
కారుకు నిప్పు
లక్కిరెడ్డిపల్లి : మండల కేంద్రమైన లక్కిరెడ్డిపల్లిలోని పాత మసీదు సమీపంలో మారుతీ కారుకు శుక్రవారం తెల్లవారుజామున గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టినట్లు బాధితుడు అన్వర్ బాష తెలిపారు. తన ఇంటి సమీపంలోని చెట్టు కింద కారు కొన్ని సంవత్సరాలుగా పెడుతున్నామన్నారు. శుక్రవారం తెల్లవారుజామున నిద్రపోయే సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు కారుపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టగా కారు కాలుకుంటూ టైరు పగిలి వెంటనే శబ్దం వచ్చిందని, బయటకు వచ్చి చూసేసరికి కారు అప్పటికే దగ్ధమైందని తెలిపారు. కారు సుమారు నాలుగు లక్షల రూపాయలు పైగా విలువ చేస్తుందన్నారు. పోలీసులకు ఫిర్యాదు చేయగా ఎస్ఐ రవీంద్రబాబు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తామని ఎస్ఐ తెలిపారు.
వృద్ధుడు అదృశ్యం
బి.కొత్తకోట : స్థానిక కరెంట్ కాలనీకి చెందిన వృద్ధుడు వలీసాహెబ్ (65) అదృశ్యం కావడంపై కేసు నమోదు చేసినట్లు శుక్రవారం పోలీసులు తెలిపారు. వలీసాహెబ్కు అప్పుడప్పుడు మతిస్థితిమితం ఉండదు. దీనితో ఇంటినుంచి వెళ్లిన తర్వాత ఎక్కడైనా కనిపిస్తే కుటుంబీకులు ఇంటికి తీసుకెళ్తుంటారు. గతనెల 29న ఇంటినుంచి వెళ్లిన వలీసాహెబ్ ఆచూకీ లభ్యంకాకపోవడంతో కుమారుడు నయాజ్బాషా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
మద్యం దుకాణంలో చోరీ
ఖాజీపేట : మండలంలోని ఎస్వీబీ మద్యం దుకాణంలో చోరీ జరిగింది. సుమారు నాలుగు కేసుల మద్యంతోపాటు క్యాష్ కౌంటర్లోని కొద్ది మొత్తంలో డబ్బును దొంగలు దోచుకుపోయారు. ఖాజీపేట బ్రిడ్జి అవతల ఉన్న మద్యం దుకాణంకు చెందిన యజమానులు శుక్రవారం ఉదయం దుకాణం తెరిచి చూడగా వెనుక భాగంలోని తలుపు తెరిచి ఉండటం గమనించారు. వెంటనే దుకాణంలోనీ సీసీ కెమెరాలను పరిశీలించారు. గురువారం అర్ధరాత్రి ముఖానికి మాస్కు ధరించిన దొంగ తలుపు పగులకొట్టి లోనకు ప్రవేశించాడు. దుకాణంలోని నాలుగు కేసుల మద్యంతోపాటు క్యాష్ కౌంటర్లోని కొద్ది మొత్తంలో డబ్బు చోరీ చేసినట్లు గుర్తించారు. సీసీ కెమెరాలో ఉన్న దృశ్యలను పరిశీలించిన తరువాత ఖాజీపేట పోలీసులకు సమాచారం ఇచ్చారు.
దాడిచేసిన నలుగురిపై కేసు
కలకడ : ఇంటిమీదకు వచ్చి దాడిచేసి కొట్టి గాయపరిచిన నలుగురిపై కేసు నమోదు చేసి ధర్యాప్తు చేస్తున్నట్లు హెడ్కానిస్టేబుల్ హరిబాబు తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. మండలంలోని కలకడ పంచాయతీ, కలకడ కొత్తపల్లె గ్రామానికి చెందిన సిద్దయ్య కుమారుడు అమరనాథను, అదే గ్రామానికి చెందిన నితిన్, తరున్, వినోద్, సంతోష్లు గురువారం రాత్రి కొట్టి గాయపరిచారు. వారి దాడిలో గాయపడ్డ అమరనాథ్, రాధికలను కలికిరి మండలం, మహల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు. శుక్రవారం బాదితుడు అమరనాథ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితులు నలుగురుపై కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

కారుకు నిప్పు