
హామీలు అమలు చేయలేని చంద్రబాబు
మదనపల్లె రూరల్ : నాలుగుసార్లు ముఖ్యమంత్రి అయ్యానని గొప్పలు చెప్పుకునే చంద్రబాబు ఒక్కసారైనా వెన్నుపోటు పొడవకుండా పరిపాలన చేశారా అని వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్యామల ప్రశ్నించారు. సూపర్ సిక్స్ అంటూ ప్రజలకు హామీ ఇచ్చి వాటిని అమలు చేయడంలో చంద్రబాబు విఫలమయ్యారని విమర్శించారు. వైఎస్సార్ సీపీ అధ్యక్షులు వైఎస్.జగన్మోహన్రెడ్డి పిలుపుమేరకు అన్నమయ్య జిల్లా మదనపల్లె నియోజకవర్గ సమన్వయకర్త నిసార్అహ్మద్ ఆధ్వర్యంలో నిర్వహించిన వెన్నుపోటు దినం నిరసన కార్యక్రమానికి శ్యామల ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ప్రదర్శనగా వెళ్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో డీఏఓ రాఘవేంద్రకు, కూటమిపాలనలో ప్రజలు మోసపోయిన వైనంపై వినతిపత్రం సమర్పించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ...1994 ఎన్నికల తర్వాత చంద్రబాబునాయుడు సొంతమామ నందమూరి తారకరామారావుకు వెన్నుపోటు పొడిచారంట అని తన చిన్నవయస్సులో విన్నానని, 2024 ఎన్నికల తర్వాత ప్రజలకు ఆయన పొడిచిన వెన్నుపోటును ప్రత్యక్షంగా చూస్తున్నానన్నారు. చంద్రబాబు అంటే వెన్నుపోటు, వెన్నుపోటు అంటే చంద్రబాబు అని, ఒక్కసారైనా ప్రజలకు వెన్నుపోటు లేకుండా పరిపాలన చేశారా అని ప్రశ్నిస్తున్నానన్నారు. రాష్ట్ర ప్రజలకు ఆయన పొడిచిన వెన్నుపోటు గురించి చెప్పాలంటే ఎక్కడ నుంచి ఆరంభించాలో అర్థం కావడం లేదన్నారు. పసికందుల నుంచి రక్షణ కల్పించలేని కూటమిప్రభుత్వం, ఆడపిల్లలకు పొడిచిన వెన్నుపోటు నుంచి మొదలుపెట్టాలా..? అబద్ధపు హామీలతో గద్దెనెక్కినటువంటి కూటమి నాయకుల నుంచి మొదలుపెట్టాలా..? రైతుల కన్నీటితడి నుంచి ప్రారంభించాలా..? ఎండీయూ వాహనాలు రద్దుచేసి కొన్ని లక్షల కుటుంబాలను రోడ్డుమీదకు లాగేసిన దగ్గర నుంచి మొదలుపెట్టాలా.? డీఎస్సీ అభ్యర్థులను అతి దారుణంగా వెన్నుపోటు పొడిచారని...ఇలా చెప్పుకుంటూ పోతే ఎక్కడ నుంచి మొదలుపెట్టాలో తెలియని పరిస్థితి ఉందన్నారు. కూటమిప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు మరచిపోతే వాటిని గుర్తుచేసేందుకు వైఎస్సార్ సీపీ కార్యకర్తలు క్షేత్రస్థాయి నుంచి సిద్ధంగా ఉంటారన్నారు. వైఎస్సార్ సీపీ కార్యకర్తకు ఎదురునిలబడి మాట్లాడలేని పరిస్థితిలో కూటమిప్రభుత్వం ఉందన్నారు. చివరకు బడి కెళ్లే పిల్లలు...పదో తరగతి పిల్లలను సైతం కూటమిప్రభుత్వం దారుణంగా వెన్నుపోటు పొడిచిందన్నారు. అదేదో సామెత చెప్పినట్లు...పనిగల పనిమంతుడు పందిరి వేస్తే...తాటాకు తగిలి ఊడిపోయిందంట.. అన్నట్లు కూటమి ప్రభుత్వం పరిస్థితి తయారైందన్నారు. నాలుగుసార్లు ముఖ్యమంత్రిగా చేశానని చెప్పుకునే చంద్రబాబు, ఒకసారి సీఎంగా పనిచేసిన జగన్మోహన్రెడ్డి ఐదేళ్ల పాలనలో చేసిన అప్పుల్లో, 40శాతం అప్పులు మొదటిఏడాదిలోనే చంద్రబాబు చేసేశారన్నారు. మళ్లీ అధికారంలోకి వైఎస్.జగన్ వస్తారని, ఆయనను ముఖ్యమంత్రిగా చేసుకుంటామని, అప్పటివరకు కూటమిప్రభుత్వ వైఫల్యాలపై ప్రశ్నిస్తూనే ఉంటామన్నారు. మున్సిపల్ చైర్పర్సన్ మనూజారెడ్డి, నాయకులు ఎన్ఆర్ఐ దండుశేఖర్రెడ్డి, జెడ్పీటీసీ సీహెచ్.రామచంద్రారెడ్డి, శ్రీనివాసులురెడ్డి, కేశవరెడ్డి, కృష్ణారెడ్డి, ఎంపీటీసీ మేరీ, రోలింగ్ మల్లిక తదితరులు పాల్గొన్నారు.
ప్రజల పక్షాన నిలబడి
ప్రశ్నించేది వైఎస్సార్ సీపీ
వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్యామల