
మోడీ సర్కారు బాటలో రాష్ట్ర ప్రభుత్వం
మదనపల్లె రూరల్ : కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా జూలై 9న దేశవ్యాప్తంగా కార్మికవర్గం సమ్మెకు సన్నద్ధమవుతున్న దశలో రాష్ట్రంలో పని గంటలు పెంచుతూ రాష్ట్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని సీపీఎం జిల్లా కమిటీ తీవ్రంగా ఖండిస్తున్నట్లు జిల్లా కార్యదర్శి పి.శ్రీనివాసులు తెలిపారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కార్మిక హక్కులపై దాడి చేస్తున్న కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు బాటలో రాష్ట్ర ప్రభుత్వం కార్మికలోకంపై పెనుదాడి చేసిందన్నారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పేరుతో, కార్పొరేట్లకు రెడ్ కార్పెట్ పరుస్తూ కార్మికులు ఏళ్ల తరబడి పోరాడి సాధించుకున్న హక్కులను ఒక్కసారిగా దిగమింగిందన్నారు. ఎనిమిది గంటల పనిదినం ఆచరణలో ఎప్పుడో తొమ్మిది గంటలకు చేరుకోగా, తాజా మంత్రివర్గ సమావేశంలో దానిని పది గంటలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారన్నారు. మహిళా సాధికారత పేరుతో మహిళలకు కూడా నైట్షిఫ్ట్ల భారాన్ని తప్పనిసరి చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. శాస్త్ర సాంకేతిక అభివృద్ధి జరుగుతున్న కాలంలో ఏఐ విస్తరించి, మానవ శ్రమను తగ్గిస్తున్న ఆధునిక యుగంలో పనిగంటలు తగ్గించాల్సింది పోయి పెంచడం దారుణమన్నారు. కార్మిక సంక్షేమం దృష్ట్యా రాష్ట్రంలో లేబర్ కోడ్స్ అమలును నిలిపి వేయాలని డిమాండ్ చేశారు.