
పరిహారం.. పరిహాసం!
మదనపల్లె: జిల్లా కరువు రైతులకు అందించాల్సిన పరిహారంపై కూటమి ప్రభుత్వం పరిహసిస్తోంది. మట్టిని నమ్ముకుని సేద్యం చేసే రైతన్న కష్టాలపై కనికరించి కన్నీళ్లు తుడవాల్సిన ప్రభుత్వం తనకేమీ పట్టనట్టు వ్యవహరిస్తోంది. గత ఏడాది జరిగిన పంట నష్టాలకు పరిహారం చెల్లించాల్సిన ప్రభుత్వం కడపలో మహానాడు నిర్వహణలో బీజీగా ఉంటే..కర్షకులు కష్టాలతో ఖరీఫ్ సేద్యానికి సిద్ధమయ్యారు. వర్షాలను నమ్ముకుని విత్తనం విత్తి ఆకాశం వైపు చూస్తూ పంటలను సాగు చేసే రైతులు ఈ ఖరీఫ్లోనైనా పంటలు పండకపోతాయా అని ఆశగా ఎదురు చూస్తున్నారు. ప్రకృతి కనికరిస్తుందో లేదోకాని..కర్షకులకు అండగా నిలవాల్సిన ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఖరీఫ్ పంట నష్ట పరిహారం, ఫెంగల్ తుపాను పరిహారం ఇంతవరకు చెల్లించలేదు. అన్నదాత సుఖీభవ పేరుతో ఇస్తామన్న పెట్టుబడి సాయం కూడా ఇవ్వలేదు. దీంతో రైతులు అన్నివైపుల నుంచి సహకారం లేక చతికిలపడ్డారు.
విత్తనం లేదు..ధర చెప్పరు
ఖరీఫ్ సాగుకు రైతులు సిద్ధమయ్యారు. పొలాల్లో దుక్కులు చేస్తున్నారు. ఇకపై కురిసే వర్షాలకు పంటలను విత్తడం మొదలవుతుంది. రైతులకు ఏటా పంపిణీ చేసే వేరుశనగ విత్తన కాయల కేటాయింపు చేసిన ప్రభుత్వం వాటిని ఇంతవరకు సరఫరా చేయలేదు. దీంతో రైతులు బహిరంగ మార్కెట్లో కొనుగోలు చేయాలా లేక ప్రభుత్వం ఎప్పటి నుంచి పంపిణీ చేస్తుంది అన్నది ఇప్పటి వరకు ప్రకటించలేదు. రైతులకు 45వేల క్వింటాళ్ల విత్తన కాయలను కేటాయించారు. ఈ విత్తన ధర ఎంత, రాయితీ ఎంత ఇస్తారు, రైతు కిలోకి ఎంత ధర చెల్లించాలి అన్న సమాచారం కూడా ఇప్పటికి ఇవ్వలేదు. జిల్లా వ్యాప్తంగా ఈ ఖరీఫ్లో 62,890 హెక్టార్లలో అన్ని పంటలు సాగవుతాయని వ్యవసాయశాఖ ప్రణాళిక సిద్ధం చేసింది.
కేంద్రం రిక్త హస్తం..
గత ఖరీఫ్లో నెలకొన్న కరువుపై ఈ ఏడాది జనవరి 8న కేంద్ర కరువు బృందం తంబళ్లపల్లె, మదనపల్లె నియోజకవర్గాల్లో పర్యటించి వెళ్లింది. అయితే కేంద్రం కూడా రైతాంగాన్ని ఆదుకోవడం కోసం ముందుకు రాలేదు. వేరుశనగ విత్తనం కొంతమేరకు ఉచితంగా పంపిణీ చేయాలని నిర్ణయించడం మినహా ఆర్థిక ప్రయోజనం కలిగించే విధంగా నిర్ణయం తీసుకోలేదు. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరువు జిల్లాకు మొండిచెయ్యి చూపించాయని రైతులు మథన పడుతున్నారు.
కష్టాలతో ఖరీఫ్ సాగు..
