రాయచోటి: సూపర్ సిక్స్ పథకాలలో భాగంగా తల్లికి వందనం పేరుతో ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉంటే.. అంత మందికి రూ.15 వేల చొప్పున జమ చేస్తామని ఎన్నికల ముందు కూటమి పెద్దలు పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. నీకు 15 వేలు, నీకు 15 వేలు, నీకు 15 వేలు అంటూ ఊదరగొట్టారు. ఇద్దరు ఉంటే రూ.30 వేలు, ముగ్గురు ఉంటే రూ.45 వేలు ఇస్తామంటూ చెప్పుకొచ్చారు. తీరా అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన నేపథ్యంలో ఎట్టకేలకు తల్లికి వందనం పథకం సొమ్ములు తల్లుల ఖాతాల్లో జమ అవ్వడం మొదలయ్యాయి. హామీ ఇచ్చినట్లుగా రూ.15 వేలు కాకుండా రూ.13 వేలే జమ చేశారు.
కరెంటు బిల్లు ఎక్కువ
వచ్చిందనే కారణంతో..
జిల్లాలో కూటమి సర్కారు అట్టహాసంగా అమలు చేసిన తల్లికి వందనం పథకంలో చిన్న చిన్న తప్పిదాలతో చాలా మంది అర్హులైన విద్యార్థులకు ఆర్థిక సాయం జమ కాక తల్లులు సచివాలయాల చుట్టూ పరుగులు పెడుతున్నారు. సచివాలయాలు, బ్యాంకులు, కరెంట్ ఆఫీసులు, రెవెన్యూ కార్యాలయాల వద్దకు పరుగులు తీస్తున్నారు. బ్యాంకు ఖాతాల్లో తల్లికి వందనం డబ్బు జమ కానట్లు తెలియడంతో చాలా మంది ఉసూరుమంటూ వెనుతిరిగి వెళుతున్నారు. కొందరికి విద్యుత్ వినియోగం ఎక్కువ అనే కారణంతో పథకం సొమ్ములు జమ కాలేదని తెలియడంతో విద్యుత్ సబ్స్టేషన్ వద్దకు క్యూ కడుతున్నారు. కొందరికి ఎలాంటి భూమి లేకపోయినా 10, 15 ఎకరాలు భూములు ఉన్నాయన్న సమాచారంతో తహసీల్దార్ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేయడం పరిపాటిగా మారింది. ఆధార్ కార్డు, రేషన్ కార్డులలో పేర్లు తప్పులు దొర్లిన వాటిని సరిచేసుకోవడానికి ఉపాధి పనులను వదిలి రోజుల తరబడి తిరగాల్సి వస్తోంది. ఇలా చిన్న చిన్న తప్పుల కారణంగా అర్హులైన వారికి కూడా తల్లికి వందనం డబ్బులు జమ కాలేదు. ఇంటి పేరున ఎవరికో ఇన్ కమ్ ట్యాక్స్ ఉందన్న నెపంతో అర్హుల జాబితాలో పేరు కనిపించకుండా పోయింది.
పూర్తి స్థాయి విచారణ చేపట్టకుండా..
ఏడాది కిందట నుంచి పథకాన్ని అమలు చేస్తున్నామని చెబుతున్న కూటమి ప్రభుత్వం ముందుగానే అర్హుల జాబితా ఎందుకు బయట పెట్టలేదని ప్రశ్నిస్తున్నారు. తల్లికి వందనం లిస్టు తయారు చేసే ముందు అధికారులు లబ్ధిదారుల విషయంలో పూర్తిస్థాయి విచారణ చేపట్టకుండా నిర్లక్ష్యంగా పూర్తి చేయడంతో అర్హులైన వారు నేడు పలు రకాల తిప్పలు, ఇక్కట్లకు గురవుతున్నారు. మొదట అధికారులు సక్రమంగా విచారణ చేసి ఉంటే ఇలాంటి సమస్యలు ఉత్పన్నం అయ్యేవి కావన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనికి అధికారుల నిర్లక్ష్యమే ప్రధాన కారణం కావడంతో విద్యార్థుల తల్లిదండ్రులు పనులను వదిలిపెట్టి పలు కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. అర్హులమని సచివాలయం హెల్పేర్ అసిస్టెంట్లకు సర్టిఫికెట్స్ అందజేస్తున్నారు. ఈ సర్టిఫికెట్ ఆధారంగా వీరు అర్హులుగా చాలా మంది నమోదవుతున్నారు.
తప్పు చేసిన అధికారులపై చర్యలేవి?
