
ప్రబలుతున్న జ్వరం... వణుకుతున్న జనం
● అన్నింటా ప్రబలుతున్న విష జ్వరాలు
● కిక్కిరిసిన ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులు
● ప్రభుత్వాస్పత్రిలో వేధిస్తున్న వైద్యుల కొరత
బద్వేలు అర్బన్/ప్రొద్దుటూరు క్రైం : బద్వేల్ పట్టణంలో విష జ్వరాలు ప్రబలుతున్నాయి. ఏ వార్డులో చూసినా ఇంటికి ఒకరు, ఇద్దరు చొప్పున జ్వర పీడితులు చికిత్సకు రావడంతో ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులు కిక్కిరిసిపోతున్నాయి. వైద్యుల కొరత ఉండడంతో రోగులు ఇబ్బంది పడుతున్నారు. గత వారం రోజుల్లో బద్వేల్ ప్రభుత్వాసుపత్రిలో 250 నుండి 400 ఓపీ నమోదవుతుండటం పరిస్థితికి అద్దంపడుతోంది. ఏ ప్రైవేటు ఆసుపత్రి చూసినా జ్వరపీడితులు దర్శనమిస్తున్నారు. ఆస్పత్రి కిటకిటలాడుతున్నా తగినంతమంది వైద్యులు లేకపోవడం రోగులకు శాపంగా మారింది. ప్రభుత్వ ఆస్పత్రిలో వివిధ విభాగాల్లో 12 మంది వైద్యులు ఉండాల్సి ఉండగా, ఆరుగురే ఉన్నారు. వీరిలోనూ ఒకరు డిప్యుటేషన్పై వారంలో రెండు రోజులు మాత్రమే విధులు నిర్వర్తిస్తున్నారు. దీనికి తోడు రక్త పరీక్షలు నిర్వహించే యంత్రం మరమ్మతులకు గురికావడంతో రోగుల కష్టాలు అన్నీ ఇన్నీ కావు. రక్తనమూనాలు సేకరించి గాంధీనగర్ అర్బన్ హెల్త్సెంటర్లో పరీక్ష చేయిస్తుండడంతో ఇబ్బంది పడుతున్నారు.
కిక్కిరిసిన చిన్నపిల్లల వార్డు
ప్రొద్దుటూరు, పరిసర ప్రాంతాల్లో వైరల్ జ్వరాలు విజృంభిస్తున్నాయి. జిల్లా ఆస్పత్రిలో రోజూ సుమారు 1100 దాకా ఓపీ నమోదవుతోంది. మరోవైపు రాజుపాళెం, కామనూరు, కల్లూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలోనూ ఓపీ పెరిగింది. కొన్ని రోజులుగా రాత్రింబవళ్లు వర్షాలు పడుతుండడం, పారిశుద్ధ్యం అధ్వానంగా ఉండడంతో పలువురు జ్వరాల బారిన పడి ఆస్పత్రికి వస్తున్నారు. ప్రైవేట్ ఆస్పత్రులు కిటకిట లాడుతున్నాయి. ఎక్కువమంది చిన్నారులు జ్వరం, జలుబు, విరేచనాలతో ఇబ్బందిపడుతున్నారు. జిల్లా ఆస్పత్రిలో చిన్నపిల్లల వార్డు కిటకిటలాడుతోంది. 20 మంచాలు మాత్రమే ఉండడంతో 30 మంది చిన్నారులు చికిత్స తీసుకుంటున్నారు. మంచాల కొరత కారణంగా ఒక్కో మంచంలో ఇద్దరిని పడుకోబెట్టి చికిత్స అందిస్తున్నారు. ప్రైవేటుగా మరింతమంది చికిత్స పొందుతున్నారు. రక్త పరీక్షల కోసమే వేల రూపాయలు చెల్లించాల్సి వస్తోందని పిల్లల తల్లిదండ్రులు వాపోతున్నారు.
ప్రభుత్వాసుపత్రిలో ఓపీ కోసం బారులు తీరిన జ్వరపీడితులు
చిన్న పిల్లల వార్డులో చికిత్స పొందుతున్న చిన్నారులు

ప్రబలుతున్న జ్వరం... వణుకుతున్న జనం

ప్రబలుతున్న జ్వరం... వణుకుతున్న జనం