
బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించే వారిపై కేసు నమోదు
సిద్దవటం : మండలంలో బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తున్న ఆరుగురిపై కేసులు నమోదు చేశామని ఎస్ఐ మహమ్మద్రఫీ తెలిపారు. స్థానిక పోలీసు స్టేషన్లో శనివారం ఆయన మాట్లాడుతూ బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం చట్టరీత్యా నేరమన్నారు. ఇతరులకు ఇబ్బందికరంగా మద్యం సేవిస్తూ ప్రజలకు అసౌకర్యం కల్పిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
తల్లీబిడ్డల అదృశ్యం
బి.కొత్తకోట : తల్లి, ఇద్దరు బిడ్డల అదృశ్యంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు హెడ్ కానిస్టేబుల్ విశ్వనాథరెడ్డి తెలిపారు. ఆయన కథనం మేరకు..బి.కొత్తకోట బీసీ కాలనీకి చెందిన బత్తుల వాసు 14 ఏళ్ల క్రితం సునీలను వివాహం చేసుకున్నాడు. వీరికి సందీప్, కీర్తన సంతానం. శుక్రవారం ఉదయం వాసు పనుల నిమిత్తం ఇంటి నుంచి బయటకు వెళ్లి సాయంత్రం తిరిగి వచ్చాడు. ఇంటిలో చూడగా భార్య, పిల్లలు కనిపించలేదు. ఆందోళనకు గురైన వాసు సోదరుడు ఆంజనేయులతో కలిసి బి.కొత్తకోట, పరిసర ప్రాంతాల్లో గాలించినా ఆచూకీ లభ్యం కాలేదు. దీనితో వాసు ఫిర్యాదు మేరకు అదృశ్యంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో
వ్యక్తి మృతి
ఒంటిమిట్ట : మండల కేంద్రమైన ఒంటిమిట్టలో శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు మొయిందిపల్లికి చెందిన రేవూరి శంకరయ్య (50)ను రైల్వేస్టేషన్కు వెళ్లే దారిలోని కడప–చైన్నె జాతీయ రహదారిపై రాత్రి 10 గంటలకు గుర్తు తెలియని వాహనం ఢీ కొంది. ఈ ప్రమాదంలో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కడప రిమ్స్కు తరలించి కేసు నమోదు చేశారు.