మొదట అనర్హులుగా ఉన్న వారు వారి దిద్దుబాటుతో అర్హులుగా మారుతున్నారు. ఇలాంటి సమస్యలు ఎదురైన చోట ఉన్నత స్థాయి అధికారులు పర్యవేక్షించి గతంలో తప్పు చేసిన అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తప్పు చేసిన అధికారులను ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఉద్యోగుల్లో నిర్లక్ష్య భావం ఎక్కువ అవుతుందని మేధావులు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వం ఎంతో ఉన్నత ఆశయంతో చేపట్టే పథకాలు అధికారుల నిర్లక్ష్యంతో అర్హులకు అందకుండా పోతున్నాయి. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలుకు అర్హుల జాబితా తయారీ సమయంలోనే క్షుణ్ణంగా పరిశీలిస్తే అర్హులకు ఇలాంటి ఇబ్బందులు తప్పవని అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనా కూటమి పాలనలో సంక్షేమ పథకాల అమలు విషయంలో ఇటు అధికారులు, అటు ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదన్న విమర్శలు ఉన్నాయి.
దివ్యాంగులకూ అందని దైన్యం
ఈమె పేరు తూగు రమాదేవి. కురబలకోట మండలంలోని ఆంగళ్లు గ్రామం మొలకవారిపల్లె. ఈమె వికలాంగురాలు. చందన ఒక్కటే కుమార్తె. స్థానిక మొలకవారిపల్లె ప్రభుత్వ పాఠశాలలో నాలుగో తరగతి చదువుతోంది. తల్లికి వందనం రూ. 13 వేలు జమ అయి ఉంటుందని బ్యాంకుకు వెళ్లారు. ఇంత వరకు జమ కాలేదు. వీరికి సెంటు భూమి కూడా లేదు. ఏళ్లుగా బాడుగ ఇంటిలో కాలం వెల్లదీస్తున్నారు. వీరి కంటే ఆ ఊరిలో పేదవారు లేరు. ఈమె భర్త సాధారణ కూలీ. ఆపై ఇతను కూడా వికలాంగుడే. తల్లికి వందనంకు అన్ని అర్హతలు ఉన్నా బ్యాంకు ఖాతాకు డబ్బులు జమ కాకపోవడం విచిత్రంగా ఉంది. మన మిత్ర యాప్లో పరిశీలిస్తే ఈ పథకానికి అర్హులు కాదు అని వస్తోంది. అధికారులను అడిగితే తగిన స్పందన లేదు. ఇంటిలో ఎంత మంది పిల్లలున్నా ఇస్తామన్నారు. ఈమె వరకు చూస్తే ఉన్న ఒక్కరికి కూడా తల్లికి వందనం జమ కాలేదు. దీన్ని బట్టి ఈ పథకం ఎలా అమలు అవుతోందో అర్థం చేసుకోవచ్చని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేస్తోంది.
ఒక పిల్లోడికి పడింది.. ఇంకో పిల్లోడికి పడలేదు
నాపేరు మొక్కపల్లి కృష్ణమ్మ. మాది రాజంపేట. నాకు ఇద్దరు కొడుకులు. అయితే పదో తరగతి చదువుతున్న నా చిన్నకొడుకు సత్తయ్యకు తల్లికి వందనం పడింది. ఇంటర్మీడియెట్ రెండో సంవత్సరం చదువుతున్న రెడ్డయ్యకు పడలేదంట. మాకు తెలిసిన ఆయన సెల్ఫోన్లో చూసి చిన్నోడికి వచ్చినట్లు ఉంది, పెద్దోడికి రానట్లు ఉంది అని చెప్పినాడు. ఒక పిల్లోడికి వచ్చి, ఇంకో పిల్లోడికి రాకపోవడం అన్యాయం కదా సారు. జగన్ ప్రభుత్వంలో అమ్మఒడి ఒకేసారి ఇద్దరు పిల్లోళ్ళకు డబ్బులు పడేవి. మేము రజకులం. మా ఇంటాయన చనిపోయాడు. నేను రజక వృత్తి చేసుకొని పిల్లోళ్లను చదివించుకుంటూ కట్టం మీద బతుకుతున్నాము. ప్రభుత్వం చెప్పినట్లు ఎంతమంది ఉంటే అంత మందికి తల్లికివందనం డబ్బులు వేయాలి.
భూమి లేకున్నా... ఉన్నట్లుగా..
నా పేరు అవటాల సుగుణమ్మ, మాది రామాపురం మండలం నల్లగుట్టపల్లి పంచాయతీ. నా పేరున ఒక సెంటు భూమి లేదు. నా కుమారుడు రాయచోటిలో 7వ తరగతి చదువుతున్నాడు. ప్రభుత్వం నుంచి తల్లికి వందనం పథకానికి అనర్హుల జాబితాలో పేరు ఇచ్చారు. ఇదేమని తెలుసుకోవడానికి సచివాలయానికి వెళితే తన పేరున పది ఎకరాల భూమి ఉందని చెబుతున్నారు. పథకం డబ్బులు ఇవ్వకపోయినా ఫర్వాలేదు. నా పేరున ఉన్న పది ఎకరాల ఆస్తి ఎక్కడ ఉందో చూపిస్తే నేను అక్కడికి వెళ్లి వ్యవసాయం చేసుకుంటానని అడిగితే అధికారుల నుంచి సమాధానం లేదు. ఇదే విషయంపై రెవెన్యూ కార్యాలయానికి వెళ్లినా న్యాయం జరగలేదు.
