
25న రాజ్యాంగ హత్యా దినం
రాయచోటి: భారత ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో ఈ నెల 25న రాజ్యాంగ హత్యా దినంగా అన్నమయ్య జిల్లాలో జరుపుకొంటున్నట్లు జిల్లా కలెక్టర్ ఛామకూరి శ్రీధర్ తెలిపారు. మంగళవారం ఆయన పత్రికా ప్రకటన విడుదల చేశారు. దేశవ్యాప్తంగా 1975 జూన్ 25న ఎమ ర్జెన్సీ విధించిన నేపథ్యంలో.. భారత ప్రభుత్వం జూన్ 25న రాజ్యాంగ హత్య దినంగా ప్రకటించిందన్నారు. ఎమర్జెన్సీ విధించి 50 ఏళ్లు అయిన సందర్భంగా రాజ్యాంగం, దాని విలువలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు వివిధ కార్యక్రమాలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు.
డీఎంహెచ్ఓను
కలిసిన వైద్యాధికారులు
రాయచోటి జగదాంబసెంటర్: అన్నమయ్య జిల్లా డీఎంహెచ్ఓగా బాధ్యతలు చేపట్టిన డాక్టర్ లక్ష్మీనరసయ్యను వైద్య శాఖకు చెందిన పలువురు వైద్యాధికారులు మంగళవారం కలిశారు. ఈ సందర్భంగా రాయచోటిలోని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో జిల్లా డీపీఎంఓ రియాజ్బేగ్, జిల్లా ఏపీ ఎంసీఏ అధ్యక్షులు సాల్మోహన్, జిల్లా జనరల్ సెక్రటరీ తలారి భాస్కర్, వైస్ ప్రెసిడెంట్ భరత్, ప్రవీణ, రమ్య, ఇంద్రజ.. డీఎంహెచ్ఓకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం డీఎంహెచ్ఓ మాట్లాడుతూ మనందరం ప్రజల ఆరోగ్యం కోసం పని చేయాల్సిన బాధ్యత ఉందని వారితో అన్నారు. ప్రతి ఒక్కరూ సహకారం అందించి వైద్యశాఖలో జిల్లాకు మంచి పేరు తీసుకొద్దామని ఆయన తెలియజేశారు.
నేటి నుంచి మదనపల్లికి గుంటూరు ఎక్స్ప్రెస్
కలికిరి: తిరుపతి–గుంటూరు ఎక్స్ప్రెస్ రైలు బుధవారం నుంచి తిరుపతి నుంచి మదనపల్లి వరకు నడువనుంది. మదనపల్లి నుంచి తిరుపతి వరకు అన్ రిజర్వుడు స్పెషల్ ట్రైన్గా నడుపనున్నారు. తిరుపతి నుంచి యథావిధిగా ఎక్స్ప్రెస్గా నడువనుంది. దీంతో మదనపల్లి నుంచి తిరుపతి వరకు రైలు ప్రయాణికులకు సూపర్ ఫాస్ట్ చార్జీలు అమలులోకి రానున్నాయి. అన్ రిజర్వుడు సూపర్ ఫాస్ట్ (07261) ఉదయం 5.15 గంటలకు తిరుపతిలో బయల్దేరి పాకాలకు 5.55 గంటలకు, పీలేరు 6.25కి, కలికిరి 6.40కి, మదనపల్లికి 8.15 గంటలకు చేరుకుంటుంది. తిరిగి 07261 రైలు మదనపల్లిలో సాయంత్రం 3 గంటలకు బయల్దేరి 3.30కి కలికిరి, పీలేరు 3.45కి, పాకాల 4.50కి, తిరుపతికి సాయంత్రం 6 గంటలకు చేరుకుంటుంది. అక్కడి నుంచి యథావిధిగా గుంటూరు ఎక్స్ప్రెస్(17262)గా సాయంత్రం 7.25 గంటలకు బయల్దేరి రేణిగుంట, రైల్వేకోడూరు, రాజంపేట, నందలూరు, కడప జంక్షన్, కమలాపురం, యర్రగుంట్ల జంక్షన్, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, కోవెలకుంట్ల, బనగానపల్లి, నంద్యాల జంక్షన్, గిద్దలూరు, కంభం, మార్కాపురం రోడ్, దొనకొండ, వినుకొండ, నరసరావుపేట, మీదుగా ఉదయం 7.20 గంటలకు గుంటూరుకు చేరుకుంటుంది. ఈ రైలు సదుపాయంతో మదనపల్లి, కలికిరి, పీలేరు, పాకాల ప్రాంత వాసులకు కడప, నంద్యాల, మార్కాపురం రోడ్, నరసారావుపేట తదితర ప్రాంతాలకు రైలు ప్రయాణం అందుబాటులోకి వచ్చినట్లయింది.
‘ఉర్దూ’ నేర్చుకోవడానికి దోహదం
రాయచోటి టౌన్: ఉర్దూ భాషను సులభంగా నేర్చుకోవచ్చని జిల్లా విద్యాశాఖాధికారి సుబ్రహ్మణ్యం తెలిపారు. స్థానిక డీఈఓ కార్యాలయంలో మంగళవారం ‘ఉర్దూ భాషను సులభంగా నేర్చుకోండిలా’ అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ పుస్తకాన్ని అజీజియా ఎడ్యుకేషనల్ ట్రస్టు ఆధ్వర్యంలో రచయిత అబ్దుల్ వహీద్ విద్యార్థులకు సులభంగా అర్థమయ్యే విధంగా, త్వరగా నేర్చుకునే విధంగా రూపొందించారని పేర్కొన్నారు. ఇంగ్లిష్ మీడియం పాఠశాలలో రెండవ భాషగా ఉర్దూను ఎంచుకున్న విద్యార్థులకు ఎంతో ఉపయోగ పడుతుందని తెలిపారు. అనంతరం నోబుల్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు కొండూరు శ్రీనివాస రాజు మాట్లాడుతూ ఉర్దూ భాష నేర్చుకోవడానికి ఇలాంటి పుస్తకాలు ఎంతో అవసరం ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో రాయచోటి ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు చంద్రశేఖర్, రాష్ట్ర ఉర్దూ టీచర్స్ అసోసియేషన్ స్టేట్ కన్వీనర్ షేక్ మహమ్మద్ హషీం, పాలం రాజ, గోపాల్, బాబా ఫకృద్దీన్, సురేష్ బాబు తదితరులు పాల్గొన్నారు.

25న రాజ్యాంగ హత్యా దినం