
●కూటమిపై తీరుపై అనుమానాలు
మదనపల్లె : చరిత్రాత్మక మదనపల్లె బీసెంట్ థియోసాఫికల్ కళాశాలను తన్నుకుపోయేందుకు టీడీపీ గద్దలు వాలుతున్నాయి. తిమ్మిని బమ్మిని చేసైనా కళాశాలను దక్కించుకుని అందులో ప్రైవేటు సామ్రాజ్యం నెలకొల్పే ప్రయత్నాలు సాగుతున్నట్టు తెలుస్తుండగా, ఈ విషయంపై టీడీపీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. దీనికి తగ్గట్టు తాజా పరిస్థితులు గందరగోళంగా ఉండగా, ఈ ప్రచార నేపథ్యంలో బీటీ కళాశాలను తిరిగి ఎయిడెడ్ కళాశాలగా మారుస్తారా లేక ప్రభుత్వ నిర్వహణలో అభివృద్ధి చేస్తారా అని విద్యార్థి సంఘాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. దీనిపై స్పష్టత లేనప్పటికి కళాశాల ప్రైవేటు చేతుల్లోకి వెళ్లిపోతుందా అన్న ఆందోళన సర్వత్రా నెలకొంది.
మిథున్రెడ్డితో న్యాయం
వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో బీటీ కళాశాలకు పూర్వ వైభవం తీసుకురావాలని నిర్ణయించింది. విద్యార్థి సంఘాల ఆందోళనలకు స్పందించిన రాజంపేట ఎంపీ మిథున్రెడ్డి కళాశాల చారిత్రిక నేపథ్యం, అభివృద్ధి చేయాల్సిన ఆవశ్యకతను గుర్తించి కళాశాల ప్రభుత్వపరం అయ్యేలా కృషి చేయగా ప్రభుత్వ ఉత్తర్వు జారీ అయ్యింది. అప్పటినుంచి బిసెంట్ సెంటినరీ ట్రస్టు (బీసీటీ) పరిధిలోని డిగ్రీ కళాశాల ప్రభుత్వ కళాశాలగా మారిపోయింది. దీంతో కళాశాల అభివృద్ధికి వివిధ చర్యలు చేపట్టింది. టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది నియామకం చేపట్టడమే కాక ఎంపీ మిథున్రెడ్డి కృషితో బీటీ కళాశాలను అనిబిసెంట్ విశ్వవిద్యాలయంగా మారుస్తూ ఉత్తర్వు జారీ చేసింది. ఇలా కళాశాల అభ్యున్నతికి, భవిష్యత్ ప్రణాళికలను వైఎస్సార్సీపీ ప్రభుత్వం కృషి చేసింది.
లీజు పేరిట టీడీపీ కన్ను
కళాశాల అభివృద్ధిని ఏ మాత్రం పట్టించుకోని కూటమి ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోంది. దీన్ని ఆసరాగా చేసుకుని ఈ కళాశాల యాజమాన్యానికి చెందిన టీడీపీ వ్యక్తి ఒకరు, అక్కడే పని చేస్తున్న మరో టీడీపీ వర్గీయుడు ఈ కళాశాలను దక్కించుకునే యత్నాలు ముమ్మరం చేసినట్టు విద్యా వర్గాల్లో ప్రచారం సాగుతోంది. ముందుగా బీసీటీ సభ్యులైతే దీనిని చేజిక్కించుకోవడం సులువని భావించి చైన్నెలో ఉంటున్న కొందరు సభ్యులతో సఖ్యతగా ఉంటూ అందులో సభ్యత్వం తీసుకున్నారని ప్రచారం జరుగుతోంది. ఇదే విషయాన్ని ఆ ఇద్దరిలో ఒకరు తాము బీసీటీలో సభ్యులమయ్యామంటూ ప్రచారం