
ఆమోదం లేదు.. జీతాలు లేవు!
మదనపల్లె: సెలక్షన్ గ్రేడ్ మున్సిపాలిటీ అయిన మదనపల్లెలో పారిశుధ్య పనుల నిర్వహణ కోసం అధికారులు నియమించుకున్న 80 మంది దినసరి పారిశుధ్య కార్మికుల నియామకం ప్రభుత్వ ఆమోదం మేరకు జరగలేదని స్పష్టం అవుతోంది. కోవిడ్–19 కోసం గత ప్రభుత్వం కార్మికులను నియమించుకునేందుకు అనుమతి ఇచ్చి తర్వాత ఆ వ్యవస్థను ఆపేసింది. అయితే 2024 జూలైలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన ఓ మెమో ఆధారంగా మున్సిపాలిటీల్లో దినసరి పారిశుధ్య కార్మికులను నియమించుకోగా చాలా చోట్ల ప్రభుత్వం నుంచి నియామక అనుమతులు ఉన్నాయా లేవా అన్న పరిశీలన లేకనే వేతనాలు మంజూరు చేస్తున్నారన్న అంశం చర్చనీయాంశమైంది. అయితే మదనపల్లె మున్సిపాలిటీకి సంబంధించి ప్రీ ఆడిట్లో ఈ విషయాన్ని పసిగట్టడంతో ఏ మున్సిపాలిటీలోనూ జరగని విధంగా వేతనాలకు బ్రేక్ పడింది. మిగతా మున్సిపాలిటీల్లో వేతనాలు ఇస్తున్నప్పుడు మదనపల్లెకు ఎందుకు చెల్లించరు అన్న వాదన ఉన్నప్పటికి తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి మున్సిపాలిటీలో కార్మికులను తొలించిన విషయాన్ని ఉదహరిస్తున్నారు.
మెమో ఆధారంగా నియామకం
మదనపల్లె మున్సిపాలిటీలో 80 మంది పారిశుధ్య దినసరి కార్మికులను ప్రభుత్వం జారీ చేసిన మెమో ఆధారంగా అధికారులు నియమించుకొన్నట్టు తెలుస్తోంది. మెమోలో మూడు అంశాలను సూచించారు. సంస్థల ద్వారా కార్మికులను నియమించుకోవడం, వారికి రూ15వేల వేతనం మున్సిపల్ సాధారణ నిధుల నుంచి చెల్లించడం, పారిశుధ్య పనులను కాంట్రాక్ట్ సంస్థలకు అప్పగించి యాంత్రీకరణ చర్యలు తీసుకోవడం. దీంతో కార్మికులను నియమించుకునే వెసులుబాటు మెమోలో ఉన్నప్పటికి తర్వాత ఈ మెమోపై మున్సిపల్శాఖ నుంచి మార్గదర్శకాలు జారీ కాలేదని అభ్యంతరం. ప్రభుత్వం నుంచి డీఎంఏకి ఈ మెమో జారీ అయ్యింది కాని డీఎంఏ నుంచి ఎలాంటి ఉత్తర్వు లేదన్నది ప్రీ ఆడిట్ వాదన. ఈ విషయం పక్కన పెడితే పారిశుధ్య కార్మికులను నియమించుకున్నాక ప్రభుత్వ ఆమోదం కూడా పొందలేదు. దీంతో కార్మికుల నియామకం, వేతనాల చెల్లింపు సాధ్యపడదని ప్రీ ఆడిట్ లేవనెత్తిన ప్రశ్నలు.
లేఖలకు లభించని ఆమోదం
దినసరి పారిశుధ్య కార్మికుల వేతనాల చెల్లింపునకు 2024 డిసెంబర్ వరకు ప్రీ ఆడిట్ అభ్యంతరాలు లేవు. అంతకుముందు వేతనాల కోసం పంపిన బిల్లులు పంపినట్టుగా మంజూరవుతూ వచ్చాయి. తర్వాత ఆభ్యంతరం వ్యక్తం కావడం, నియామక అనుమతుల విషయంపై ప్రీ ఆడిట్ కోరడంతో సమస్య వెలుగులోకి వచ్చింది. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటిదాకా వేతనాలు పెండింగ్లో ఉండిపోయాయి. ఈ పరిస్థితుల్లో నియమించుకున్న పారిశుధ్య కార్మికులకు ఆమోదం తెలపాలని కోరుతూ మున్సిపల్ అధికారులు ఒకటికి మూడుసార్లు ప్రభుత్వానికి లేఖలు రాశారు. ఈ లేఖలపై ఇప్పటికి స్పందన లేదని తెలిసింది.
● ప్రీ ఆడిట్ నాయక్ బదిలీ కావడంతో ఆయన స్థానంలో హిమేష్ నియమితులయ్యారు. దీంతో అందరూ ఆయన నిర్ణయం కోసం ఆశలు పెట్టుకున్నారు. తాజాగా మదనపల్లె మున్సిపాలిటి దినసరి పారిశుద్ద్య కార్మికులకు వేతనం మంజూరు చేయాలని అధికారులు బిల్లులు పెట్టారని సమాచారం. కొత్త ప్రీ ఆడిట్ వేతనాల మంజూరుకు మిగిలిన మున్సిపాలిటీల పద్దతిని పరిగణలోకి తీసుకుని ఆమోదం తెలుపుతారా లేదా అన్నది ఉత్కంఠ నెలకొంది.
శ్రీకాళహస్తి తరహా నిర్ణయమే పరిష్కారం
రాష్ట్రమంతా దినసరి పారిశుధ్య కార్మికులను నియమించుకున్నారు..మేం కూడా నియమించామని మదనపల్లె మున్సిపల్ కమిషనర్ చెబుతుండగా..తిరుపతిజిల్లా శ్రీకాళహస్తి మున్సిపాలిటి అంశాన్ని ఆడిట్ వర్గాలు తెరపైకి తెస్తున్నారు. కోవిడ్–19 కోసం నియమించుకున్న కార్మికులను కొనసాగిస్తుండగా గత ఏడాది నవంబర్లో ప్రీ ఆడిట్లో వారి నియామకంపై సందేహాలు వ్యక్తం చేస్తూ 25 మంది కార్మికుల వేతనాలను నిలిపివేశారు. తర్వాత మున్సిపల్ కమిషనర్..కార్మికులు పనిచేసిన కాలానికి వేతనాలు మంజూరు చేయాలని, దీనిపై వ్యక్తమయ్యే ఏ అభ్యంతరానికై నా బాధ్యత వహిస్తామని కమిషనర్ ఇచ్చిన లేఖతో వేతనాలు మంజూరు చేయగా..తర్వాత కార్మికులను విధుల నుంచి తొలగించారు. ఇప్పుడు మదనపల్లె విషయంలోనూ శ్రీకాళహస్తి తరహాలో తీవ్ర ఇబ్బందులు పడుతున్న మదనపల్లె కార్మికులకు వేతనాలు చెల్లించాక..వారి విధులపై తదుపరి నిర్ణయం తీసుకునే అవకాశం కమిషనర్కు కల్పిస్తే రెండువైపులా సమస్యకు పరిష్కారం లభిస్తుంది. లేదంటే కార్మికులకు తీవ్రంగా నష్టపోవాల్సిన పరిస్థితి వస్తుంది.
మదనపల్లె మున్సిపాలిటీలో 80 మంది పారిశుధ్యకార్మికుల వ్యవహారం..
లేఖలపై ఆమోదం తెలపని ప్రభుత్వం
వేతనాల మంజూరుకు బిల్లులు పంపిన అధికారులు
కొత్త ప్రీ ఆడిట్ నిర్ణయంపైనే ఆశలు
ఆమోదంతోనే నియామకం
ప్రభుత్వ ఉత్తర్వు మేరకే పారిశుధ్య కార్మికులను నియమించుకుని పనులు చేయిస్తున్నాం. వారికి నెలవేతనం రూ.15వేలు చెల్లించే అంశం ప్రభుత్వ మెమోలోనే ఉంది. దీనికి మున్సిపల్ కౌన్సిల్ కూడా ఆమోదం తెలిపింది. అయితే ప్రీ ఆడిట్లో అభ్యంతరం పెట్టి వేతనాలు నిలిపివేశారు. నియామకం అంతా నిబంధనల ప్రకారమే జరిగింది. పనులు చేసిన పారిశుధ్య కార్మికులకు వేతనాలు చెల్లించి న్యాయం చేసేందుకు కృషి చేస్తున్నాం. –ప్రమీల, మదనపల్లె కమీషనర్

ఆమోదం లేదు.. జీతాలు లేవు!