
రోడ్డు ప్రమాదంలో తండ్రీ కూతురు దుర్మరణం
పుల్లంపేట : విధి ఆడిన వింత నాటకంలో తండ్రీ, కూతురు దుర్మరణం చెందారు. వివరాల్లోకి వెళ్తే.. పుల్లంపేట మండలం, దళవాయిపల్లి గ్రామానికి చెందిన బుక్కా వెంకట సుబ్బారెడ్డి (45), కుమార్తె బుక్కా స్నేహలత (18)లు శనివారం రాత్రి రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. బుక్కా వెంకట సుబ్బారెడ్డి జీవనోపాధి నిమిత్తం గల్ఫ్ దేశానికి వెళ్లాడు. పది రోజుల క్రితం ఇంటికి రావడంతో ఇంటిల్లిపాది ఆనందంగా గడిపారు. హైదరాబాదులో బీటెక్ ప్రథమ సంవత్సరం చదువుతున్న కుమార్తె స్నేహలత తండ్రి రావడంతో ఇంటికి వచ్చింది. చిట్వేలిలో చదువుతున్న కుమారుడిని పిలుచుకుని వచ్చేందుకు వెంకటసుబ్బారెడ్డి తన కుమార్తె స్నేహలతను తీసుకుని శనివారం బైకుపై బయలుదేరారు. చిట్వేలి నుంచి తిరిగి వస్తుండగా రాజంపేట సమీపంలో అతివేగంగా వచ్చిన స్కార్పియో వాహనం వీరి బైక్ను ఢీ కొంది. ఈ ప్రమాదంలో కుమార్తె స్నేహలత అక్కడికక్కడే మృతి చెందగా, తండ్రి వెంకట సుబ్బారెడ్డిని ఆసుపత్రికి తరలించగా గంట వ్యవధిలోనే మృతి చెందాడు. కుమారుడు వెంకటరమణారెడ్డి(13) స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
ఖాళీ బిందెలతో మహిళల నిరసన
సిద్దవటం : మండలంలోని మాధవరం–1 గ్రామ పంచాయతీ పరిధిలోని వెంకటేశ్వరపురంలో నెలకొన్న తాగునీటి సమస్యను పరిష్కరించాలని అధికారులను కోరినా స్పందించలేదని గ్రామ మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆదివారం వారు ఖాళీ బిందెలతో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం స్థానిక మహిళలు మాట్లాడుతూ గత రెండు వారాలుగా తాగునీరు రావడం లేదన్నారు. సుదూర ప్రాంతాలకు వెళ్లి తాగునీరు తెచ్చుకుంటున్నామన్నారు. ఉన్నతాధికారులు తమ సమస్యను పరిష్కరించి తాగునీరు అందించాలని వారు కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక మహిళలు పారిజాతం, లక్ష్మిదేవి, ఈశ్వరమ్మ, పద్మావతి, వెంకటసుబ్బమ్మ తదితరులు పాల్గొన్నారు.
ఉద్యోగాల పేరుతో మోసం
కడప అర్బన్ : జిల్లాలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, కస్తూర్బా కళాశాలల్లో కేరీర్ కౌన్సెలింగ్ డెవలప్మెంట్ అధికారి(సీసీడీఓ) పేరిట ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయంటూ కడపకు చౌటుపల్లె రోడ్డులో నివాసముంటున్న రవి అలియాస్ రఫి కొంతమంది నిరుద్యోగులను నమ్మ బలికించాడు. ఒక్కో నిరుద్యోగి వద్ద నుంచి రూ.5 లక్షల నుంచి 6.50 లక్షల వరకు వసూలు చేశాడని బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ సందర్భంగా బాధితులు రవి అలియాస్ రఫీ నివసిస్తున్న ఇంటి వద్ద ఆదివారం ఉదయం ఆందోళన చేపట్టారు. బాధితులు మాట్లాడుతూ రవి అలియాస్ రఫీ తమకు ఉద్యోగాలను ఇప్పిస్తామంటూ ఒకొక్కక్కరి దగ్గరి నుంచి రూ. 6:50 లక్షలను తీసుకున్నాడన్నారు. నిరుద్యోగులైన తమకు ఉద్యోగం వస్తే అప్పు ఎలాగైనా తీర్చుకోవచ్చనే ధైర్యంతో తొలుత కొందరు డబ్బులిచ్చి ఉద్యోగాల్లో చేరారన్నారు. సంబంధిత అధికారి సంతకం చేసిన నియామక ఉత్తర్వులను తీసుకుని 2024 ఆగస్టులో ఉద్యోగాల్లో చేరారన్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు వెళ్లగా అక్కడున్న అధికారులు కూడా తమను ఉద్యోగాల్లో చేర్చుకున్నారని వారు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 21 మంది ఉద్యోగాల్లో చేరామన్నారు. మూడు నెలల పాటు పని చేశామన్నారు. తరువాత ఉన్నతాధికారులు నిర్వహించిన తనిఖీల్లో తమ నియామకాలు చెల్లవంటూ రద్దు చేసి ఇళ్లకు పంపించారన్నారు.

రోడ్డు ప్రమాదంలో తండ్రీ కూతురు దుర్మరణం