
మహిళకు తీవ్రగాయాలు
మదనపల్లె రూరల్ : గుర్తుతెలియని వాహనం ఢీకొని మహిళ గాయపడిన సంఘటన శుక్రవారం మండలంలో జరిగింది. గుర్తుతెలియని మహిళ(60) బసినికొండ, కొండామర్రిపల్లెలో భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తోంది. ఎప్పటిలాగే భిక్షాటనకు వెళుతుండగా.. కొండామర్రిపల్లె రోడ్డు సమీపంలో గుర్తుతెలియని వాహనం ఢీకొంది. ప్రమాదంలో ఆమె తీవ్రంగా గాయపడగా, స్థానికులు బసినికొండ మహిళా పోలీస్కు సమాచారం అందించారు. స్థానికుల సహాయంతో మహిళా పోలీస్ బాధితురాలిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తాలూకా పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు.
గుండంలో పడి అఘోరి మృతి
చిట్వేలి : నగిరిపాడు పంచాయతీ పెద్దూరు అటవీ ప్రాంతంలోని గుండాలకోన గుండంలో పడి అఘోరి మృతిచెందింది. శివరాత్రి సందర్భంగా ఆమె గుండాల కోనను సందర్శించి..ఐదురోజుల తర్వాత తిరిగి వెళ్లినట్లు సమాచారం. మళ్లీ గురువారం గుండాలకోనకు వచ్చి నిర్మానుష్యమైన ప్రాంతానికి వెళ్లినట్లు భక్తులు తెలిపారు. అనంతరం శుక్రవారం గుండంలో శవమై తేలింది. అటవీ సమీప గ్రామాల ప్రజలు ఈ విషయం స్థానిక పోలీసులకు తెలియజేశారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృత దేహాన్ని వెలికితీయించారు. అఘోరికి సంబంధించి ఎలాంటి సమాచారం లేకపోవడంతో మృతదేహాన్ని కోడూరు మార్చురీలో ఉంచినట్లు తెలిపారు. అఘోరికి సంబంధించిన వారు ఎవరైనా ఉంటే చిట్వేలి స్టేషన్కు సమాచారం అందించాలని కోరుతున్నారు. పూర్తి వివరాలకు ఎస్ఐ 9121100579, సిఐ 9121100576 నంబర్లలో సంప్రదించాలని కోరారు.
ఓపెన్ పరీక్షలో మాస్ కాపీయింగ్
– కుప్పలు తెప్పలుగా చిట్టీలు
మదనపల్లె రూరల్ : ఓపెన్ టెన్త్ పరీక్షల్లో యథేచ్చగా మాస్ కాపీయింగ్ జరిగింది. పట్టణం లోని జెడ్పీ హైస్కూల్లో జరిగిన పదో తరగతి ఓపెన్ సప్లిమెంటరీ గణితం పరీక్షలో మాస్ కాపీయింగ్ చేయించినట్లు తెలిసింది. విద్యార్థులు చిట్టీలు తీసుకుని వెళ్లి పరీక్ష రాసి, వాటిని పాఠశాల ప్రాంగణంలోనే పడేసి వెళుతున్నారు. ఎక్కడ చూసినా కుప్పలు తెప్పలుగా చిట్టీలు దర్శనమిస్తున్నాయి. డీవైఈఓ లోకేశ్వరరెడ్డి వివరణ కోరగా...తాను పీలేరులో ఉన్నానని, రేపు సెంటర్ను తనిఖీ చేసి చర్యలు తీసుకుంటామన్నారు.
తీగలు తగిలి గేదె మృతి
సింహాద్రిపురం : మండలంలోని అహోబిలం గ్రామానికి చెందిన గంగిరెడ్డికి చెందిన గేదె విద్యుత్తు షాక్కు గురై మృతిచెందింది. గ్రామానికి చెందిన గంగిరెడ్డి, నాగేశ్వరరెడ్డి, రాజారెడ్డి, రవీంద్రనాథరెడ్డి తమ గేదెలను సమీపాన ఉన్న చెరువు గట్టున మేపుకొనేందుకు తీసుకెళ్లారు. గంగిరెడ్డికి చెందిన గేదె అక్కడే ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ తీగలకు తగలడంతో షాక్కు గురై మృతి చెందింది. రూ.92వేలు నష్టపోయానని బాధిత రైతు గంగిరెడ్డి తెలిపారు.
పోలీస్ బైక్ దొరికింది
ప్రొద్దుటూరు క్రైం : కర్నాటక వాసి ఎత్తుకెళ్లిన బ్లూకోల్ట్స్ బైక్ దొరకడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. పట్టణంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న కర్నాటక రాష్ట్రానికి చెందిన వ్యక్తిని బుధవారం రాత్రి రూరల్ పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. అతడిని విచారించగా మతిస్థిమితం లేని వ్యక్తిగా నిర్ధారణ అయింది. ఉదయం ఇంటికి పంపాలని పోలీసులు అతన్ని స్టేషన్లోనే పెట్టుకున్నారు. ఈ క్రమంలో గురువారం వేకువ జామున స్టేషన్లో నుంచి బ్లూకోల్ట్స్ బైక్తో పరారైన విషయం పాఠకులకు విదితమే. అయితే పట్టణ శివారు ప్రాంతంలో పడేసి వెళ్లిన బ్లూకోల్ట్స్ బైక్ను గురువారం ఉదయం రూరల్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కర్నాటకు వాసిని కూడా అదుపులోకి తీసుకొని కుటుంబ సభ్యులకు అప్పగించారు.

మహిళకు తీవ్రగాయాలు

మహిళకు తీవ్రగాయాలు

మహిళకు తీవ్రగాయాలు