కొత్త ప్రపంచం.. బంగారు భవిష్యత్తుకు బీజం | - | Sakshi
Sakshi News home page

కొత్త ప్రపంచం.. బంగారు భవిష్యత్తుకు బీజం

Jun 2 2025 1:07 AM | Updated on Jun 2 2025 1:07 AM

కొత్త ప్రపంచం.. బంగారు భవిష్యత్తుకు బీజం

కొత్త ప్రపంచం.. బంగారు భవిష్యత్తుకు బీజం

రాజంపేట టౌన్‌ : ఇంటర్మీడియట్‌ చదివే విద్యార్థులది కౌమార దశ. ఆ దశలో ఆలోచనలు, ఉత్సాహం ఇలా అన్నీ కూడా రాకెట్‌ కంటే వేగంగానే ఉంటాయి. అలాగే ఎన్నో కలలు, ఆశలు, ఆనందాలు, హర్ట్‌ అయ్యే సందర్భాలు, పాఠాలు, కాలేజికి డుమ్మా కొట్టడాలు ఇలా అన్నీ కొత్తగా అనిపించేవే. ఒక్కమాటలో చెప్పాలంటే టెన్త్‌ వరకు తల్లిదండ్రుల చాటున పెరిగిన పిల్లలకు ఇంటర్‌లోకి ప్రవేశించగానే స్వేచ్ఛ రెక్కలు తొడుగుతుంది. అందువల్ల ఇంటర్మీడియట్‌లో చేరిన ప్రతి విద్యార్థికి అదో తెలియని అనుభూతిలా వుంటుంది. అదే సమయంలో కొత్త పరిసరాలు, కొత్త పరిచయాలు, సరికొత్త ఆలోచనలు ఇలా అన్ని కూడా విద్యార్థులకు కొత్తగా, వింతగా అనిపిస్తాయి. ఇంటర్మీడియట్‌ విద్యార్థులు కౌమారదశలో ఉంటారు. కనుక ఈ దశలో వేసే అడుగులే భవిష్యత్తును నిర్దేశిస్తాయి. టీనేజీలో ఉన్న వారందరికి అన్నీ తెలిసినట్లే ఉంటాయి. కాని ఏమీ తెలియని తనం ఆవహిస్తుంది. ఈ రెండింటి మధ్య తేడాను తెలుసుకుంటే జీవితం విజయం వైపు పయనిస్తుంది.. కొత్త బంగారులోకం అవుతుంది. ఏమాత్రం తొందరపాటు నిర్ణయం తీసుకున్నా జీవితం సరిదిద్దుకోలేనంతగా వెనక్కి వెళుతుంది... పరాజయం బాటలో నడుస్తుంది.

తొలిసారి పబ్లిక్‌ పరీక్షల్లో విజయం సాఽధించామన్న ఆత్మవిశ్వాసం, పాఠశాలను దాటి కళాశాలలో చేరామన్న ఉత్సాహం, కొత్త పరిచయాలు, కళాశాల వాతావరణం కలిగించే ఆనందం వెరసి విద్యార్థులకు కళాశాల దశ కొత్త అనుభూతిని ఇస్తుందనే చెప్పాలి. అనువైన గ్రూపు, ఇష్టమైన పాఠ్యాంశాలు చదివే తొలి స్వేచ్ఛా దశ ఇంటర్మీడియట్‌ విద్య. జీవితంలో కీలక అడుగులన్నీ ఇంటర్మీడియట్‌లోనే పడతాయనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఉన్నత ప్రమాణాలతో ఉత్తమ ఫలితాలు సాధించి ఉజ్వల భవిష్యత్తుకు బాటలు పడినా, గాడితప్పి అంధఃపాతాళానికి పడిపోయినా ఇంటర్మీడియట్‌లోనే బీజాలు పడతాయి. హైస్కూల్‌ విద్యతో ప్రారంభమయ్యే కౌమార ప్రాయం ఇంటర్‌లో మరింత పురి విప్పుతుంది. అందుకే ప్రతి విద్యార్థికి ఇంటర్మీడియట్‌ దశ ఎంతో ప్రధానమైనది.

చదువుపైనే దృష్టి సారించాలి..

ఇంటర్మీడియట్‌ విద్యార్థులు టీనేజీలో ఉంటారు. కనుక వారి ఆలోచనలు చాలా భిన్నంగా ఉంటాయి. కొన్నింటి పట్ల వెంటనే ఆకర్షితులవుతారు.

అయితే మనసును అదుపులో వుంచుకొని తొలి ప్రాధాన్యత చదువుకే ఇవ్వాలి. మనసును అదుపులో ఉంచుకోకుంటే జీవితం అల్లరి పాలయ్యే ప్రమాదం కూడా లేకపోలేదు. సినిమాల్లో చూపించేలా కాలేజీకి డుమ్మా కొట్టడం హీరోయిజం కాదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. విధిగా తరగతులకు హాజరు కావడం, పాఠ్యాంశాలపై దృష్టి పెట్టడం, అధ్యాపకులు ఇచ్చే నోట్స్‌ను ఎప్పటికప్పుడు పూర్తి చేసుకోవడం, పోటీ పరీక్షలకు అనువుగా ప్రణాళికలను రూపొందించుకోవడం, స్నేహితులతో కలిసి చదువుకోవడం వంటివి ఉజ్వల భవిష్యత్తుకు దోహదపడతాయి.

స్నేహితుల ఎంపిక చాలా ముఖ్యం..

ప్రధానంగా ఇంటర్మీడియట్‌లో స్నేహితుల ఎంపిక చాలా ముఖ్యమైనది.

ఇంటర్‌లో ఏర్పడే స్నేహాలు విద్యార్థుల భవిష్యత్తుకు దిశా నిర్దేశం చేస్తాయి. టెన్త్‌ వరకు తల్లిదండ్రుల పెంపకం వల్ల చాలా మంది విద్యార్థులు సన్మార్గంలో పయనిస్తారు. ఇంటర్‌ దశలో స్నేహాల పట్ల చాలా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా వుంది. తల్లిదండ్రులు సైతం తమ పిల్లల స్నేహాల గురించి తెలుసుకోవాలి. తమ పిల్లలు సరైన వారితో స్నేహం చేయకుంటే ఆ విషయాన్ని పిల్లలకు సున్నితంగా చెప్పి పిల్లలను తమ దారిలోకి తెచ్చుకోవాలి. తల్లిదండ్రులు ఎవరితో అయినా స్నేహం చేయవద్దు అంటే పిల్లలు కూడా తల్లిదండ్రుల మాటను పెడచెవిన పెట్టకుండా చెడ్డవారి స్నేహానికి దూరంగా ఉండాలి. మంచివారితో స్నేహం మంచి భవిష్యత్తుకు బాటలు వేస్తుంది, చెడ్డవారితో స్నేహం ఉజ్వలంగా ఉండాల్సిన భవిష్యత్తును దెబ్బతీస్తుంది.

నేటి నుంచి ప్రారంభం కానున్న

ఇంటర్‌ ప్రథమ సంవత్సరం తరగతులు

గాడితప్పితే జీవితమే గందరగోళం

క్రమశిక్షణను అలవరుచుకుంటే

ఉజ్వల భవిష్యత్తు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement