
గుప్త నిధుల ముఠా విధ్వంసం
పెద్దతిప్పసముద్రం : మండలంలోని కందుకూరు వ్యాసరాయసముద్రం చెరువు కట్టపై ఆంజనేయ స్వామి ఆలయంలో గురువారం రాత్రి గుర్తుతెలియని దుండగులు గుప్త నిధుల కోసం తవ్వకాలు చేపట్టి విధ్వంసం సృష్టించారు. నిమ్మకాయలతో మంత్రించిన అనంతరం క్షుద్ర పూజలు చేసి ఆంజనేయస్వామి విగ్రహాన్ని, బలమైన రాతి దూలాలు తొలగించారు. సొరంగాన్ని తలపించేలా లోతుగా తవ్వి ఆలయంబయట ధ్వజ స్థంభాన్ని పెకిలించారు. నిర్జన ప్రదేశంలో ఆలయాలు ఉండడంతో దుండగులు ఇష్టారాజ్యంగా తవ్వకాలు చేపట్టారు. చెరువు సంఘం అధ్యక్షుడు రమేష్బాబు, సర్పంచ్ రహ్మతుల్లా, సిబ్బంది ఘటనా స్థలాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. కట్ట దిగువ ఉన్న పురాతన వేదగిరి లక్ష్మినరసింహస్వామి ఆలయంలోనూ గత ఏడాది గోపురం, ధ్వజ స్తంభాలు పెకిలించారు. గుప్త నిధుల ముఠా సభ్యుల సంచారంపై పోలీసులు నిఘా పెట్టాలని ప్రజలు కోరుతున్నారు.
హనుమాన్ విగ్రహం,
ధ్వజ స్తంభం తొలగింపు
సొరంగంలా తవ్వి వదలేసిన దుండగులు