుదూరమవుతున్న ఉపాధ్యాయులు
సమస్యల సాధనకు పోరాడతాం
సమస్యల సాధనకు పోరాడతాం. ఫ్యాఫ్టో ఆద్వర్యంలో జిల్లా వ్యాప్తంగా శుక్రవారం నుంచి బోధనేతర పనులు,విద్యాశక్తి పనలు నిలిపివేశాం. ఉపాధ్యాయులకు బోదనేత పనులు కేటాయించకుండా చర్యలు తీసుకోవాలి.ఇప్పటికై నా కూటమి ప్రభుత్వం ఉపాధ్యాయుల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలి.
–పురం వెంకటరమణ, యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి
ఉపాధ్యాయులకు కొత్త సమస్యలు:
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉపాధ్యాయులకు కొత్త సమస్యలు వచ్చిపడ్డాయి. విద్యార్థులకు చదువు చెప్పడం కంటే కూడా బోధనేతర పనులతోనే తలముకలయ్యేలా ప్రభుత్వం ఒత్తిడి చేస్తుంది. పెండింగ్లోఉన్న ఏకీకృత సర్వీసు నిబంధనలను పట్టించుకోవడం లేదు.
–రెడ్డప్పరెడ్డి, వైఎస్సార్టీఎఫ్ జిల్లా అధ్యక్షులు

టీచర్ల పోరుబాట

టీచర్ల పోరుబాట

టీచర్ల పోరుబాట