ఉపాధి పనుల్లో చేతివాటం | - | Sakshi
Sakshi News home page

ఉపాధి పనుల్లో చేతివాటం

May 4 2025 6:46 AM | Updated on May 4 2025 6:46 AM

ఉపాధి పనుల్లో చేతివాటం

ఉపాధి పనుల్లో చేతివాటం

గాలివీడు : గ్రామాల నుంచి వలసలను నివారించేందుకు ప్రవేశపెట్టిన ఉపాధి హామీ పథకం లక్ష్యం తప్పుతోంది. క్షేత్ర స్థాయిలో ఎలాంటి పనులు చేపట్టకపోయినా.. అధికారులు, సిబ్బందికి మామూళ్లు అందితే చాలు అంతా బాగుందని ధ్రువీకరించి మమ అనిపిస్తున్నారు. ఆకస్మిక తనిఖీలు అసలే లేకపోవడంతో అధికార పార్టీ పేరు చెప్పి ఫీల్డ్‌ అసిస్టెంట్లు దండుకుంటున్నారు. బోగస్‌ మస్టర్లు వేసి నిధులు తమ ఖాతాలకు మళ్లించుకుంటున్నారు. ఉపాధి హామీ పథకం అక్రమార్కులకు కాసులు కురిపిస్తోంది. ఉపాధిలో అవినీతిని అరికట్టేందుకు ఎన్ని విధానాలు ప్రవేశ పెడుతున్నా.. వీరి దోపిడీకి మాత్రం అడ్డుకట్ట పడటం లేదు. ఆన్‌లైన్‌లోని లొసుగులను ఆసరాగా తీసుకుని దొంగ మస్టర్లు, బోగస్‌ హాజరుతో నిధులు స్వాహా చేస్తున్నారు. పని ప్రదేశం నుంచి కూలీల ఫొటోలను మస్టర్‌తో కలిపి ఎన్‌ఎంఎంఎస్‌ యాప్‌లో నమోదు చేయాల్సి ఉండగా.. ఒక చోట నమోదు చేసిన ఫొటోలనే మరో మస్టర్‌కు నమోదు చేసి సొంత లాభం చూసుకుంటున్నారు. రోజుకు సగటున ప్రతి వ్యక్తికి రూ.307 కూలీగా నిర్ణయించారు. కూలీలు చేస్తున్న పనుల్లో కొలతలు వేస్తే.. అతి తక్కువగా కూలి పడుతోంది. ఇలాగైతే అధికారులు ఒప్పుకోకపోవడంతో కూలీలు పని చేసినా, చేయకపోయినా.. అధిక కూలి వేయక తప్పడం లేదని పలువురు క్షేత్రస్థాయి సిబ్బంది బాహాటంగానే చెబుతున్నారు. గాలివీడు మండలంలోని 17 గ్రామ పంచాయతీల్లో ఉపాధి హామీ పనుల అమలు తీరు ఇలాగే ఉంది. చాలా గ్రామాల్లో చేసిన పనులనే మళ్లీ మళ్లీ చేస్తున్నారు. వేసవి కాలంలో గ్రామాల్లో సుస్థిర అభివృద్ధి పనులు చేపట్టాల్సి ఉండగా, ఎక్కువగా ప్రాధాన్యం లేని పనులు చేపడుతున్నారు. పంట కాలువల నిర్మాణం, పూడికతీత, పొలం గట్లపై మొక్కల పెంపకం, పంట కుంటలు, సరిహద్దు కందకాలు వంటి ప్రాధాన్యం ఉన్న పనుల జోలికి వెళ్లడం లేదు.

అధికారులకూ వాటాలు

ఉపాధి హామీ సిబ్బంది మస్టర్లలో హాజరు వేసిన కూలీల్లో 50 శాతం మంది మాత్రమే క్షేత్రస్థాయిలో పని చేస్తున్నారు. మరో 50 శాతం కూలీల పేరిట బోగస్‌ హాజరు వేస్తున్నారు. చాలా గ్రామాల్లో సగటున రోజుకు 30 మంది హాజరవుతుంటే మరో 20 మంది పేరిట బోగస్‌ హాజరు వేస్తున్నారు. కూలీల ముఖచిత్రాలు తీయడం లేదు. పనులకు వెళ్లని వారి జాబ్‌ కార్డులు తీసుకుని వారికి హాజరు వేస్తున్నారు. ఖాతాల్లో జమయ్యే వేతనాన్ని ఫీల్డ్‌ అసిస్టెంట్లు, జాబ్‌ కార్డుదారులు సగం సగం పంచుకుంటున్నారు. ఈ విషయం అధికారులు, కిందిస్థాయి సిబ్బందికి తెలిసినా.. వారికి కూడా వాటాలు చెల్లిస్తున్నట్లు పలువురు ఫీల్డ్‌ అసిస్టెంట్లు స్వయంగా చెబుతున్నారు. ఒక్కొక్కరు ఐదు నుంచి పది గ్రూపుల వరకు బినామీ పేర్లతో నిర్వహిస్తున్నారు. వీరు సంబంధిత అధికారులు, సిబ్బందిని ప్రసన్నం చేసుకుని చేతివాటం చూపుతున్నట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రతి గ్రూపులో పనికి రాకుండానే వేతనాలు పొందుతున్న వారు పదుల సంఖ్యలో ఉన్నారు. బిల్లులు చేయించుకునేందుకు ఉపాధి కార్యాలయంలో కంప్యూటర్‌ ఆపరేటర్‌ మొదలు టీఏ, ఈసీ, ఏపీఓ, ఎంపీడీఓ స్థాయి వరకూ మామూళ్లు ముట్టచెబుతున్నట్లు సమాచారం.