చేసుకుంటున్నారని పలువురు చెప్పారు. ఈ కళాశాలను 99 ఏళ్ల లీజు పేరిట దక్కించుకుని అందులో కోట్ల విలువైన భూములు, కోట్ల విలువైన ఆస్తులను తమ ఆధీనంలోకి తీసుకుని విద్యా సంస్థలను అందులో ప్రారంభించాలన్న ఆలోచనతో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. కళాశాల నిర్వహణలో అనుభవం కలిగిన ఆ వ్యక్తులు మదనపల్లె పట్టణ నడిబొడ్డున వందల కోట్ల విలువైన బీసీటి ఆస్తులు, కళాశాలను ఎలాగైనా దక్కించుకునే ప్రయత్నాల్లో ఉన్నట్టు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
పట్టించుకోని ట్రస్టు
బీటీ కళాశాల స్థితి గుతులు, అభివృద్ధి, చేపట్టాల్సిన చర్యలపై ట్రస్టు సభ్యులు పట్టించుకోవడం లేదు. ఇక్కడ పర్యటించి ఏమి జరుగుతోందో పరిశీలించి నిర్ణయాలు తీసుకుంటారు. సభ్యులుగా ప్రభుత్వ స్థాయిలో ఉద్యోగ విరమణ చేసిన ఉన్నతస్థాయి వ్యక్తులు ఉన్నారు. వీరు పట్టించుకుంటే కళాశాల పరిస్థితుల్లో మార్పు వస్తుంది. అయితే ఆశాజనకమైన వాతావరణం కనిపించడం లేదు. ఈ పరిస్థితుల్లో ట్రస్టు ద్వారా ఆస్తులు, కళాశాలను లీజు పేరిట దక్కించుకునేందుకు ప్రయత్నాలు సాగుతున్నట్టు చెబుతున్నారు.
స్పందించని కార్యదర్శి
బీసెంట్ సెంటినరీ ట్రస్టులో ఇద్దరు టీడీపీ వర్గీయులకు సభ్యులుగా అవకాశం కల్పించారన్న ప్రచారంపై ట్రస్టు కార్యదర్శి సుధాకర్ దృష్టికి తీసుకెళ్లేందుకు పలుమార్లు ప్రయత్నించగా ఆయన స్పందించలేదు. అలాగే ట్రస్టు సభ్యులైనట్టు ప్రచారం జరుగుతున్న వారిలో ఒకరి వివరణ కోసం ఫోన్లో ప్రయత్నించగా అందుబాటులోకి రాలేదు.
బీసీటీలో సభ్యులుగా ఇద్దరు
టీడీపీ వర్గీయులు చేరారని ప్రచారం
99 ఏళ్ల లీజు పేరిట వందల కోట్ల
విలువైన ఆస్తులు దక్కించుకునేందుకు యత్నాలు?
కళాశాల వ్యవహారాలపై దృష్టి పెట్టని ట్రస్టు సభ్యులు
గాలికి వదిలేసిన కూటమి ప్రభుత్వం
కళాశాల అభివృద్ధి విషయంలో కూటమి ప్రభుత్వం చూపిస్తున్న నిర్లక్ష్యం అనుమానాలకు ఊతమిస్తోంది. ఏడాది దాటినా కళాశాల స్థితగుతులపై పట్టించుకోకపోవడంతో తెర వెనుక టీడీపీ వర్గీయులకు కట్టబెట్టే వ్యూహం ఉందన్న అనుమానాలు బలపడుతున్నాయి. డిగ్రీ కళాశాల ప్రభుత్వం ఆధీనంలోకి వచ్చాక ఇక్కడి విద్యార్థుల సంఖ్య, ప్రస్తుత విద్యార్థుల సంఖ్య చూస్తేనే కూటమి ప్రభుత్వం ఎంతటి నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందో స్పష్టం అవుతుంది.

●కూటమిపై తీరుపై అనుమానాలు

●కూటమిపై తీరుపై అనుమానాలు

●కూటమిపై తీరుపై అనుమానాలు