
కరడు గట్టిన దొంగలు అరెస్టు
ప్రొద్దుటూరు క్రైం : వారు కరడు గట్టిన దొంగలు.. అడ్డు వస్తే చంపడానికి కూడా వెనుకాడరు. 16 ఏళ్ల వయసు నుంచే చోరీలు చేస్తూ అంతర్ రాష్ట్ర దొంగలుగా రాటుదేలారు. ప్రొద్దుటూరు పట్టణం బొల్లవరంలోని నరాల బాలిరెడ్డి కాలనీలో గత నెల 17న ఏక కాలంలో నాలుగు ఇళ్లలో చోరీకి ప్రయత్నించి, ఒకే ఇంట్లో పెద్ద ఎత్తున బంగారు ఎత్తుకెళ్లిన విషయం విదితమే. ఈ కేసులో కర్ణాటక రాష్ట్రంలోని బెల్గాం ప్రాంతానికి చెందిన నలుగురు అంతర్ రాష్ట్ర దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టు వివరాలను ప్రొద్దుటూరు డీఎస్పీ భావన సోమవారం సాయంత్రం మీడియా సమావేశంలో వెల్లడించారు.
కర్ణాటక రాష్ట్రం, బెల్గాం పట్టణంలోని వైభవ్నగర్కు చెందిన ఖాజా రఫిక్, సయ్యద్ అక్బర్లు చిన్ననాటి స్నేహితులు. వీరు 15 ఏళ్ల వయసు నుంచే చోరీలు చేసేవారు. కర్ణాటకతో పాటు తెలంగాణ రాష్ట్రంలో అనేక నేరాలు చేశారు. రాత్రి పూట ఇళ్లకు కన్నాలు వేసేవారు. కర్ణాటక రాష్ట్రానికి చెందిన మరో వ్యక్తితో కలసి తమ ప్రాంతంలోనే నివాసం ఉంటున్న అర్మాన్ ఇర్ఫాన్, మహబూబ్ ఇబ్రహీం అనే ఇరువురిని పరిచయం చేసుకున్నారు. వారి ద్వారా అనేక చోరీలకు పాల్పడ్డారు. ఖాజా రఫిక్, సయ్యద్ అక్బర్లపై హత్యాయత్నం, హత్య కేసులతో సహా సుమారు 13 కేసులు ఉన్నాయి. మిగిలిన ముగ్గురిపై 5 చోరీ కేసులున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. సయ్యద్ అక్బర్ కొన్నేళ్ల క్రితం అనంతపురం జిల్లాలోని గుంతకల్లో నివాసం ఉంటున్నాడు. కాగా చోరీ ఘటన జరిగిన రెండు రోజుల ముందు నుంచే ఐదుగురు నిందితులు బొల్లవరంలోని నరాల బాలిరెడ్డి కాలనీలో రెక్కీ నిర్వహించారు. 16న రాత్రి 9 గంటలకు అందరూ కలసి మైదుకూరు రోడ్డులోని చాంద్ థియేటర్కు సెకండ్ షో సినిమాకు వెళ్లారు. సినిమా వదలగానే అర్థరాత్రి దాటిన తర్వాత సుమారు 1.15 గంటల సమయంలో బాలిరెడ్డి కాలనీకి వెళ్లి చోరీ చేశారు. కేసులోని కీలక నిందితుడి కోసం పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు. ఈ కేసులో ప్రతిభ కనబరచిన త్రీ టౌన్ సీఐ గోవిందరెడ్డి, ఎస్ఐలు ధనుంజయుడు, అరుణ్రెడ్డి, ఏఎస్ఐ సుబ్బన్న, హెడ్కానిస్టేబుల్ భద్రారెడ్డి, కానిస్టేబుళ్లు దస్తగిరి, సుబ్రహ్మణ్యం, రమణారెడ్డి, చాంద్బాషా, ధనాంజినేయ, దినకర్, హోమ్గార్డు జనార్దన్రెడ్డిలను డీఎస్పీ భావన అభినందించారు. రివార్డు కోసం ఉన్నతాధికారులకు సిఫార్సు చేయనున్నట్లు తెలిపారు.