జిల్లాలో ఖరీఫ్ సాగు కష్టాలతో మొదలైంది. వేరుశనగ ఎకరా సాగు చేయాలంటే రూ.15 నుంచి రూ.20 వేల దాకా ఖర్చవుతుంది. పొలం దుక్కులు మొదలు, పంట ఒబ్బడి చేసే వరకు ఈ ఖర్చు చేయాలి. ఈ పెట్టుబడి ప్రస్తుతం రైతులకు భారంగా మారింది, గత ఖరీఫ్లో పంటలు నష్టపోవడం, పరిహారం అందకపోగా ప్రభుత్వం రైతు భరోసా పథకాన్ని అమలు చేయకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం నుంచి ఏడాదిగా రైతాంగానికి పైసా సాయం అందలేదు. దీంతో ఇప్పుడు పెట్టుబడి భారంగా మారింది. ఇంట్లోని బంగారం తాకట్టులో పెట్టగా బ్యాంకుల్లో ఇప్పటికే తీసుకున్న రుణాలు చెల్లించలేక రెన్యూవల్ చేశారు. దీంతో ప్రస్తుతం ప్రభుత్వం సాయం చేయాల్సిన పరిస్థితి ఉన్నప్పటికి పట్టించుకోవడం లేదు.
ఖరీఫ్ పరిహారానికి దిక్కులేదు
2024 ఖరీఫ్ సేద్యం రైతాంగాన్ని కుదేలు చేసింది. పెట్టిన పెట్టుబడిలో పైసా వెనక్కి రాలేదు. అన్ని పంటలు కలుపుకుని 65,386 హెక్టార్లలో పంటలు సాగు కావాల్సి ఉండగా వర్షాభావ పరిస్థితులతో 24,396 హెక్టార్లలోనే పంటలు సాగు చేశారు. దీంతో ప్రభుత్వం 19 మండలాల్లో కరువు ఉన్నట్టు ప్రకటించింది. మొత్తం సాగు విస్తీర్ణంలో 37.31 శాతం విస్తీర్ణమే సాగైనట్టు లెక్కలు తేల్చారు. ఈ సాగైన పంటల్లో 12,723 హెక్టార్లలో పంటలు పూర్తి నష్టపోయినట్లు వ్యవసాయశాఖ నిర్ధారించింది. ఇందులో వేరుశనగ సాగు చేసిన 23,987 మంది రైతులు పంట పెట్టుబడులు కోల్పోయారని నిర్ధారించి వీరికి రూ.21.50 కోట్ల పంట పెట్టుబడి పరిహారం చెల్లించాలని వ్యవసాయశాఖ ప్రభుత్వానికి అదే ఏడాది నివేదికలను పంపింది. అయితే ఇప్పటి వరకు ఈ పరిహారం ఊసేలేదు. మళ్లీ ఖరీఫ్ వచ్చేసినా ప్రభుత్వం మాత్రం కనికరించడం లేదు. పంటల సాగుకు అవసరమైన పెట్టుబడి కోసం రైతులు అవస్థలు పడుతున్నారు.
ఫెంగల్ పరిహారం అంతే..
గత ఏడాది నవంబర్లో వచ్చిన ఫెంగల్ తుపాను ప్రభావంతో జిల్లాలోని గుర్రంకొండ, మదనపల్లె, నిమ్మనపల్లె, రామసముద్రం, కురబలకోట, బి.కొత్తకోట, తంబళ్లపల్లె, రామాపురం, పీలేరు, కేవీపల్లి, చిన్నమండెం, సంబేపల్లె, రాయచోటి, వాల్మీకిపురం మండలాల్లో తుపాను తీవ్ర ప్రభావం చూపింది, ఈ మండలాల్లోని 100 గ్రామాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. 1,098 హెక్టార్లలో 2,560 మంది రైతులకు చెందిన పంటలు నష్టపోయారు. ఈ నష్టాన్ని అంచనా వేసిన వ్యవసాయశాఖ రైతులకు రూ.1.80 కోట్ల పరిహారం చెల్లించాలని అదే నెలలో ప్రభుత్వానికి నివేదికలు పంపినా ఇప్పటివరకు చలనం లేదు.
ఫెంగల్ పరిహారం రూ.1.80 కోట్ల మాటే లేదు
2024 ఖరీఫ్ నష్ట పరిహారం రూ.21.5 కోట్ల ఊసే లేదు
పెట్టుబడి కోసం ఖరీఫ్ రైతాంగం అవస్థలు
సాగు పనులు మొదలైనా ఇంకా నిర్ణయించని రాయితీ ధర
కష్టాలతోనే కాడి కట్టిన రైతన్న
కరువు రైతాంగంపై కనికరించని ప్రభుత్వం

పరిహారం.. పరిహాసం!