సుమో అమ్మినా ఉన్నట్లుగా చూపించారు
నా పేరు నజ్మా, మదనపల్లె పట్టణం చంద్రకాలనీ. నా భర్త మస్సూర్ అలీఖాన్. డ్రైవర్గా పని చేస్తున్నాడు. మాది మధ్య తరగతి కుటుంబం. మాకు ఒక పాప, బాబు. పాప ఫర్హాజాన్. రెండో తరగతి చదువుతుంది. తల్లికి వందనం వస్తుందనే ఆశతో ప్రైవేటు స్కూలులో చేర్పించాం. తల్లికి వందనం లిస్టులో అనర్హత ఉందని వచ్చింది. మాకు రెండేళ్ల క్రితం సుమో ఉండేది. బాడుగలు సరిగా రాపోవడంతో అమ్మేశాం. ఈ విషయం తెలియజేసినా ఫోర్వీలర్ ఉందని వచ్చింది. సుమో లేదని చెప్పినా ఇలా చేశారు. ఇప్పుడు స్కూలులో ఫీజు కట్టమంటున్నారు. తల్లికి వందనం వస్తుందనుకుంటే ఇలా చేశారు.
అరకొరగా అమలు
ప్రభుత్వం తల్లికి వందనం పథకంలో భారీగా కోతలు విధించింది. అధికారులు చేసిన చిన్న తప్పులు అర్హుల పాలిట శాపంగా మారాయి. పథకం అమలులో ఎక్కడా రాజీలేదని ప్రభు త్వం చెబుతున్నా... క్షేత్ర స్థాయిలో చూస్తే పరిస్థితి భిన్నంగా కనిపిస్తోంది. అర్హత కలిగిన పేదలు, మధ్య తరగతి విద్యార్థుల తల్లిదండ్రులకు పథకం అందక దిక్కులు చూస్తున్నారు. ఒకానొక దశలో గత పాలనలో ఇచ్చిన హామీలు చేయకుండానే చేతులెత్తేసిన విధంగానే.. ఈ పాలనలో కూడా మాటలతో కాలం వెల్లదీయాలన్న ఆలోచనలకు ప్రతిపక్షం, ప్రజ లు గట్టిగా తిరగబడటంతో విధి లేని పరిస్థితులలో అరకొర పథకాలను అమలు చేసి చేతులు దులుపుకొనే ప్రయత్నానికి ఒడిగట్టిందన్న విమర్శలు ఉన్నాయి. ప్రతిపక్ష పార్టీ, ప్రజల వ్యతిరేకతను భరించలేక తల్లికి వందనం పథకాన్ని అమలు చేయడానికి సిద్ధమైంది.
అర్హులకూ అందని ద్రాక్షలా పథకం
ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణ
అధికారుల నుంచి అందని సహకారం
పైసలు ఇవ్వందే పనులు కావడం లేదంటున్న బాధితులు
కొత్త నిబంధనలు, అధికారులు చేసిన చిన్న చిన్న తప్పులు పథకాలకు ప్రజలను దూరం చేస్తోంది. ఇందులో భాగంగానే తల్లికి వందనంలో తల్లులకు తిప్పలు తప్పడం లేదు. జరిగిన తప్పులను సరిదిద్దుకోవడానికి, పెంచిన కరెంట్ బిల్లులు తగ్గించుకునేందుకు పిల్లల తల్లిదండ్రులు సచివాలయాలు, విద్యుత్, రెవెన్యూ, విద్యాశాఖ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఇదే అదునుగా భావిస్తున్న కొంత మంది అధికారులు, సిబ్బంది పైసలు ఇవ్వందే పనులు పూర్తి చేయడం లేదన్న విమర్శలు ఉన్నాయి. కూటమి ప్రభుత్వం కూడా ఇదే అదునుగా భావించి పథకాల అమలులో సంఖ్య ఎంత తగ్గితే అంత మంచిదన్న భావనలో ఉంది. తల్లికి వందనం డబ్బులు విషయంపై అడగడానికి వెళ్లిన తల్లిదండ్రుల పైన బి.కొత్తకోట మండల పరిధిలో సచివాలయ వెల్ఫేర్ అధికారి దాడి చేసిన సంఘటన కూడా జిల్లాలో సంచలనం రేపింది. ఈ దాడి వెనుక అధికార పార్టీ నాయకుల హస్తం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
● ఎందుకు రాలేదని.. అడిగితే దాడి
● ఎందుకు రాలేదని.. అడిగితే దాడి
● ఎందుకు రాలేదని.. అడిగితే దాడి
● ఎందుకు రాలేదని.. అడిగితే దాడి
● ఎందుకు రాలేదని.. అడిగితే దాడి