సీసీ కెమెరాల ఆధారంగా..
చోరీ జరిగిన వెంటనే డీఎస్పీ భావన పర్యవేక్షణలో త్రీ టౌన్ సీఐ గోవిందరెడ్డి, టూ టౌన్, రూరల్ ఎస్ఐలు ధనుంజయుడు, అరుణ్రెడ్డిలతో కూడిన మూడు టీంలను ఏర్పాటు చేశారు. చోరీ సమయంలో సీసీ కెమెరాల్లో రికార్డు అయిన నిందితుల ఫొటోల ఆధారంగా పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ క్రమంలోనే సాంకేతిక పరిజ్ఞానంతో కారుతో పాటు చోరీ చేసిన దొంగలు ఎవరన్నది గుర్తించారు. నిందితులు ప్రొద్దుటూరు శివారు ప్రాంతంలో తిరుగుతున్నారని సమాచారం రావడంతో అరెస్ట్ చేశారు. కర్ణాటక రాష్ట్రంలోని బెల్గాం పట్టణానికి చెందిన ఖాజా రఫిక్, సయ్యద్ అక్బర్, షేక్ అర్మాన్ ఇర్ఫాన్. ముల్లా మహబూబ్ ఇబ్రహీంలు అరెస్ట్ అయిన వారిలో ఉన్నారు. వారి వద్ద నుంచి 23.4 తులాల బంగారు నగలను స్వాధీనం చేసుకున్నారు. నలుగురిపై కేసు నమోదు చేసి రిమాండుకు తరలించనున్నట్లు డీఎస్పీ భావన తెలిపారు. మరో నిందితుడితో పాటు మిగతా బంగారాన్ని కూడా రికవరీ చేస్తామని ఆమె వివరించారు.
భయపడొద్దు.. మేమున్నాం..
చోరీల పట్ల ప్రొద్దుటూరు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డీఎస్పీ ఈ సందర్భంగా తెలిపారు. నిరంతరం పోలీసులు రాత్రి గస్తీని పటిష్టపరిచామని ప్రజలు భయపడొద్దన్నారు. ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే పోలీసులకు సమాచారం అందించాలన్నారు. చోరీలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. దొంగతనాల నివారణకు ఎల్హెచ్ఎంఎస్తో పని చేసే నిఘా కెమెరాలను ఇంట్లో అమర్చుకోవాలని సూచించారు. ఇటీవల ప్రొద్దుటూరు టూ టౌన్ పరిధిలోని హౌసింగ్బోర్డులో జరిగిన చోరీ కేసులో కూడా పురోగతి సాధించినట్లు డీఎస్పీ తెలిపారు. చోరీ అయిన సొత్తుతో పాటు నిందితుడిని అదుపులోకి తీసుకున్నామన్నారు. రూరల్ పరిధిలోని లక్ష్మీనగర్లో జరిగిన దొంగతనం ఘటనలో అంతర్ రాష్ట్ర దొంగల ప్రమేయం ఉన్నట్లు తెలుస్తోందని, వారి కోసం ప్రత్యేక టీంలను ఏర్పాటు చేశామన్నారు. సాధ్యమైనంత తొందరలోనే దొంగలను పట్టుకుంటామని డీఎస్పీ ఆశాభావం వ్యక్తం చేశారు.
ప్రొద్దుటూరులోని బొల్లవరం
చోరీ కేసులో పురోగతి
పట్టుబడిన దొంగలు కర్ణాటక రాష్ట్రంలోని బెల్గాంకు చెందిన వారు
23.4 తులాల బంగారు నగలు స్వాధీనం
అరెస్టు వివరాలను వెల్లడించిన
ప్రొద్దుటూరు డీఎస్పీ భావన