
విద్యార్థిని అదృశ్యం
బి.కొత్తకోట : స్థానిక జయశ్రీ కాలనీ చెందిన విద్యార్థిని అదృశ్యంపై కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. 19 ఏళ్ల విద్యార్థిని బీసీఏ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. ఈ నెల 4న తల్లిదండ్రులు పొలం పనులకు వెళ్లగా.. ఇంట్లో ఉన్న విద్యార్థిని కనిపించలేదు. ఆచూకీ కోసం గాలించినా కనిపించలేదు. దీంతో కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
గుర్తుతెలియని వాహనం ఢీకొని ఆటో డ్రైవర్ మృతి
రాజంపేట : రాజంపేట –రాయచోటి ఘాట్ రో డ్డులోని ఎస్ఆర్పాలెం సమీపంలో శుక్రవారం గుర్తుతెలియని వాహనం ఢీకొని ఆటో డ్రైవర్ నాగరాజు(40) దుర్మరణం చెందారు. మృతుడు రాజంపేట పట్టణంలోని సుద్దగుంతలకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఆటో నడుపుకొని జీవిస్తున్న కుటుంబం ఇప్పుడు పెద్దదిక్కును కోల్పోయి కన్నీటిపర్యంతమవుతోంది. ఆటోను ఇసుక రవాణా చేస్తున్న టిప్పర్ ఢీకొందని, కేసుపై పోలీసులపై ఒత్తిడి పెరిగిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
అన్నమయ్య సామిల్లు దగ్ధం
రాజంపేట రూరల్ : నందలూరు మండలం ఎర్రిపాపయ్యగారిపల్లికి చెందిన పీ.హరికృష్ణ జీవనోపాధి కోసం డివిజనల్ సబ్ స్టేషన్ సమీపంలో సామిల్లు నడుపుకొంటున్నారు. శుక్రవారం అర్ధరాత్రి ఉన్నపాటుగా మిల్లులో మంటలు చెలరేగి కొయ్యలు దగ్ధమయ్యాయి. రాజంపేట అగ్నిమాపక అధికారి కే.మాబుసుభాన్, సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించారు. జిల్లా అగ్నిమాపక అధికారి సునీల్కుమార్ శుక్రవారం ఆ స్థలాన్ని సందర్శించారు. ప్రమాదానికి గల కారాణాలను ఆరా తీశారు.
గుర్తు తెలియని వ్యక్తి మృతి
ప్రొద్దుటూరు క్రైం : పట్టణంలోని శివాలయం సెంటర్ సమీపంలోని మైదుకూరు రోడ్డులో గుర్తుతెలియని వ్యక్తి శుక్రవారం మృతిచెందాడు. అతను శుక్రవారం రోడ్డుపై పడిపోయి ఉండడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. టూటౌన్ ఎస్ఐ రాఘవేంద్రారెడ్డి ఘటనా స్థలానికి చేరుకొని మృత దేహాన్ని పరిశీలించారు. మృతుడి ఆచూకీ కోసం చుట్టు పక్కల ప్రాంతాల్లో ఎస్ఐ ఆరా తీశారు. అతడికి సంబంధించిన వివరాలు లభించకపోవడంతో మృతదేహాన్ని జిల్లా ఆస్పత్రిలోని మార్చురీకి తరలించారు. మృతుడికి సుమారు 35ఏళ్లు ఉంటాయని పోలీసులు భావిస్తున్నారు. మద్యం మత్తులో డీ హైడ్రేషన్ కారణంగా అతను చనిపోయి ఉంటాడని తెలిపారు. మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులుంటే టూ టౌన్ పోలీసులను సంప్రదించాలని ఎస్ఐ కోరారు.

విద్యార్థిని అదృశ్యం