
బస్సు చక్రాలు ఎక్కడంతో అటెండర్కు గాయాలు
మదనపల్లె రూరల్ : రోడ్డు ప్రమాదంలో బస్సు అటెండర్ తీవ్రంగా గాయపడిన ఘటన బుధవారం వాల్మీకిపురం మండలంలో జరిగింది. అనంతపురం నుంచి మదనపల్లె, వాల్మీకిపురం, తిరుపతి మీదుగా చైన్నెకి వెళ్లే ఇంద్ర ఆర్టీసీ బస్సు మంగళవారం రాత్రి బయలుదేరింది. బుధవారం తెల్లవారుజామున వాల్మీకిపురం మండలం విఠలం సమీపంలో డ్రైవర్ బస్సును హైవే మీదకు మళ్లించాడు. అయితే వెంటనే రోడ్డు పూర్తి కాలేదన్న కారణంతో..బస్సును వెనక్కు తిప్పేందుకు రివర్స్ తీస్తూ బస్సు అటెండర్ హరిప్రసాద్(58)ను గమనించమని చెప్పాడు. అతను బస్సు వెనుక వైపు నిల్చుని డ్రైవర్కు సూచనలిస్తూ అదుపుతప్పి కిందపడ్డాడు. ఇది గమనించని డ్రైవర్ బస్సును వెనక్కు నడపడంతో హరిప్రసాద్ కాళ్లపై బస్సు వెళ్లింది. దీంతో ప్రమాదంలో రెండుకాళ్లు విరిగాయి. వెంటనే స్థానికుల సహాయంతో బాధితుడిని మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించగా, మెరుగైన వైద్యం కోసం తిరుపతికి రెఫర్ చేశారు. వాల్మీకిపురం పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు.