మదనపల్లె రూరల్ : గ్యాస్ సిలిండర్ పైప్ లీకేజీతో ముగ్గురు తీవ్రంగా గాయపడిన సంఘటన గురువారం మదనపల్లెలో జరిగింది. పట్టణంలోని నీరుగట్టువారిపల్లెలో రూ. 99 బాక్స్ బిర్యానీ సెంటర్ హోటల్ నడుపుతున్నారు. గురువారం మధ్యాహ్నం హోటల్ బాగా రద్దీగా ఉన్న సమయంలో, సిలిండర్ నుంచి స్టౌ కు వెళ్లే గ్యాస్ పైప్ లీకేజీతో ఒక్కసారిగా మంటలు చెలరేగి ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో అదే సమయానికి బిరియాని పార్సిల్ తీసుకువెళ్లేందుకు అక్కడికి వచ్చిన, నీరు గట్టు వారి పల్లెకు చెందిన రామ్మోహన్ (38), నక్కలదిన్నెకు చెందిన మునెమ్మ (40), పట్టణానికి చెందిన సురేంద్ర (36), మంటలు అంటుకుని తీవ్రంగా గాయపడ్డారు. గమనించిన స్థానికులు అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం అందించి బాధితులను ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలను ఆర్పి వేశారు. ప్రమాదం జరిగిన సమయంలో హోటల్లో దాదాపు 60 మందికి పైగా ఉన్నారు. హోటల్ నిర్వాహకులు వంట వండే ప్రదేశానికి సమీపంలోనే పార్సిల్స్ కట్టిస్తుండటంతో ప్రమాదం జరిగిన సమయంలో వినియోగదారులు గాయపడ్డారు.