
జేఎన్టీయూ ఒప్పంద అధ్యాపకుల నిరసన
కలికిరి : సర్వీసు పునరుద్ధరణ విషయంలో యాజమాన్యం తీరుకు నిరసనగా జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాల ఒప్పంద అసిస్టెంట్ ప్రొఫెసర్లు బుధవారం ప్రిన్సిపాల్ చాంబర్ వద్ద నిరసనకు దిగారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ పదమూడేళ్లుగా తాము విధులు నిర్వహిస్తూ వస్తున్నామన్నారు. ప్రతి ఏడాది విద్యా సంవత్సరం ప్రారంభంలో నామినల్ బ్రేక్ పిరియడ్ అనంతరం తమను విధుల్లో చేర్చుకునే వారన్నారు. అయితే ఈ ఏడాది ప్రిన్సిపాల్ ఒక్కో డిపార్ట్మెంట్ వారితో రివ్యూ పేరుతో ఇంటర్వ్యూలు నిర్వహించి తమను తొలగించేందుకు ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. సర్వీసు పునరుద్ధరణపై తమతో చర్చించేందుకు ప్రిన్సిపాల్ అనుమతించక పోవడం దారుణమన్నారు. ఉన్నతాధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.