బాధ్యులను వదిలేస్తున్నారు

క్షేత్రస్థాయిలో ఉపాధి హామీ పనులను ఫీల్డ్‌ ఆసిస్టెంట్లు, టీఏలు, ఈసీలు, ఏపీఓలు పర్యవేక్షించాలి. ఉపాధి పనుల్లో అవకతవకలు జరిగితే చర్యలు తీసుకోవాలి. సామాజిక తనిఖీల్లో అక్రమాలు బహిర్గతమై రికవరీకి ఆదేశిస్తే వెంటనే చర్యలు చేపట్టాలి. ఉపాధి హామీ నిబంధనల ప్రకారం రూ.10 వేలు రికవరీకి ఆదేశిస్తే ఫీల్డ్‌ అసిస్టెంట్‌, రూ.30 వేల రికవరీకి టెక్నికల్‌ అసిస్టెంట్‌, రూ.50 వేల రికవరీకి ఈసీలపై చర్యలు తీసుకోవాల్సి ఉంది. మండల వ్యాప్తంగా సామాజిక తనిఖీల్లో పెద్ద ఎత్తున అక్రమాలు జరుగుతున్నా, రికవరీలకు ఆదేశిస్తున్నా బాధ్యులపై మాత్రం చర్యలు తీసుకోలేదు. దీంతో ఉపాధి హామీ పనుల్లో అక్రమాలు హెచ్చుమీరుతున్నాయి.

క్షేత్రస్థాయిలో ఇలా..

మండలంలోని కొర్లకుంట గ్రామంలో ఏప్రిల్‌ 2024 నుంచి మార్చి 2025 వరకు జరిగిన పనుల్లో మస్టర్‌ నంబర్లు 144 3897, 1443904, 1443984, 1443961, 11320350, 1319181, 1320353, 1323769, 11320354, 11322061, 11322062, 1611308, 11320352, 1319195, 1320359. వీటిని నిశితంగా పరిశీలిస్తే పలువురు పనులకు వెళ్లకపోయినా వెళ్లినట్లుగా, కొందరు బయటి ప్రాంతాల్లో వున్నా బిల్లులు పెట్టడం వంటివి చేస్తున్నారు. ముఖ్యంగా కూలీ పనులకు వెళ్లని వారికి కూడా బోగస్‌ హాజరు వేసి.. వచ్చిన సొమ్ములో కొంత జాబ్‌ కార్డు దారుడికి ఇచ్చి మిగిలిన సొమ్ము ఫీల్డ్‌ అసిస్టెంట్లు నొక్కేస్తున్నారు. ఇలా మండలంలోని ప్రతి పంచాయతీ పరిధిలో ప్రతి రోజు దొంగ మస్టర్లు, ఒకరి స్థానంలో మరొకరి ఫొటోలు, కూలీల హాజరును ఎక్కువగా నమోదు చేస్తూ ఉపాధి నిధులను మింగేస్తూ జేబులు నింపుకొంటున్నారు.

దొంగ మస్టర్లతో బురిడీ

బోగస్‌ హాజరుతో వేతనాలు స్వాహా

అక్రమార్కులకు అధికారుల అండదండలు

పనులపై కొరవడిన పర్యవేక్షణ

చర్యలు తీసుకుంటాం

ఉపాధి హామీ పనుల్లో అవకతవకలకు పాల్పడితే బాధ్యులపై చర్యలు తీసుకుంటాం. పనులకు వచ్చే కూలీలను మాత్రమే మస్టర్‌ నమోదు చేసి వారి ఫొటోలనే అప్లోడ్‌ చేయాలి. ఎవరైనా బోగస్‌ మస్టర్లను నమోదు చేసినట్లుగా గుర్తిస్తే చర్యలకు వెనుకాడం.

– వెంకటరత్నం, పీడీ, డ్వామా, అన్నమయ్య జిల్లా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement