
ఉరికి వేలాడుతూ వివాహిత మృతి
అత్త, భర్త వేధింపులతోనే
చనిపోయిందని తల్లిదండ్రుల ఫిర్యాదు
మదనపల్లె రూరల్ : కుటుంబ సమస్యలతో వివాహిత ఉరికి వేలాడుతూ అనుమానస్పదంగా మృతి చెందిన సంఘటన శుక్రవారం మదనపల్లెలో వెలుగుచూసింది. బాధితుల వివరాల మేరకు.. మదనపల్లె పట్టణం, బికేపల్లి కాలనీకి చెందిన శివకేశవ, రెడ్డమ్మ దంపతుల కుమార్తె తేజశ్రీ (23)ను మదనపల్లె పట్టణం నీరుగట్టువారిపల్లి చౌడేశ్వరీనగర్కు చెందిన రఘుకు ఇచ్చి రెండేళ్ల కిందట వివాహం జరిపించారు. వీరికి ఏడాది కుమారుడు ఆదిత్య ఉన్నాడు. రఘు చేనేత చీరలకు రంగులద్దుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. గత కొంతకాలంగా రఘు మద్యానికి బానిస కావడంతో భార్యా, భర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. అదనపు కట్నం తేవాలని, మనుమడు తేజశ్రీకి ఆభరణాలు చేయించాలని కొంతకాలంగా కోడలు అత్త చల్లమ్మ వేధిస్తోంది. ఈ క్రమంలో రఘు స్వగ్రామం తమిళనాడు రాష్ట్రం సేలంలో జాతరకు వెళ్లాలని భార్యాభర్తలు నిర్ణయించుకున్నారు. గురువారం రాత్రి పొద్దుపోయినా రఘు ఇంటికి రాకపోవడంతో తేజశ్రీ భర్తకు ఫోన్ చేసింది. జాతరకు బయలుదేరాలి కదా.. త్వరగా ఇంటికి రమ్మని చెప్పింది. అయితే తనకు పని ఉందని, వేరే చోట పార్టీ ఉందంటూ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పాడు. దీంతో మనస్తాపానికి గురైన తేజశ్రీ ఇంట్లో తలుపునకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. బిడ్డ ఆదిత్య ఏడుపు విన్న స్థానికులు తలుపు బద్దలు కొట్టి లోపలికి వెళ్లి కిందకు దించి ఆస్పత్రికి తరలించారు. అల్లుడి ఇంటి వద్దకు చేరుకున్న తేజశ్రీ తల్లిదండ్రులు విషయం తెలుసుకని ఆస్పత్రికి వెళ్లగా అప్పటికే కుమార్తె మృతి చెందినట్లు ఆసుపత్రి వైద్యులు నిర్ధారించడంతో కన్నీటిపర్యంతమయ్యారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చే గదికి తరలించారు. తమ కుమార్తె మృతికి భర్త, అత్త వేధింపులే కారణమని, ఒంటిపై గాయాలున్నాయని, అనుమానం వ్యక్తం చేస్తూ మృతురాలి తండ్రి శివకేశవ, టూ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.