
ఆంధ్రా కువైట్లో ఏపీఎన్ఆర్టీఎస్ ఎత్తివేత!
రాజంపేట : ఉమ్మడి కడప జిల్లాలో ఆంధ్రా కువైట్గా ప్రసిద్ధికెక్కిన రాజంపేటలో ఏపీఎన్ఆర్టీఎస్ (ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ) కార్యాలయం ఎత్తివేశారు. దీంతో గల్ఫ్ వాసులను ఆదుకునే పరిస్ధితులు లేకుండా పోయాయి. కువైట్ దేశం వలన రాజంపేటలోని ఎస్బీఐ రాష్ట్రంలోనే మొదటి స్ధానంలో నిలిచింది. ఎన్ఆర్ఐ ఖాతాలను బట్టి రాజంపేట ఆంధ్రా కువైట్గా పేరు గడించింది. ఈ నేపథ్యంలో రాజంపేటను గుర్తించి, గల్ఫ్ దేశాలలో ఉండే వారి కోసం ప్రవాసాంధ్రులకు సేవలందించేందుకు గాను వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయిన తొలినాళ్లలో న్యూ బోయనపల్లె(కడప–రేణిగుంట జాతీయరహదారి)లో ఏర్పాటు చేశారు. ఆ కార్యాలయాన్ని కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో ఖాళీ చేశారు.
రాయలసీమ జిల్లాల కోసం రాజంపేటలో ఏర్పాటు..
రాయలసీమ జిల్లాలలోని గల్ఫ్వాసుల కోసం రాజంపేటలోనే ఏపీఎన్ఆర్టీఎస్ ఏర్పాటు చేయడం గమనార్హం. ఇప్పుడు భవన యజమాని టూ లెట్ బోర్డు పెట్టేశారు. దీంతో ఏపీఎన్ఆర్టీఎస్ కార్యాలయం ఎత్తివేసినట్లుగా గల్ఫ్వాసులు గుర్తించారు.
ఉమ్మడి జిల్లా నుంచి ఎడారి దేశాలకు..
రాయలసీమలో ప్రధానంగా ఉమ్మడి కడప జిల్లా నుంచి అధికంగా ఎడారి దేశాలకు వెళ్లేవారి సంఖ్య లక్షల్లో ఉంటుంది. జీవనోపాధి కోసం నాలుగు దశాబ్దాలుగా ఎడారి దేశాలకు రాకపోకలు సాగిస్తూనే ఉన్నారు. ప్రధానంగా కువైట్, ఖత్తర్, దుబాయ్, సౌదీ అరేబియా, బహ్రెయిన్, అబుదాబి, లెబనాన్, మస్కట్ దేశాలు ఉన్నాయి. గల్ఫ్ దేశాలకు వెళ్లే వారు అధికంగా 60 శాతం చదువురాని వారు ఉన్నారు.
మోసాలపాలైన వారి కోసం..
మోసానికి గురై జైలుపాలై అనేక సమస్యలలో ఇరుక్కున్నవారు కూడా ఉమ్మడి కడప జిల్లాలో ఉన్నారు. వారిని అన్ని విధాలుగా ఆదుకునేందుకు నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏపీఎన్ఆర్టీఎస్ను బలోపేతం చేశారు. సీమలో గల్ఫ్వాసులు అధికంగా ఉన్న కారణంగా రాజంపేటలో సొసైటీ కార్యాలయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. దీని ద్వారా వందలాది మంది గల్ఫ్ బాధితుల సమస్యలకు పరిష్కారం చూపారు. గల్ఫ్దేశాలలో జీవించేందుకు, వారిలో నైపుణ్యం పెంపొందించేందుకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు. విదేశాలకు వెళ్లేవారు, నివసిస్తున్న వారి కోసం హెల్ప్లైన్ నంబర్లను అందుబాటులోకి తీసుకొచ్చారు. సురక్షిత వలసలపై వైఎస్సార్ కడప, అన్నమయ్య జిల్లాలలో అవగాహన కార్యక్రమాలను సొసైటీ నిర్వహించింది. సొసైటీ ద్వారా దేశ వ్యాప్తంగా 200 కంటే ఎక్కువ మందిని కో–ఆర్టినేటర్లను నియమించారు.
ఏపీఎన్ఆర్టీఎస్ ఏమేమి చేసిందంటే..
ప్రవాసాంధ్రులకు సహాయనిధి, భరోసా బీమా, ఆన్లైన్ ఐటీ శిక్షణ, ఏపీ పోలీసు ఎన్ఆర్ఐ సెల్, ఫ్రీ–డిపార్టుమెంట్ ఓరియంటేషన్ అండ్ ట్రైనింగ్, ఏపీఎన్ఆర్టీఎస్ ట్రస్ట్ కనెక్టు టు ఆంధ్రా, పెట్టుబడులు సలహాలు, పవిత్ర నాణేలు, ఆర్థిక పునర్ వ్యవస్థీకరణ కేంద్రం, పాస్పోర్టులో సలహాలు, మరణించిన ఎన్ఆర్టీఎస్ బంధువులకు ఎక్స్గ్రేషియా, అధునాతన ఐటీ కోర్సులలో ఆన్లైన్ శిక్షణ , అంతర్జాతీయ నైపుణ్య శిక్షణ, అంతర్జాతీయ కంపెనీలలో నియామకాల సౌకర్యం వంటి ఉచిత సేవలను అందజేశారు.
జగన్న పాలనలో గల్ఫ్ బాధితులకు భరోసా
ఏపీఎన్ఆర్టీఎస్తో ఎందరికో ఆపన్నహస్తం
కూటమి పాలనలో సేవలకు మంగళం
ఏపీఎన్ఆర్టీఎస్తో విదేశాలలో ఉన్నవారికి భరోసా
ఏపీఎన్ఆర్టీఎస్ ద్వారా విదేశాలలో ఉన్నవారికి భరోసా కల్పించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఈ సొసైటీ ద్వారా విస్తతృంగా సేవా కార్యక్రమాలను నిర్వహించారు. ఆ దిశగా అనేక మంది విదేశీ బాధితులను ఆదుకునేందుకు సొసైటీ ముందుకు నడిచేలా జగనన్న ప్రభుత్వం ఏపీఎన్ఆర్టీఎస్ను తీర్చిదిద్దింది.
చిల్లా కిరణ్, యూఎస్ఏ, వెంకటరెడ్డిపల్లె, రైల్వేకోడూరు
జగనన్న పాలనలో ఏపీఎన్ఆర్టీఎస్ బలోపేతం
వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా కొనసాగిన పాలనలో ఏపీఎన్ఆరీటీఎస్ బలోపేతం చేశారు. అప్పటి వరకు ఇలాంటి సొసైటీ ఒకటి ఉందనేది చాలా వరకు తెలియదు. వైఎస్సార్సీపీ పాలనలో సొసైటీ ద్వారా ఎందరో గల్ఫ్ బాధితులను ఆదుకున్నారు. కోవిడ్–19లో తనదైన రీతిలో సేవలందించారు. రాయలసీమలో గల్ఫ్ వాసుల కుటుంబాలు అధికంగా ఉన్నాయి. ఆ దృష్ట్యా రాజంపేటలో సొసైటీ ఏర్పాటు చేశారు.
–గోవిందు నాగరాజు, వైఎస్సార్సీపీ గల్ఫ్ కో–కన్వీనర్, కువైట్

ఆంధ్రా కువైట్లో ఏపీఎన్ఆర్టీఎస్ ఎత్తివేత!

ఆంధ్రా కువైట్లో ఏపీఎన్ఆర్టీఎస్ ఎత్తివేత!

ఆంధ్రా కువైట్లో ఏపీఎన్ఆర్టీఎస్ ఎత్తివేత!